Begin typing your search above and press return to search.

పుండు మీద కారం..ఉన్నావ్‌ లో బీజేపీ ఎంపీ నిర్వాకం

By:  Tupaki Desk   |   16 April 2018 10:50 AM GMT
పుండు మీద కారం..ఉన్నావ్‌ లో బీజేపీ ఎంపీ నిర్వాకం
X
సాక్షి మహరాజ్‌...బీజేపీ ఎంపీ. త‌రచూ వివాదాలతో వార్తలలో నిలిచే క‌మ‌ల‌నాథుల లిస్ట్‌లో ముందుండే పేరు ఇది. హిందువుల‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డంలో భాగంగా త‌ను అనుకున్న‌ది బాజాప్తా చెప్పేస్తుంటారు. స‌హ‌జంగానే వాటిని విప‌క్షాలు వాటిని వివాదాస్ప‌దం చేస్తుంటాయి. ప్ర‌తిప‌క్ష పార్టీల‌పై విమ‌ర్శ‌లు చేయ‌డంలో ముందుండే ఈ ఎంపీ ఇపుడు మ‌రో వివాదానికి తెర‌తీశారు. బీజేపీ ఎంపీ సాక్షీ మహారాజ్ మళ్లీ చిక్కుల్లో పడ్డారు. ఆదివారం లక్నోలో ఆయన ఓ నైట్ క్లబ్‌ను ప్రారంభించి సంచల‌నం సృష్టించారు.

ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ఎంపీ సాక్షీ మహారాజ్.. అలీగంజ్ ప్రాంతంలో లెట్స్ మీట్ అనే నైట్‌ క్లబ్‌ ను ప్రారంభించడం వివాదాస్పదమైంది. రిబ్బన్ కట్టింగ్ కార్యక్రమంలో ఎంపీ పాల్గొనడం పట్ల కొందరు విమర్శలు చేస్తున్నారు. ఉన్నావ్ లోక్‌సభ స్థానానికి చెందిన ఎంపీ సాక్షీ.. ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడమేమిటని ఆరోపిస్తున్నారు. ఉన్నావ్‌లోనే ఓ యువతిని అత్యాచారం చేసిన కేసులో స్థానిక బీజేపీ ఎమ్మెల్యేను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బహిరంగ ప్రదేశాల్లో జంటలు వికృతంగా ప్రవర్తించడం వల్లే అత్యాచారాలు జరుగుతున్నట్లు ఇటీవల సాక్షీ మహారాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రేప్ కేసులో శిక్షను అనుభవిస్తున్న గుర్మీత్ రామ్ రహీమ్‌కు కూడా గతంలో ఎంపీ సాక్షీ మహారాజ్ మద్దతు ఇచ్చారు.

కొద్దికాలం క్రితం జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ ఎంపీ సాక్షీ మ‌హారాజ్ మాట్లాడుతూ ముగ్గురు భార్య‌లు - న‌ల‌భై మంది పిల్ల‌లు ఉన్న‌వారి వ‌ల్లే జ‌నాభా పెరిగిపోతోంద‌ని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్లు ర‌చ్చ ర‌చ్చ‌గా మారాయి. ఈ క్ర‌మంలో రంగ ప్ర‌వేశం చేసిన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల సంఘం ఆ వ్యాఖ్య‌ల‌పై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఎంపీని ఆదేశించింది. దీంతో సాక్షి మ‌హారాజ్ వివ‌ర‌ణ ఇచ్చారు. దేశంలో జ‌నాభా ఆందోళ‌న‌క‌ర రీతిలో పెరిగిపోతోంద‌నే తాను వ్యాఖ్యానించాను త‌ప్ప మ‌రో ఉద్దేశం లేద‌ని ఎన్నిక‌ల సంఘం గ‌మ‌నించాల‌ని సాక్షి మ‌హారాజ్ తెలిపారు.