Begin typing your search above and press return to search.

మోడీతో జ‌గ‌న్‌....టీడీపీకి బీజేపీ తాజా షాక్‌

By:  Tupaki Desk   |   11 May 2017 9:24 AM GMT
మోడీతో జ‌గ‌న్‌....టీడీపీకి బీజేపీ తాజా షాక్‌
X
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వేసిన రాజ‌కీయ ముందడుగు ఇప్పుడు చ‌ర్చనీయాంశంగా మారింది. ఇంకా చెప్పాలంటే జ‌గ‌న్ చ‌ర్య అంత‌ర్గ‌త క‌ల‌హాల‌కు ఆజ్యం పోసింది? ఎవ‌రి మ‌ధ్య క‌ల‌హాలు అంటే...మిత్రపక్షాలయిన తెలుగుదేశం- భార‌తీయ జనతా పార్టీల‌ మధ్య!ప్ర‌త్యేకంగా ఢిల్లీ ప‌ర్య‌ట‌న పెట్టుకున్న వైఎస్ జ‌గ‌న్ ప్రధాని నరేంద్ర మోడీని క‌ల‌వ‌డం టీడీపీ వ‌ర్గాల్లో క‌ల‌క‌లానికి కార‌ణంగా రాజ‌కీయాల్లో కొత్త చ‌ర్చ‌కు తెర‌లేపింది.

మిత్ర‌ప‌క్షాలుగా ఉండి అధికారం పంచుకుంటున్న‌ప్ప‌టికీ బీజేపీ-టీడీపీల మ‌ధ్య ఎన్నో అంశాల్లో పొర‌పొచ్చాలు ఉన్నాయ‌నేది బ‌హిరంగ ర‌హ‌స్యం. ఈ క్ర‌మంలో అయితే రాష్ట్ర స్థాయిలో ఈ రెండు పార్టీల మ‌ధ్య గ్యాప్ ఉన్న‌ప్ప‌టికీ ఢిల్లీ స్థాయిలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ, సీఎం చంద్ర‌బాబు కలిసే ఉన్నారన్న భావ‌న ఇప్ప‌టివ‌ర‌కు ఉంది. కానీ అందుకు విరుద్ధంగా జగన్‌తో మోడీ భేటీ కావడం, ఆయన చెప్పేవన్నీ ఆసక్తిగా వినడంతోపాటు, బాబు అవినీతిపై వైసీపీ ముద్రించిన పుస్తకం తీసుకోవడం ఆస‌క్తిక‌రం. ఇప్పటివరకూ జగన్ ఎప్పుడు ఢిల్లీకి వెళ్లినా రాష్టప్రతి, కేంద్రమంత్రులను కలిసేందుకే పరిమితమయ్యేవారు. ప్రధాని అపాయింట్‌మెంట్ కోరినా లభించేది కాదు. కాగా తాజాగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా, మిర్చిరైతులు, అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు, తెలుగుదేశం ప్రభుత్వ అవినీతి, పార్టీ మారిన వారికి మంత్రిపదవులు, ఫిరాయింపులకు ప్రోత్సాహం తదితర అంశాలపై ప్రధాని మోడీని కలిసిన జగన్ వ్యవహారం, మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీకి షాక్ నిచ్చింది. అంతేకాదు టీడీపీ, బీజేపీల మ‌ధ్య అగాథానికి తెరలేపినట్టయింది. ప్ర‌ధానిని జగన్ కలవకుండా ఇప్పటివరకూ అడ్డుకోవడంలో విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ ఆశలు, ఆవిరయిపోయాయని, ఢిల్లీలో బాబుకు బ్యాడ్ టైం ప్రారంభం అయింద‌నేందుకు ఇదే నిద‌ర్శ‌న‌మ‌ని చెప్తున్నారు.


అయితే మోడీ, జ‌గ‌న్‌ల భేటీని టీడీపీ నేత‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ప్రధాని ఒక క్రిమినల్‌కు ఎలా అపాయింట్‌మెంట్ ఇస్తారని మంత్రులు, టీడీపీ ఎమ్మెల్సీలు మూకుమ్మడి దాడి చేశారు. అయితే దానిపై బీజేపీ అంత‌కంటే ఎక్కువే ఎదురుదాడి చేసింది. ఢిల్లీలో బీజేపీ ఏపీ సమన్వయకర్త పురిఘళ్ల రఘు మాట్లాడుతూ జగన్ నిందితుడు మాత్రమే కానీ ముద్దాయి కాదని తేల్చిచెప్పారు. కోర్టులో కేసులు నడుస్తున్నాయే త‌ప్ప జ‌గ‌న్‌కు ఇంకా శిక్షపడలేదని గుర్తు చేశారు. మేం చెబితే తప్ప ఎవరినీ కలవడానికి లేనట్లున్న టీడీపీ వ్యవహారం రాజకీయాల్లో హుందాతనం అనిపించుకోదని’ వ్యాఖ్యానించారు. కాగా, కేంద్రమంత్రి సుజనా చౌదరిపైనా వందల కోట్ల రూపాయల బ్యాంకు కేసు పెండింగ్‌లో ఉందని, ఆయన కూడా నిందితుడేనన్న విషయాన్ని టీడీపీ వాళ్లు గుర్తించాల్సిన అవసరం ఉందని బీజేపీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. అంటే త‌మ‌ను ఆదేశించాల‌ని టీడీపీ చూడ‌టం అయ్యే ప‌ని కాద‌ని పరోక్షంగా తేల్చిచెప్తోంది.