Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ పై ఇలా కూడా బురద చల్లుతారా?

By:  Tupaki Desk   |   1 Sep 2016 4:34 AM GMT
కేసీఆర్‌ పై ఇలా కూడా బురద చల్లుతారా?
X
నిర్మాణాత్మక విమర్శలు చేయడానికి, ఒక పట్టాన దొరకకుండా కేసీఆర్‌ పాలన సాగిపోతోంది. నీటి ప్రాజెక్టులు చేపట్టి అవి మహా ఒప్పందాలు అని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటూ ఉంటే.. అవి అవినీతి కోసం చేసుకున్న ఒప్పందాలని చెప్పడం తప్ప.. కేసీఆర్‌ సర్కారు మీద పెద్దగా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు లేవు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రతిపక్షం పాత్ర పోషిస్తున్నప్పటికీ.. ఈ మహా ఒప్పందాల గురించి మాట్లాడలేని స్థితిలో ఉంది.

ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్‌ సర్కారు మీద బురద చల్లడానికి రాష్ట్ర భాజపాకు ఒక కొత్త సాకు దొరికినట్లు కనిపిస్తోంది. మజ్లిస్‌ను ప్రసన్నం చేసుకోడానికి కేసీఆర్‌ సర్కారు తాపత్రయ పడుతోంది అని ప్రచారం చేయడం ద్వారా తెరాసను జాతీయ వాదం పట్ల గౌరవం లేని పార్టీగా విమర్శించి, ఎంతో కొంత బద్నాం చేయడానికి భాజపా ప్రయత్నిస్తోంది. తాజాగా సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవం జరగబోతున్న నేపథ్యంలో.. ఆ కార్యక్రమాన్ని అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించకపోవడం తప్పు అంటూ భాజపా నాయకులు విమర్శిస్తున్నారు.

అధ్యక్షుడు లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. తిరంగా యాత్రకు కొనసాగింపుగా సెప్టెంబరు 17న భాజపా శ్రేణులు పెద్ద ఎత్తున జాతీయ పతాకాలను ఆవిష్కరించాలని - బైక్‌ ర్యాలీలు నిర్వహించాలని పిలుపు ఇస్తున్నారు. మజ్లిస్‌ కారణంగానే తెరాస అధికారికంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదనే సంగతిని.. బాగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన పిలుపు ఇస్తున్నారు. అంటే.. ఆమేరకు మజ్లిస్‌ ను బూచిగా చూసే వర్గాల్లో తెరాస పట్ల విముఖత నాటడానికి లక్ష్మణ్ ప్లాన్‌ చేస్తున్నట్లుగా జనానికి అర్థమవుతోంది.

అయినా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం గురించి.. రాష్ట్ర ప్రభుత్వాన్ని బతిమాలే బదులుగా, కేంద్రంలో తమ ప్రభుత్వమే ఉన్నది గనుక.. విజయదివస్‌ లాగా.. విలీన దివస్‌ అంటూ దీనికి జాతీయ స్థాయిలోనే ఓ పేరు పెట్టి.. విజయోత్సవాలను అధికారికంగానే నిర్వహించవచ్చు కదా అని జనానికి డౌటొస్తోంది మరి!