Begin typing your search above and press return to search.

జ‌మ్ముకాశ్మీర్ ముఖ్య‌మంత్రి రాజీనామా!

By:  Tupaki Desk   |   19 Jun 2018 10:45 AM GMT
జ‌మ్ముకాశ్మీర్ ముఖ్య‌మంత్రి రాజీనామా!
X
బీజేపీ సార‌థ్యంలోని ఎన్డీఏ కూట‌మీలో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. గ‌త కొద్దికాలంగా ఎన్డీఏ కూట‌మిలోని బీజేపీ మిత్ర‌ప‌క్షాలు ఆ పార్టీ పోక‌డ‌లు న‌చ్చ‌కుండా దూర‌మ‌య్యేందుకు నిర్ణ‌యం తీసుకుంటే....తాజాగా బీజేపీయే...త‌మ మిత్రప‌క్షానికి గుడ్ బై చెప్పేసింది. ఈ ప‌రిణామం చోటుచేసుకుంది దేశ స‌రిహ‌ద్దుల్లో క‌ల్లోలానికి కేరాఫ్ అడ్ర‌స్‌ గా మారిన జమ్ముకశ్మీర్‌ లో. జ‌మ్ముక‌శ్మీర్‌ లో పీడీపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మిత్ర‌బంధానికి బీజేపీ గుడ్‌ బై చెప్పేసింది. భార‌తీయజ‌న‌తా పార్టీ ప్రధాన కార్యదర్శి, జమ్ముకశ్మీర్ ఇన్‌ చార్జ్ రాంమాధవ్ ఈ విష‌యాన్ని వెల్లడించారు. బీజేపీ ప్ర‌భుత్వం నుంచి వైదొల‌గ‌డంతో సీఎం ప‌ద‌వికి మెహ‌బూబా ముఫ్తీ రాజీనామా చేశారు.

జ‌మ్మూక‌శ్మీర్‌ లో పాల‌న స్తంభించే ప‌రిస్థితికి ముందు అనేక ఆస‌క్తిక‌ర ఘ‌ట్టాలు చోటుచేసుకున్నాయి. కథువా రేప్ కేసు విషయంలో నిందితులకు మద్దతుగా బీజేపీ మంత్రులు ర్యాలీ నిర్వహించినపుడు కూడా ప్రభుత్వం నుంచి తప్పుకుంటామని పీడీపీ హెచ్చరించింది. కాల్పుల విరమణ విషయంలో రెండు పార్టీల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. రంజాన్ ముగిసిన మరుసటి రోజే కాల్పుల విరమణను కేంద్రం విరమించుకుంది. జర్నలిస్ట్ షుజాత్ బుఖారీ హత్య, జవాను ఔరంగజేబ్ కిడ్నాప్ - హత్యలతో కేంద్రం కాల్పుల విరమణను పొడిగించేందుకు నిరాకరించింది. రంజాన్ తర్వాత కూడా కశ్మీర్‌ లో కాల్పుల విరమణను కొనసాగించాలని సీఎం మెహబూబా ముఫ్తీ డిమాండ్ చేయగా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం అందుకు నిరాకరించింది. దీంతో రెండు పార్టీల మధ్య మరోసారి విభేదాలు తలెత్తాయి.

ఇలా ప్ర‌భుత్వం మ‌నుగ‌డ ప్ర‌శ్నార్థ‌కంగా మారుతున్న స‌మ‌యంలో జ‌మ్ముక‌శ్మీర్‌ రాష్ర్టానికి చెందిన బీజేపీ నేతలు - మంత్రులు.. అమిత్ షాతోపాటు ఇతర అధిష్టాన పెద్దలను కలిశారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా సోమవారం కలిశారు. అన‌త‌రం ఈ నిర్ణ‌యం వెలువ‌డింది. కశ్మీర్‌ లో ఉగ్రవాదం - హింస పెరిగిపోయిందని, పౌరుల ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగిందని రాంమాధవ్ విమర్శించారు. జర్నలిస్ట్ షుజాత్ బుఖారీ హత్యే దీనికి నిదర్శనమని అన్నారు. దేశ సమ‌గ్ర‌త‌ - ప్ర‌యోజ‌నాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో ప‌రిస్థితుల‌ను అదుపులోకి తీసుకురావాల‌న్న ఉద్దేశంతో అధికారాన్ని గ‌వ‌ర్న‌ర్‌ కు ఇవ్వాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు రాంమాధ‌వ్ స్ప‌ష్టంచేశారు. పీడీపీతో కలిసి సాగడం ఇక బీజేపీ వల్ల కాదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయ‌న వెల్ల‌డించారు.