Begin typing your search above and press return to search.

టీడీపీ ఓట‌మికి ల‌క్ష్మ‌ణ్ కొత్త లెక్క‌

By:  Tupaki Desk   |   15 Dec 2018 2:25 PM GMT
టీడీపీ ఓట‌మికి ల‌క్ష్మ‌ణ్ కొత్త లెక్క‌
X
తెలంగాణ ఎన్నిక‌ల్లో తీవ్ర ప‌రాజ‌యం పాలైన తెలుగుదేశం పార్టీ గురించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆస‌క్తిక‌ర‌మైన విశ్లేష‌ణ చేశారు. ఇవాళ హైదరాబాద్‌ లో ఆయన మాట్లాడుతూ ఓటమికి సమిష్టి బాధ్యత తీసుకుంటామన్నారు. తెలంగాణ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తున్నామని చెప్పారు. సెంబ్లీ ఎన్నికలను ప్రజలు తెలంగాణవాదులు, తెలంగాణ వ్యతిరేకుల మధ్య పోరాటంగా భావించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విశ్లేషించారు. అందుకే చంద్రబాబు కూటమిని ఓడించి టీఆర్‌ ఎస్‌ ను గెలిపించారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ తో చంద్రబాబునాయుడు కలవడాన్ని కేసీఆర్‌ అడ్వాంటేజ్‌ గా తీసుకున్నారని.. తెలంగాణ-తెలంగాణ వ్యతిరేకుల మధ్య పోటీగా చిత్రీకరించి విజయం సాధించారని అన్నారు. వచ్చిన తెలంగాణ మళ్లీ పోతుందేమోననే ఉద్వేగాన్ని కేసీఆర్‌ తీసుకురాగలిగారని లక్ష్మణ్‌ అన్నారు.

ఎలక్షన్ కమిషన్ సరిగా వ్యవహరించలేదని, ఓట్లలో తేడాలో కనిపిస్తున్నాయని ల‌క్ష్మ‌ణ్ చెప్పారు. తమకు కొన్ని అనుమానాలున్నాయని.. ఈ విషయమై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇక.. కొన్ని చోట్ల పోలీసులే డబ్బులు పంచారన్న ఆయన.. మద్యం ఏరులైపారిందని చెప్పారు. లోక్‌ సభ ఎన్నికలకు సమాయత్తమవుతామన్న లక్ష్మణ్‌.. త్వరలోనే పూర్తిస్థాయి కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తామన్నారు. 24వ తేదీన పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా.. పార్లమెంట్‌ క్లస్టర్ల వారీగా సమావేశమవుతారని ఆయన చెప్పారు. కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అమిత్‌షా సూచించారని పేర్కొన్నారు. ఈ నెల 24 న తెలంగాణలో అమిత్‌ షా పర్యటన ఉంటుందని చెప్పారు. డిసెంబర్ చివరి లేదా జనవరి మొదటి వారంలో ప్రధాని మోదీ కూడా తెలంగాణలో పర్యటిస్తారని వివరించారు. పార్టీ బలోపేతం, ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగడంపై దృష్టిపెట్టబోతున్నామని వెల్లడించారు. రాఫెల్ డీల్‌పై సుప్రీంకోర్టు తీర్పుతో నైనా కాంగెస్ పార్టీకి కనువిప్పు కలుగుతుందని భావిస్తున్నట్టు చెప్పారు.