Begin typing your search above and press return to search.

క్రికెట‌ర్ల‌పై బీసీసీఐ షాకింగ్ నిర్ణ‌యం!

By:  Tupaki Desk   |   27 July 2017 4:39 PM GMT
క్రికెట‌ర్ల‌పై బీసీసీఐ షాకింగ్ నిర్ణ‌యం!
X
శ్రీ‌లంక ప‌ర్య‌ట‌న‌లో ఉన్న టీమిండియాకు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. అదేంటి - మొద‌టి టెస్టులో కోహ్లీ సేన అద్భుతంగా రాణిస్తోంది క‌దా అనుకుంటున్నారా? అయితే, టీమిండియాకు షాక్ ఇచ్చింది శ్రీ‌లంక జ‌ట్టు కాదు. టీమిండియా క్రికెట‌ర్ల‌కు బీసీసీఐ ఝ‌ల‌క్ ఇచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న క్రికెటర్లు ఉద్యోగాలు వదులుకోవాలని గట్టి సందేశం పంపింది. బీసీసీఐ ఆదేశాలతో కోహ్లి సేన ఇరకాటంలో ప‌డిన‌ట్ల‌యింది. ఈ అంశంలో మాజీ క్రికెటర్లు సౌరవ్‌ గంగూలీ - రాహుల్‌ ద్రవిడ్‌ - సునీల్‌ గవాస్కర్‌ తదితరులపై ఇంతకుముందు బీసీసీఐ దృష్టి సారించింది. తాజాగా క్రికెటర్లకు కూడా ఇవే నిబంధనలు వర్తింపజేయాలని క్రికెట్‌ బోర్డు నిర్ణయించింది.

గ‌త కొంత కాలంగా ఆట‌గాళ్లు ద్వంద్వ ప్రయోజనాలు పొంద‌డంపై చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలోనే రాహుల్ ద్రవిడ్ ఐపీఎల్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. బీసీసీఐలో ఏ - బీ - సీ గ్రేడ్ కాంట్రాక్టులతో ప్రయోజనం పొందుతున్న ఆటగాళ్లు పలు సంస్థల్లో ఉద్యోగులుగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ద్వంద్వ ప్రయోజనం పొందుతున్నారు. ఓఎన్‌ జీసీలో కెప్టెన్‌ కోహ్లి.. మేనేజర్‌ ఉద్యోగంలో ఉన్నాడు. అతడు ఉద్యోగంలో కొనసాగరాదని బోర్డు కోరుకుంటోంది. అలాగే వీరేంద్ర సెహ్వాగ్ - గౌతమ్ గంభీర్ - శిఖర్ ధావన్ - అజింక్యా రహానే - ఇషాంత్ శర్మ - ఛటేశ్వర్ పుజారాలు ప్రభుత్వ సంస్థల్లో వివిధ స్థాయి ఉద్యోగులుగా ప్రయోజనాలు పొందుతున్నారు. అయితే మ్యాచ్‌ లు లేనిసమయంలో వీరు ఉద్యోగం చేయకుండా వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్నారు.

క్రికెటర్ల ఉద్యోగం డ్యుయల్ కాంట్రాక్టు కిందకు వస్తుందని బీసీసీఐ పేర్కొంది.ఈ నేపథ్యంలో నిషేధిత నిబంధనల్లో ఆటగాళ్లు ఉండకూడదని చెబుతూ, పని చేస్తున్న సంస్థలకు రాజీనామా చేయాలని కోరుతూ బీసీసీఐ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఉత్తర్వులు టీమిండియాకు మాత్రమేనా? మహిళా క్రికెట్ జట్టుకు కూడా వర్తిస్తుందా? అన్న దానిపై పూర్తి వివరాలు తెలియలేదు. మహిళా క్రికెటర్లలో కొందరు రైల్వేల్లో ఉద్యోగులుగా ఉన్న సంగ‌తి తెలిసిందే.