Begin typing your search above and press return to search.

తెలంగాణ బీజేపీ..చావుత‌ప్పి క‌న్నులొట్ట పోయింది

By:  Tupaki Desk   |   12 Dec 2018 4:45 AM GMT
తెలంగాణ బీజేపీ..చావుత‌ప్పి క‌న్నులొట్ట పోయింది
X
``అధికారం మాదే...మేం లేకుండా ఏ ప్రభుత్వమూ ఏర్పడదు.. టీఆర్ ఎస్ కోరితే మేం మద్దతిస్తాం కానీ, మేం చెప్పినట్లే వినాల్సిందే..``ఇవీ ఫలితాలకుముందు భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలు చేసిన ప్రకటనలు - విధించిన ష‌ర‌తులు. అయితే ఎన్నిక‌ల్లో ఫ‌లితాల్లో ఆ పార్టీకి మైండ్ బ్లాంక‌య్యే షాక్ త‌గిలింది. 118 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ.. ఒక్క గోషామహల్‌ లోనే గెలుపొందింది. అది కూడా అక్క‌డి ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్య‌క్తిగ‌త చ‌రిష్మా ఫ‌లితంతోనే అని అంటున్నారు. ఎందుకంటే...పార్టీకి చెందిన ముఖ్య‌లైన రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ - శాసనసభాపక్ష నేత జీ కిషన్‌ రెడ్డి - మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ ఎన్వీఎస్సెస్ ప్రభాకర్ ఓటమి పాలయ్యారు కాబ‌ట్టి.

తెలంగాణ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న బీజేపీ నేత‌లు ప్రధానమంత్రి నరేంద్రమోడీ - బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌ షా - పలు రాష్ర్టాల సీఎంలు - పలువురు కేంద్ర మంత్రులు - ఇలా అనేకమందితో విస్తృతంగా ప్రచారం చేయించింది. దీని వల్ల సానుకూల ఫలితాలు వస్తాయనే భావనను రాష్ట్ర నాయకులు వ్య‌క్తం చేశారు. అయితే, సీట్ల సంఖ్య పెర‌గ‌డం అటుంచి ఉన్న సీట్లు కూడా పార్టీ కోల్పోయింది. అప్ప‌టివ‌ర‌కు తాము ప్రాతినిధ్యం వ‌హిస్తున్న 5 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో కేవ‌లం ఒక్క చోట మాత్ర‌మే గెలుపొందింది. తద్వారా నామ‌మాత్ర‌పు పాత్ర‌కు ప‌రిమితం అయింది. దీంతో తెలంగాణ ఇప్పుడు అవ‌కావం చిక్కితే అధికారం లేక‌పోతే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం హోదా అయినా ద‌క్కించుకోవ‌డం అనే బీజేపీ ల‌క్ష్యం నెర‌వేర‌లేక‌పోయింది.

బీజేపీ వైపు ఓటర్లు ఆకర్షితులు కాకపోవడానికి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల వ్యతిరేకతే కారణంగా కనిపిస్తోంది. నోట్లరద్దు - జీఎస్టీతో అన్ని వర్గాల ప్రజలూ అసంతృప్తితో ఉన్నారు. బీజేపీ హిందూత్వవాదాన్ని రెచ్చగొట్టి ఓట్లుపొందాలని భావించింది. హిందువుల ఓట్లు ఎక్కువ ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టిసారించింది. అయినప్పటికీ సిట్టింగ్ స్థానాల్లోనూ ఓడిపోయింది. ముషీరాబాద్‌ లో బీజేపీ ఒంటరిగా బ‌రిలోకి దిగ‌లేదు. ఈ ద‌ఫా ఆ సాహ‌సం చేసినా గెలవలేదు. అంబర్‌ పేట్‌ లోనూ బీజేపీకి ఓటమి తప్పలేదు. కాగా, ఈ పరిణామాలపై బీజేపీ జాతీయ నేతలు ఆగ్ర‌హం ఉన్న‌ట్లు స‌మాచారం. నివేదిక స‌మ‌ర్పించాల‌ని కోరినట్లు తెలుస్తున్నది.