Begin typing your search above and press return to search.

ముల్లును ముల్లుతోనే..కేసీఆర్ పై బీజేపీ అస్త్రం ఇతడే!

By:  Tupaki Desk   |   16 Sep 2019 6:36 AM GMT
ముల్లును ముల్లుతోనే..కేసీఆర్ పై బీజేపీ అస్త్రం ఇతడే!
X
ఉమ్మడి ఏపీలో ఆదినుంచి అధికారం మూడు సామాజికవర్గాల చుట్టే చేతులు మారేది. అదే రెడ్డి, కమ్మ, వెలమ. ఇప్పుడు కూడా ఈ మూడు సామాజికవర్గాల నేతలకే సీఎం పీఠం దక్కడం.. ఆ దిశగా నాయకులను ప్రోత్సహించడం జరుగుతుంటోంది.

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజికవర్గ దిగ్గజ నేతలతో నిండిపోయింది. ఉత్తమ్ రెడ్డి - కోమటిరెడ్డి - రేవంత్ రెడ్డి - జీవన్ రెడ్డి ఇలా సీఎం రేసులో చాలా మంది రెడ్డీలే ముందంజలో ఉన్నారు. ఇక టీడీపీలో కమ్మ సామాజికవర్గానిదే పైచేయి. దానికి చంద్రబాబే కర్త కర్మ క్రియ.. ఆ తర్వాత ఆయన కుమార పుత్రరత్నం పేరే వినిపిస్తోంది. ఇక వైసీపీ ప్రభుత్వ అధినేత జగన్ మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు ఏపీలో అధికారం చెలాయిస్తున్నారు..

తెలంగాణలో ఇప్పుడు బలమైన వెలమ సామాజికవర్గం తరుఫున కేసీఆర్ రాజ్యమేలుతున్నారు. కేసీఆర్ కు ధీటైన నాయకుడిగా బీజేపీలో ఫోకస్ చేయడానికి అంతటి శక్తిసామర్థ్యాలు - పలుకుబడి నీట్ ఇమేజ్ ఉన్న నేత కోసం బీజేపీ అన్వేషిస్తోంది..

ఇప్పటికే కిషన్ రెడ్డి - డా లక్ష్మన్ లాంటి వాళ్లకు పగ్గాలు అప్పగించినా తెలంగాణలో బీజేపీకి అంతటి ఊపు - బలం రాలేదు. ఈ నేపథ్యంలోనే టీఆర్ ఎస్ లాగే వెలమలను తెరపైకి తీసుకురావడానికి బీజేపీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

తాజాగా మహారాష్ట్ర గవర్నర్ గా రిటైర్ అయిన విద్యాసాగర్ రావు బీజేపీకి ఆశాకిరణంలా కనిపిస్తున్నారు. ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటారని అందరూ భావించారు. కానీ సోమవారం మళ్లీ ఆయన తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి వచ్చి పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నారు. తెలంగాణలో అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్న బీజేపీ అందుకు అనుగుణంగానే విద్యాసాగర్ రావును తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించిందన్న చర్చ ఈ పరిణామంతో బీజేపీలో సాగుతోంది.