Begin typing your search above and press return to search.

అధికార పార్టీ మైండ్ సెట్ గేమ్‌

By:  Tupaki Desk   |   25 Aug 2016 5:30 PM GMT
అధికార పార్టీ మైండ్ సెట్ గేమ్‌
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు ప్రత్యేక హోదా అంశంపై ప్ర‌తిప‌క్షాలైన కాంగ్రెస్ - వైసీపీ - క‌మ్యూనిస్టులు - కొన్ని సంఘాలు దూకుడుగా ముందుకు వెళుతుంటే... అధికారంలో ఉన్న మిత్రపక్షాలు టీడీపీ-బీజేపీలు ఇర‌కాటంలో ప‌డిపోతున్నాయి. ఇందులో ముఖ్యంగా బీజేపీ ప‌రిస్థితి మ‌రింత సంక‌టంగా మారింది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా ప్ర‌త్యేక హోదాపై తేల్చాల్సింది బీజేపీ అన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ విష‌యంలో ఎన్డీఏ పెద్ద‌లు మొండిచేయి చూపించ‌డం మ‌రోవైపు ఏపీలో విస్తరించాలనే ల‌క్ష్యం నేప‌థ్యంలో బీజేపీ మ‌ధ్యే మార్గం ఆలోచిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు వివిధ రూపాల్లో తమ పార్టీ చేసిన స‌హాయాన్ని ప్ర‌చారం చేయాల‌ని భావిస్తోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో - ఇంకా చెప్పాలంటే మున్ముందు కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ పలుమార్లు స్పష్టంచేసింది. దీంతో ఏపీకి ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీయే ఈ రాష్ట్రాన్ని ఆదుకొంటుందన్న భావనను ఇక్కడి ప్రజానికంలో కలిగించాలని ఏపీ బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ భావనను ప్రజల్లో రేకెత్తించే ముందు ఏపీకి ఇంతవరకు నరేంద్రమోడీ సర్కార్ నిధుల రూపంలో చేసిన సహాయమెంతా - ఇతర విషయాలలో చేసిన సహాయమెంతా అన్న ప్రస్తావన తరచూ మీడియా ద్వారా జనంలోకి తీసుకెళ్లాలని ఏపీ బీజేపీ నాయకత్వం భావిస్తోంది. ఇప్పటి వరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏపీకి నిధుల పరంగా చేసిన సహాయం మీడియా ముందు పూర్తిగా వివరించి చెబితే - కేంద్రం ఇచ్చే ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీతో ఏపీకి మరింత మేలు జరుగుతుందన్న భావనకు ప్రజల్లో బీజం వేయవచ్చుని క‌మ‌ళ‌నాథులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ నేతలు ప్రత్యేక ప్యాకేజీ పల్లవిని ఎక్కడపడితే అక్కడ అందుకుంటున్నారు. ఏపీకి కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ ఎంతో ఆర్థిక సహాయం అందించిందని మీడియా ముఖంగా ప్రస్తావిస్తున్నారు.

గుజరాత్ వంటి రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ది చెందిందంటే ఆ రాష్ట్రానికి పుష్కలంగా నిధులు ఉండటమేనన్న ఆలోచనను ప్రజల్లో రేక్కెత్తించాలని ఆ పార్టీ యోచిస్తోంది. ప్రస్తుతం ఆర్థిక లోటుతో ఉన్న ఏపీకి ప్రత్యేకహోదా కంటే ముందు ప్రత్యేక ప్యాకేజీయే మేలు చేస్తుందన్న భావనను ప్రజల్లో కలిగించాలని ఇందుకు కొత్త మీడియా వేదిక‌ల‌ను కూడా ఉప‌యోగించుకోవాల‌ని చూస్తోంది. సామాజిక మాధ్యమాలైనా వాట్సప్ - సోషల్ మీడియాను త‌మ ప్ర‌చారానికి వేదికగా వాడుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే వాట్సప్ గ్రూపులను సృష్టించిన బీజేపీ శ్రేణులు ఎవరికి వారుగా కేంద్రం ఏపీకి చేసిన సహాయంపై ప్రచారం విస్తృతం చేస్తున్నారు. ఆయా పథకాల వారీగా ఏపీకి కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ చేసిన సహాయాన్ని మీడియా ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం కల్పించాలని ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక విభాగాలను ఏర్పాటుచేసుకొన్ని పెద్ద ఎత్తున ప్రచారానికి కార్యాచ‌ర‌ణ సిద్ధం చేస్తున్నారు.

ప్రత్యేక ప్యాకేజీయే ఏపీని ఆదుకొంటుంద‌నే భావన కలిగించాలంటే తాము ఏపీ సర్కార్‌ లో భాగస్వామ్యంగా ఉన్న‌ప్ప‌టికీ వాస్తవం చెప్పే క్రమంలో ఆ పార్టీని కూడా విమర్శించాల్సి వస్తుందని బీజేపీ నాయ‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అందుకే ఏపీలోని టీడీపీ సర్కార్ కేంద్రం ఇచ్చిన నిధులను దారిమళ్లిస్తోందని - పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవడంలేదన్న ప్రచారం కూడా మొద‌లు పెట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. రాష్ట్రాభివృద్ధికోసం కేంద్రం నిధులిస్తుంటే, టీడీపీ సర్కార్ మాత్రం వాటిని సరైన రీతిలో అభివృద్ధికరమైన అంశాలపై ఖర్చుచేయకుండా దుర్వినియోగం చేస్తోందన్న సంకేతాలను ప్ర‌జ‌ల్లోకి పంపేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.