Begin typing your search above and press return to search.

గంగా, య‌మున, స‌ర‌స్వ‌తితోనే బాబుకు గ‌ట్టిపోటీ

By:  Tupaki Desk   |   15 Jun 2018 6:45 AM GMT
గంగా, య‌మున, స‌ర‌స్వ‌తితోనే బాబుకు గ‌ట్టిపోటీ
X
తెలుగు రాష్ర్టాల‌పై ప్ర‌త్యేక ఫోక‌స్ పెట్టిన బీజేపీ ఈ క్ర‌మంలో త‌గు కార్యాచ‌ర‌ణ‌ను సైతం వేగంగా ముందుకు తీసుకుపోతోంది. ఈ లెక్క‌ల‌ను స‌హ‌జంగానే ప్రాంతీయ నేత‌లు వెల్ల‌డిస్తున్నారు. అయితే తాజాగా ఓ జాతీయ నాయ‌కుడు ఇదే అంశాన్ని వ్య‌క్తీక‌రించ‌డ‌మే కాకుండా ఆస‌క్తిక‌రమైన అనేక అంశాల‌ను పంచుకున్నారు. ప్ర‌ధానంగా ఏపీ గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌నే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి మురళీధరరావు. త‌న‌ను క‌లిసిన పాత్రికేయుల‌తో మాట్లాడిన ముర‌ళీధ‌ర్ రావు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణ భారతదేశంలో 120 లోక్‌సభ సీట్లను గెలుచుకునేందుకు పార్టీ కేంద్ర నాయకత్వం ఎన్నికల వ్యూహం రచిస్తోందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 40 రోజుల పర్యటన కార్యక్రమాన్ని కూడా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రూపొందిస్తున్నారని ఆ పర్యటనలో భాగంగా ఈ నెల 22 తర్వాత అమిత్‌షా తెలంగాణకు వస్తారని, అదే పర్యటనలో తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాలు కూడా పర్యటించనున్నారని అన్నారు. ప్రధాని కూడా తెలుగు రాష్ట్రాలలో పర్యటిస్తారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ను తదుపరి పర్యటనలో సందర్శిస్తారని, కొత్త అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అక్కడి పరిస్థితులను జాతీయ అధ్యక్షుడికి వివరించారని మురళీధరరావు తెలిపారు.

ఆంధ్రాలో సార్వత్రిక ఎన్నికల తర్వాత టీడీపీ ఉండదని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి మురళీధరరావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.ఏపీలో అమిత్‌షా పర్యటన తర్వాత పరిస్థితులు మారుతాయన్నారు. ఆంధ్రాలో చంద్రబాబు ప్రభుత్వం పనితీరుపైనా, ఆ పార్టీ నాయకులపైనా స్థానికంగా తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోందని, అయితే ఈ అవకాశం వైకాపాకు ఇవ్వకుండా బీజేపీ తీసుకునేందుకు తగిన వ్యూహంతోనే ముందుకు వస్తామని అన్నారు. చంద్రబాబుకు గంగా యమున సరస్వతి పార్టీలు గట్టి పోటీ ఇస్తాయని అన్నారు. గంగ ఎవరో యుమున ఎవరో సరస్వతి ఎవరో త్వరలోనే తెలుస్తుందని అన్నారు. సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ సర్వం సిద్ధమైందని, ఆంధ్రాలో టీడీపీతో, తెలంగాణలో టీఆర్ఎస్‌తో గట్టి పోటీ అనివార్యమని , ఈ రెండు పార్టీలతో పొత్తులకు దిగే ప్రసక్తే లేదని అన్నారు. బీజేపీ రానున్న రోజుల్లో సాహసవంతమైన నిర్ణయాలను తీసుకోనుందని పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో సెంటిమెంట్‌ను ముందుకు తీసుకువెళ్తామని, అవినీతి ప్రధాన అజెండా కాబోతోందని అన్నారు. టీడీపీ, టీఆర్ఎస్ పార్టీల అవినీతిపై మిగిలిన అన్ని పార్టీలూ పెద్ద ఎత్తున పోరు సాగిస్తారని చెప్పారు. తెలంగాణలో సైతం పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, టీఆర్ఎస్‌తో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు కుదుర్చుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.