Begin typing your search above and press return to search.

బీజేపీ ఏకఛత్రాధిపత్యానికి బంగాళాఖాతమే అడ్డు

By:  Tupaki Desk   |   16 May 2018 5:29 PM GMT
బీజేపీ ఏకఛత్రాధిపత్యానికి బంగాళాఖాతమే అడ్డు
X
2014తో మొదలైన నరేంద్ర మోదీ - బీజేపీ హవా ఇప్పుడు ఎంతటి పెనుగాలిగా మారిందో తెలిసిందే. దేశంలోని 21 రాష్ట్రాల్లో అధికారం అందుకున్న ఆ పార్టీ ఇప్పుడు కర్ణాటకలోనూ అతి పెద్ద పార్టీగా అవతరించి తన రాజకీయ వ్యూహాలతో అక్కడా అధికారం కైవసం చేసుకోవడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. దాదాపుగా భారతదేశమంతా తన జెండా ఎగరేస్తున్న ఆ పార్టీ తూర్పున ఉన్న బంగాళాఖాత తీర రాష్ట్రాలను మాత్రం గెలుచుకోలేకపోతుంది. ఉత్తర - మధ్య భారతాలను మొత్తం(పంజాబ్ మినహా) తన ఖాతాలో వేసుకున్న ఆ పార్టీ దక్షిణభారతంలో మాత్రం అధికారంలో లేదు. ఇంతకుముందు కర్ణాటకలో అధికారంలో ఉన్నా నిన్నమొన్నటివరకు అక్కడా చేదు అనుభవాలే ఎదుర్కొంది. కానీ.. కర్ణాటకలో అతిపెద్ద పార్టీగా అవతరించి ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఇప్పుడు రాజకీయం చేస్తుండడంతో అక్కడ సఫలమైతే కేరళ మినహా అరేబియా సముద్ర తీర రాష్ట్రాల్లోనూ పాగా వేసినట్లవుతుంది.

దాదాపుగా ఉత్తర - పశ్చిమ - మధ్య - ఈశాన్య భారతమంతా అధికారం అందుకున్న ఆ పార్టీ తూర్పున మాత్రం కాలు మోపలేకపోతుంది. తూర్పున బంగాళాఖాత తీర రాష్ట్రాలైన పశ్చిమబెంగాల్ - ఒడిశా - ఆంధ్రప్రదేశ్ - తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్‌ ను ఆనుకునే ఉన్న తెలంగాణలో ప్రభుత్వాల ఏర్పాటుకు ఏమాత్రం దగ్గర్లో కనిపించడం లేదు. దీంతో బీజేపీ బంగాళాఖాతాన్ని టచ్ చేయలేకపోతున్నట్లవుతోంది.

బెంగాల్‌ లో కొద్దికాలంగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నా బీజేపీకి అక్కడ పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవు. మొన్న అక్కడ జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ తృణమూల్‌ దే హవా. అలాగే ఒడిశాలోనూ 2019లో బిజూ జనతాదళ్‌ ను ఎదుర్కోవడం బీజేపీకి ఆషామాషీ ఏమీ కాదు. స్థానిక ఎన్నికల్లో బీజేపీ అక్కడ కొంత ప్రభావం చూపినా ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో బొక్క బోర్లా పడింది. 2019లో ఒడిశాను గెల్చుకుంటామంటూ బీజేపీ నేతలు బీరాలు పలుకుతున్నా ఆ గొంతుల్లో ధైర్యం కనిపించడం లేదు. అంతేకాదు.. అక్కడ నవీన్‌ ను ఎదుర్కొని నిలిచే నాయకత్వమే అసలు కనిపించడం లేదు.

ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే ప్రత్యేక హోదా విషయంలో చేసిన మోసం బీజేపీని ఏపీలో ఒక్క సీటు కూడా గెలవనిస్తే గొప్పే. తమిళనాడులోనూ జయ మరణం నుంచి ఎంత రాజకీయం చేసినా బీజేపీ పప్పులు ఉడకలేదు. దీంతో దేశ నలు సరిహద్దులకూ విస్తరించాలనుకుంటున్న బీజేపీ కలలు బంగాళాఖాతంలో కలుస్తున్నట్లుగానే కనిపిస్తోంది.