Begin typing your search above and press return to search.

ఏపీలో బీజేపీకి కాంగ్రెస్ ప‌క్క‌నే స‌మాధి

By:  Tupaki Desk   |   6 May 2016 8:05 AM GMT
ఏపీలో బీజేపీకి కాంగ్రెస్ ప‌క్క‌నే స‌మాధి
X
ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్టాన్ని అడ్డ‌గోలు ముక్క‌లు చేసి సీమాంధ్రుల ఆగ్ర‌హాన్ని చ‌విచూసిన కాంగ్రెస్ పార్టీకి ప‌ట్టిన గ‌తే ఇప్పుడు బీజేపీకి ప‌ట్ట‌బోతున్న సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ప్ర‌త్యేక హోదా విష‌యంలో క‌ల్ల‌బొల్లి మాట‌లు చెబుతున్న బీజేపీకి ఏపీ ప్ర‌జ‌లు కాంగ్రెస్ పార్టీ ప‌క్క‌నే స‌మాధి క‌ట్టే స‌మ‌యమొచ్చిన‌ట్లుగా ప‌రిస్థితులు చెబుతున్నాయి. సీమాంధ్ర‌లో స్థిర‌ప‌డాల‌ని వ్యూహాలు ర‌చిస్తున్న బీజేపీకి సీట్లు కాదు క‌దా ఓట్లు రావ‌డం కూడా క‌ష్ట‌మయ్యేట‌ట్లుగా ఉంది. బీజేపీ స్వ‌యం కృతాప‌రాధాలు ఇప్పుడు ఆ పార్టీకి కాంగ్రెస్ ప‌క్క‌నే స‌మాధి సిద్ధం చేస్తున్నాయి.

రాష్ట్రానికి హోదా విషయంలో మొండిచేయి చూపించిన బీజేపీ నాయకులపై ప్రజలు మండిపడుతున్నారు. రాష్ట్రాన్ని అడ్డుగోలుగా విభజించి కాంగ్రెస్ పాపం చేస్తే ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ మ‌హాపాపం చేసింద‌ని మండిప‌డుతున్నారు జ‌నం. ఇన్నాళ్లు కళ్లబొళ్లి మాటలు చెప్పిన బీజేపీ రాష్ట్ర నాయకులను నిలదీసేందుకు ప్రజలు సిద్ధ‌మ‌వుతున్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. ఈ ప్ర‌మాదాన్ని గుర్తించే రాష్ట్ర బీజేపీ నేత‌లు తేలు కుట్టిన దొంగ‌ల్లా సైలెంట‌యిపోయారని చెబుతున్నారు.

రాష్ట్రాభివృద్ధికి అన్ని విధాల సహకారం అందిస్తామని చెప్పిన నేతలు ఇప్పుడు క‌లుగుల్లో దూరిపోయారు. ఇంత‌కాలం మిత్ర‌ప‌క్షం టీడీపీపై రాళ్లు రువ్విన బీజేపీ నేత‌లు కేంద్రంలోని త‌మ నేత‌లు - త‌మ మంత్రులు ఏపీ ప్రత్యేక హోదాపై దారుణ ప్ర‌క‌ట‌న‌లు చేస్తుండ‌డంతో కుడితిలో ప‌డ్డ బ‌ల్లుల్లా గిల‌గిల‌లాడుతున్నారు. మ‌రోవైపు ఇంత‌కాలం మిత్ర‌ప‌క్ష‌మ‌న్న స్నేహ‌నీతితో బీజేపీ రాష్ట్ర నేత‌ల విమ‌ర్శ‌లు స‌హించిన టీడీపీ నేత‌లు ఇప్పుడు ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఆంధ్ర ప్రజలు అసమర్థలు కాదు, అన్యాయం చేస్తే సరైన గుణపాఠం చెబుతారంటూ ఎమ్మెల్యే బొండా ఉమా హెచ్చరించ‌డం ఇందుకు ఉదాహ‌ర‌ణ‌? బీజేపీ తలకిందులైన ఏపీలో అధికారంలోకి రాదని మరో టీడీపీ ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్ అన్నారు. రాజధాని కూడా లేకుండా విడగొట్టినందుకే వందల ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీనే ఏపీలో భూస్థాపితం చేశామని, ఇప్పుడు అలాంటి పరిస్థితి బీజేపీకి గ్యారంటీ అని హెచ్చరిస్తున్నారు. బీజేపీ రాజ‌కీయ ప‌న్నాగాలు పూర్తిగా బ‌య‌ట‌ప‌డ‌డంతో టీడీపీ నేత‌లకు త‌త్వం బోధ‌ప‌డి త‌మ గ‌ళం పెంచుతున్నారు. టీడీపీ తో మిత్రపక్షంగా ఉన్న బీజేపీ రానున్న ఎన్నికలలో ఒక్క సీటు కాదు కదా డిపాజిట్లు కూడా దక్కవని విజయవాడకు చెందిన సమైక్యాంధ్ర పోరాట నాయకుడు పండూరి భాస్కర్ పేర్కొన‌డం దీనికి మ‌రో ఉదాహ‌ర‌ణ‌. విభజన సమయంలో ఢిల్లీ వెళ్లి పోరాటం చేశామని, పార్లమెంట్‌ లో రాష్ట్రానికి హోదా పదేళ్లు కావలన్న వెంకయ్యనాయుడు మాటలు నిజమని భావించామని... ఏపీలో ఎక్కడ‌ బీజేపీ నాయకులు కనపడినా ప్రశ్నిస్తామని ఆయన హెచ్చరించారు.

ముఖ్యంగా నిర్మలా సీతారామన్ - వెంకయ్యనాయుడు లాంటి కేంద్రమంత్రులపై ప్ర‌జ‌లు మ‌రింత మండిప‌డుతున్నారు. ఢిల్లీ పెద్దలకు ఇక్కడి పరిస్థితులు తెలియకపోయినా.. వారికి తెలియజెప్పడంలో బీజేపీ తెలుగు నేతలు ఏం చేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా పురందరేశ్వరి - ఎంపీ కంభంపాటి హరిబాబు ఏపీ పరిస్థితిపై ఏ విధంగా స్పందిస్తారోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలోనూ బీజేపీపై ప్రజాగ్రహం పెరుగుతోంది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి 704 రోజులు గడిచినా హోదా ప్రకటించలేదని రోజులతో లెక్కగడుతూ పోస్టింగ్‌ లు దర్శనమిస్తున్నాయి. ప్ర‌త్యేక హోదా - విశాఖకు రైల్వే జోన్ - ఆర్థిక లోటు భ‌ర్తీ - పోల‌వ‌రం - రాజ‌ధాని నిర్మాణం విషయాల్లో బీజేపీ తీరు ఆ పార్టీని దెబ్బ‌తీసే సూచ‌న‌లు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి.