Begin typing your search above and press return to search.

కంగారూ..మ‌న‌కెలా ఆహ్వానం ప‌లుకుతోందంటే!

By:  Tupaki Desk   |   20 Nov 2017 10:37 AM GMT
కంగారూ..మ‌న‌కెలా ఆహ్వానం ప‌లుకుతోందంటే!
X
ఉన్న‌త విద్య కోసం విదేశాల‌కు వెళ్లానుకునే మ‌న విద్యార్థుల‌కు ముందుగా క‌నిపించేది అమెరికా, ఆ త‌ర్వాత క‌నిపించేది మాత్రం ఆస్ట్రేలియానే. ఎందుకంటే... మ‌న విద్యార్థుల‌కు అనుగుణంగా ఉండే క‌ర్రిక్యూల‌మ్ అమ‌లు చేస్తున్న వర్సిటీలు ఆస్ట్రేలియాలో చాలా ఎక్కువ‌గా ఉన్నాయ‌ట‌. దీంతో వీల‌యితే అమెరికా... లేదంటే ఆస్ట్రేలియానే మ‌న పిల్ల‌ల డెస్టినేష‌న్‌గా మారుతోంది. అయితే ఆయా దేశాల మ‌ధ్య ఉన్న సంబంధాలు, ఇరు దేశాల మ‌ధ్య విద్యా వ్య‌వ‌స్థ‌కు సంబంధించి అమ‌లులో ఉన్న ఒప్పందాలు... మ‌న‌కు ఆయా దేశాల్లో ఎంత మేర అవ‌కాశాలున్నాయ‌న్న విష‌యాన్ని తేల్చి పారేస్తాయి. ఈ దిశ‌గా అన్ని దేశాల్లాగే, ఆస్ట్రేలియా కూడా మ‌న దేశానికి ఓ అసెస్ మెంట్ ఇచ్చేసింది. ప్ర‌స్తుతం *హైరిస్క్‌* అసెస్‌మెంట్ కింద భార‌త్ ఉండ‌గా, మ‌న విద్యార్థుల‌కు ఆస్ట్రేలియాలోని చాలా వ‌ర్సిటీల్లో ప్ర‌వేశం క‌ల‌గానే మిగిలిపోతోంది. హైరిస్క్ కంట్రీస్ విద్యార్థుల‌కు ప్ర‌వేశాలు క‌ల్పించే వ‌ర్సిటీలు ఆస్ట్రేలియాలోనూ కొన్ని ఉన్నా... వాటి సంఖ్య నామమాత్ర‌మేన‌ని చెప్పాలి. అంతేకాకుండా హైరిస్క్ కింద ఉన్న మ‌న దేశ విద్యార్థులు ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసా పొందాలంటే స‌వాల‌క్ష ప‌త్రాలు స‌మ‌ర్పించాలి. వాట‌న్నింటిని వ‌డ‌పోసే ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేష‌న్ అధికారులు అస‌లు అనుమతి ఇస్తారో, లేదో కూడా తెలియ‌ని ప‌రిస్థితి.

ఇదంతా నిన్న‌టిదాకా ఉన్న ప‌రిస్థితి. ఇప్పుడు ఆ ప‌ద్ద‌తులు మారాయ‌ట‌. ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం తీసుకున్న ఒకే ఒక్క నిర్ణ‌యం మ‌న విద్యార్థుల ఆస్ట్రేలియా క‌ల‌ల‌ను సాకారం చేసేస్తోంది. ఇక అస‌లు విష‌యంలోకి వెళితే... 2025 నాటికి 7,20,000 మంది అంతర్జాతీయ విద్యార్థులను తమ వర్సిటీల్లో చేరేలా ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగా విద్యార్థుల ఎంట్రీకి సంబంధించి ఆయా దేశాల‌కు ఇచ్చిన అసెస్‌మెంట్‌ను ఆస్ట్రేలియా స‌మీక్షించింది. ఈ స‌మీక్ష‌లో భాగంగా భార‌త్‌పై సానుకూల దృక్ప‌థంతో వ్య‌వ‌హ‌రించిన ఆ దేశ ప్ర‌భుత్వం... మ‌న దేశానికి ఉన్న అసెస్‌మెంట్‌ను *హైరిస్క్‌* నుంచి *మోడ‌రేట్ రిస్క్‌*కు మార్చింది. దీంతో మరిన్ని ఆస్ట్రేలియా విద్యా సంస్థల్లో చేరే అవకాశం భారతీయ విద్యార్థులకు లభించనుంది. అంతేకాకుండా స్టూడెంట్‌ వీసా పొందేందుకు అవసరమైన డాక్యుమెంట్ల సంఖ్య కూడా తగ్గుతుంది. ఆస్ట్రేలియాలోని వర్సిటీలకు నాణ్యత ప్రాతిపదికన ర్యాంకింగ్‌ ఉంటుంది. దేశానికి ఇచ్చిన కేటగిరీ సంఖ్యను దరఖాస్తు చేసుకున్న వర్సిటీకి అనుసంధానం చేస్తుంది. ప్రస్తుతం మన దేశానికి ఇచ్చిన కేటగిరీతో భారత విద్యార్థులు ఎక్కువ వర్సిటీలను ఎంచుకునే అవకాశాలు పెరుగుతాయి.

ఇక‌ స్టూడెంట్‌ వీసాల మంజూరుకు సంబంధించి వివిధ దేశాలను రిస్క్‌ ప్రాతిపదిక నాలుగు కేటగిరీలుగా ఆస్ట్రేలియా విభజించింది. కేటగిరీని బట్టి డాక్యుమెంట్ల అవసరం ఉంటుంది. ఉదాహరణకు హైరిస్క్‌ అసెస్‌మెంట్ కేటగిరీ కింద ఉన్న దేశాలకు చెందిన విద్యార్థులు స్టూడెంట్‌ వీసా పొందేందుకు ఎక్కువ డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. భారత్‌ ఇప్పటి వరకు హైరిస్క్‌ విభాగంలో ఉండేది. దీంతో ఆస్ట్రేలియాలోని ఎక్కువ కాలేజీలు, ఇతర విద్యాసంస్థలను ఎంపిక చేసుకునే ఆప్షన్లు మన విద్యార్థులకు తక్కువగా ఉండేవి. ఆస్ట్రేలియన్‌ ఎంబసీ వెబ్‌ సైట్‌ లో పొందుపరిచిన వివరాల ప్రకారం భారతీయ విద్యార్థులకు అవసరమైన డాక్యుమెంట్ల సంఖ్యను ఇప్పుడు తగ్గించింది. సో.. ఆస్ట్రేలియా ప్ర‌భుత్వంలో వ‌చ్చిన మార్పు కార‌ణంగా ఆ దేశంలో చ‌ద‌వాల‌ని కోరుకునే మ‌న పిల్ల‌ల‌కు మ‌రిన్ని అవ‌కాశాలు అందివ‌చ్చిన‌ట్టే క‌దా.