Begin typing your search above and press return to search.

బీజేపీకి నిద్రలేకుండా చేస్తున్న యడ్యూరప్ప డైరీ

By:  Tupaki Desk   |   22 March 2019 1:52 PM GMT
బీజేపీకి నిద్రలేకుండా చేస్తున్న యడ్యూరప్ప డైరీ
X
అసలే ఎన్నికల టైమ్‌. వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని ఎవ్వరూ వదులుకోరు. దీంతో.. బీజేపీని ఇరికించాలని కాంగ్రెస్‌ - కాంగ్రెస్‌ ను ఇరుకున పెట్టాలని బీజేపీ ప్రయత్నిస్తూనే ఉన్నాయి. మొన్నటివరకు రఫేల్ కుంభకోణం విషయంలో ఇరు పార్టీలు బాగానే దెబ్బలాడుకున్నాయి. ఆ తర్వాత ఒక వారం రోజులు చౌకీదార్‌ అంటూ చర్చలు చేపట్టాయి. ఇప్పుడు బీజేపీ పార్టీని కార్నర్ చేసేందుకు కాంగ్రెస్‌ తన అస్త్రాన్ని బయటకు తీసింది. ఇండియాలో టెక్నాలజీకి ఆద్యుడిగా చెప్పే శామ్‌ పిట్రోడా బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌ లో తీవ్రవాదులు ఉన్నంతమాత్రానా ఆ దేశం మొత్తాన్ని తీవ్రవాద దేశంగా చూడాల్సిన అవసరం లేదని అన్నారు. ఇక పుల్వామా ఘటనను కేంద్రం తన స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటుందని అభిప్రాయపడ్డారు. శామ్‌ పిట్రోడా వ్యాఖ్యలతో బీజేపీ డిఫెన్స్‌ పోడింది.

శామ్‌ పిట్రోడాని ఎలా డీల్‌ చెయ్యాలి అనే లోపే.. కాంగ్రెస్‌ మరో సంచలన ఆరోపణ చేసింది. బీజేపీ అగ్రనేతలకు కర్నాటక మాజీ సీఎం - పార్టీ సీనియర్‌ నేత బీఎస్‌ యడ్యూరప్ప నుంచి రూ 1800 కోట్ల ముడుపులు ముట్టాయని కాంగ్రెస్‌ ఆరోపించింది. ఓ వార్తాపత్రిక కథనాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌ పార్టీ బీజేపీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేసింది. అరుణ్‌ జైట్లీ - రాజ్‌ నాథ్‌ సింగ్‌ - నితిన్‌ గడ్కరీ సహా పలువురు బీజేపీ జాతీయ నేతలు - పెద్ద సంఖ్యలో న్యాయమూర్తులు - అడ్వకేట్లకు డబ్బు ఇచ్చినట్టు యడ్యూరప్ప తన డైరీల్లో రాసుకున్నారని ఈ కథనం సారాశం. ఈ కథనం వాస్తవమా..కాదా అనేది బీజేపీ తక్షణమే వివరణ ఇవ్వాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. యడ్యూరప్ప సంతకంతో కూడిన డైరీ 2017 నుంచి ఆదాయ పన్ను అధికారుల వద్ద ఉన్నప్పటికీ దీనిపై లోతైన విచారణ ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించింది. వెంటనే స్పందించిన బీజేపీ కూడా ఎదురుదాడికి దిగింది. బీజేపీని విమర్శించేందుకు కాంగ్రెస్‌ నకిలీ డైరీ పత్రాలను చూపుతోందని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. యడ్యూరప్ప డైరీలో వెలుగుచూసిన అంశాల ఆధారంగా చేస్తోన్న ఆరోపణలను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తోసిపుచ్చిందని చెప్పారు. అసలు డైరీ ఒరిజినల్‌ పత్రాలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. మీడియా కథనాల ఆధారంగా కాంగ్రెస్‌ తమ పార్టీపై బురదజల్లుతోందని కేంద్ర మంత్రి ఆరోపించారు. యడ్యూరప్పను కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ సమర్ధించారు. కాంగ్రెస్‌ పార్టీ అవాస్తవాలను ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తోందని దుయ్యబట్టారు. మొత్తానికి ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు బీజేపీ - కాంగ్రెస్‌ బాగానే కష్టపడుతున్నాయి.