Begin typing your search above and press return to search.

పైశాచికం: బెంగళూరులో నిర్భయ ఉదంతం

By:  Tupaki Desk   |   6 Oct 2015 5:45 AM GMT
పైశాచికం: బెంగళూరులో నిర్భయ ఉదంతం
X
కదులుతున్న బస్సులో అత్యంత పాశవికంగా అత్యాచారం చేసిన నిర్భయ ఉదంతాన్ని పోలినట్లు ఉండే దుర్మార్గం బెంగళూరులో చోటు చేసుకుంది. మూడేళ్ల క్రితం ఢిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతాన్నిఈ ఘటన పోలి ఉండటం గమనార్హం. ప్రస్తుతం బాధితురాలు అపస్మారక స్థితితో ఉండి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి. పైశాచికంగా అత్యాచారం చేసిన వైనం వైద్యులు సైతం విభ్రాంతికి గురి అవుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు రెండు గంటల పాటు సదరు యువతి నరకయాతన పడి ఉంటుందని చెబుతున్నారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన గురించి చదివితే మనసు చేదెక్కిపోవటం ఖాయం.

బెంగళూరులోని ఒక బీపీవో కంపెనీలో గ్వాలియర్ కు చెందిన ఒక యువతి పని చేస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా శనివారం రాత్రి బెంగళూరుకు సమీపంలోని హోసూరు మార్గంలో మడివాళ సమీపంలో ఆఫీసు నుంచి తిరిగి వచ్చి.. ఇంటికి వెళ్లేందుకు బస్లాప్ లో వాహనం కోసం ఎదురుచూస్తోంది. అదే సమయంలో క్యాబ్ ను పోలి ఉండే వాహనం రావటం.. అందులో ఆమె ఎక్కేయం జరిగిపోయింది. మధ్యలో మరో ఇద్దరు వాహనంలో ఎక్కటం.. వారి వైఖరి అనుమానాస్పద రీతిలో ఉండటంతో ఆమె అలెర్ట్ అయ్యే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

కదులుతున్న కారులో బెంగళూరు రోడ్ల వెంట తిప్పుతూ.. ఆమెను అత్యంత పాశవికంగా అత్యాచారం చేసినట్లు చెబుతున్నారు. ఈ విధమైన నరకం దాదాపు రెండు గంటల పాటు సాగిందని పోలీసులు చెబుతున్నారు. అపస్మారక స్థితికి చేరిన ఆ యువతిని.. ఒక గుడి వద్ద పడేసి దుండగులు వెళ్లిపోయారు. ఆ యువతిని గుర్తించిన స్థానిక ఆటో డ్రైవర్లు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఆమె.. అపస్మారక స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది.