Begin typing your search above and press return to search.

సుజనాకు బీజేపీ షాక్.. వదిలేది లేదు..

By:  Tupaki Desk   |   24 Jun 2019 5:11 AM GMT
సుజనాకు బీజేపీ షాక్.. వదిలేది లేదు..
X
వత్రం చెడ్డా ఫలితం దక్కలేదా.? అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటా.. ఇప్పుడు బీజేపీలో చేరినా టీడీపీ మాజీ రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరికి ఫలితం దక్కలేదని బీజేపీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. టీడీపీని కాదని.. ఎంతో ప్రాధాన్యమిచ్చినా ఆ పార్టీని వీడి బీజేపీలో చేరినందుకు ఇప్పుడు సుజనా చౌదరి అనుభవిస్తున్నాడని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది..

టీడీపీ అధినేత చంద్రబాబుకు.. ఆయన పార్టీకి ఆర్థిక వెన్నుదన్నుగా ప్రముఖ వ్యాపారవేత్త అయిన సుజనా చౌదరి ఇన్నాళ్లు ఉన్నాడు. బీజేపీతో దోస్తీ కటీఫ్ చేసుకొని వేరుకుంపటి పెట్టిన చంద్రబాబుపై మోడీషాలు దృష్టిసారించి బాబు పార్టీకి తెరవెనుక ఆర్థిక శక్తిగా ఉన్న సుజనాచౌదరి, సీఎం రమేష్ లపై ఐటీ, ఈడీ దాడులు చేయించారని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రెండోసారి బీజేపీ గెలవడం.. టీడీపీ ఏపీలో దారుణంగా ఓడిపోవడంతో సుజన, సీఎం రమేశ్ తోపాటు మరో ఇద్దరు ఎంపీలతో కలిసి బీజేపీలో చేరారు. తాజాగా రాజ్యాంగంలోని 10 వ షెడ్యూల్ 4వ పేరా ప్రకారం టీడీపీ రాజ్యసభ పక్షాన్ని ఆ పక్ష నాయకుడి హోదాలో సుజనాచౌదరి విలీనం కూడా చేసేశారు. అయితే ఇంత చేసినా సుజనా చౌదరికి మినహాయింపులను బీజేపీ ఇవ్వకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

సుజనా చౌదరిపై ఐటీ, ఈడీలు తీవ్రమైన ఆర్థిక అభియోగాలు ఉన్నాయి. ఈడీ విచారణ ప్రస్తుతం వేగంగా సాగుతోంది. అందుకే ఈ కేసుల నుంచి ఉపశమనం పొందేందుకే సుజనా, సీఎం రమేష్ లు బీజేపీలో చేరారనే చర్చ సాగింది. అయితే తాజాగా బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు తమ పార్టీలో చేరిన సుజనా చౌదరికి షాకిచ్చారు.

ఐటీ, ఈడీ దాడులు, అభియోగాలు ఉండి తమ పార్టీలో చేరిన టీడీపీ ఎంపీలకు తాము ఎటువంటి హామీలు ఇవ్వలేదని.. వారి కేసులు కొనసాగుతాయని.. రాజ్యసభలో సంఖ్యాబలం తక్కువగా లేనందునే తాము టీడీపీ సభ్యులను చేర్చుకున్నామని జీవీఎల్ నరసింహరావు బాంబు పేల్చారు. గుంటూరులోని బీజేపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీలో చేరిన టీడీపీ ఎంపీలపై ఉన్న అభియోగాలపై వారే సమాధానం చెప్తారని. తమ పార్టీ వారికి మంచి సర్టిఫికెట్లు ఇవ్వలేదని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

దీన్ని బట్టి సుజనా చౌదరి, సీఎం రమేష్ లు బీజేపీలో చేరినా వారికి ఐటీ, ఈడీనుంచి మినహాయింపు లేదని.. కేసులు విషయంలో ఎలాంటి ఉపశమనం లేదని బీజేపీ వారికి షాకిచ్చినట్టైంది.