Begin typing your search above and press return to search.

టీడీపీ మ‌ద్ద‌తుదారుల‌కే ఇళ్లు మంజూరా:జీవీఎల్

By:  Tupaki Desk   |   25 Jun 2018 2:08 PM GMT
టీడీపీ మ‌ద్ద‌తుదారుల‌కే ఇళ్లు మంజూరా:జీవీఎల్
X
2014 లో అవ‌శేషాంధ్ర‌ప్ర‌దేశ్ ఏర్ప‌డ్డ నేప‌థ్యంలో 40 ఏళ్ల `అపార` అనుభ‌వ‌మున్న చంద్ర‌బాబుకు ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టారు. లోటు బ‌డ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌థంలో నడిపిస్తాన‌ని - ప్ర‌జాసంక్షేమ‌మే ధ్యేయంగా ప‌నిచేస్తాన‌ని చంద్ర‌బాబు కూడా ఇబ్బ‌డి ముబ్బ‌డిగా హామీలిచ్చారు. అర‌చేతిలో అమ‌రావ‌తిని చూపించిన చంద్ర‌బాబు....ప్ర‌తిప‌క్షం కంటే కేవ‌లం శాతం ఓట్ల‌తో ఎలాగోలా సీఎం ప‌ద‌వి చేప‌ట్టారు. సీన్ క‌ట్ చేస్తే....నాలుగేళ్ల చంద్ర‌బాబు పాల‌న‌పై ప్ర‌జ‌లు తీవ్ర‌మైన అసంతృప్తితో ఉన్నారు. చంద్రబాబు అభివృద్ధి మాట ప‌క్క‌నబెడితే....ఉమ్మ‌డి - విభ‌జ‌నానంత‌ర ఆంధ్ర రాష్ట్రంలో ఎన్న‌డూ లేనంత‌గా అవినీతి పేట్రేగిపోయింద‌ని మండిప‌డుతున్నారు. ప్ర‌జ‌ల కోసం రాష్ట్రం ప్ర‌వేశ‌పెట్టిన అర‌కొర ప‌థ‌కాలు అట‌కెక్క‌గా.....కేంద్ర ప‌థ‌కాల‌ను రాష్ట్రంలో అమ‌లు చేసేందుకు కూడా చంద్ర‌బాబు నిర్ల‌క్ష్యం వ‌హించ‌డం పై ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా, టీడీపీ అధినేత చంద్ర‌బాబు అవినీతిపై బిజెపి జాతీయ అధికార ప్రతినిధి జి.వి.ఎల్ నరసింహరావు మ‌రోసారి నిప్పులు చెరిగారు. ఆఖ‌రికి నిరుపేద‌ల కోసం ఇళ్లు నిర్మించేందుకు గానూ కేంద్రం ప్ర‌క‌టించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం(పీఎంఏవై) లో కూడా చంద్ర‌బాబు అవినీతి తార‌స్థాయికి చేరింద‌ని మండిప‌డ్డారు.

చంద్రబాబు పాలన‌పై జీవీఎల్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పీఎంఏవై ప‌థ‌కాన్ని అర‌కొర అమ‌లు చేయ‌డ‌మే కాకుండా....అందులోనూ అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డ‌డం ఏమిట‌ని మండిప‌డ్డారు. ప‌చ్చ చొక్కాల వారికి - టీడీపీ మ‌ద్ద‌తుదారుల‌కు మాత్ర‌మే ఇళ్లు మంజూరు చేస్తున్నార‌ని - ఇత‌ర పార్టీల వారు, సామాన్యుల ద‌ర‌ఖాస్తుల‌ను బుట్ట‌దాఖ‌లు చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. ఒక‌వేళ టీడీపీ మ‌ద్ద‌తుదారుల‌కు కాకుండా...పొర‌పాటున ఇళ్లు మంజూరు చేసిన వారి ద‌గ్గ‌ర లంచం తీసుకుంటున్నార‌ని మండిప‌డ్డారు. అంతేకాకుండా, చ‌దరపు అడుగు నిర్మాణానికి రూ.2,400 చొప్పున బిల్లులు వేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఢిల్లీ, విజయవాడలో కూడా అంత ఖర్చు కాదని అన్నారు. ఏపీకి కేంద్రం 7 లక్షలకు పైగా గృహాలు కేటాయిస్తే ఇప్పటికి 43వేలు మాత్రమే పూర్తి చేశారని, పైగా కేంద్రం సాయం చేయ‌డం లేద‌ని అస‌త్య ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ధ్వజమెత్తారు. 40ఏళ్ల అనుభవం ఉన్న నంబర్‌వన్ నేత చంద్ర‌బాబు పరిపాలన ఇదేనా అని ఎద్దేవా చేశారు. పీఎంఏవై ఆశ‌యానికి చంద్ర‌బాబు తూట్లు పొడుస్తున్నార‌ని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఒక్క రూపాయికి సంబంధించిన బిల్లు కూడా కేంద్రం వద్ద పెండింగ్‌ లో లేదని, రాష్ట్ర ప్ర‌భుత్వం లెక్క‌లు చూప‌క‌పోవ‌డం వ‌ల్లే జాప్యం జ‌రుగుతోంద‌ని అన్నారు. కడపలో ఉక్కు కర్మాగారం విష‌యంలో చంద్ర‌బాబు స‌ర్కారే మోకాలడ్డుతోందని, దానిని క‌ప్పి పుచ్చుకునేందుకు నాట‌కాలాడుతోంద‌ని అన్నారు.