Begin typing your search above and press return to search.

సీఎం కొడుకు గెలుపు కోసం 150 కోట్లు.. ఆడియో వైరల్ లేదా

By:  Tupaki Desk   |   18 April 2019 11:10 AM GMT
సీఎం కొడుకు గెలుపు కోసం 150 కోట్లు.. ఆడియో వైరల్ లేదా
X
మాండ్యాలో కర్ణాటక సీఎం కుమారస్వామి కొడుకును గెలిపించుకోవడానికి పన్నిన భారీ కుట్ర బయటపడింది. నిఖిల్ కుమారస్వామిని గెలుపు కోసం రూ.150కోట్లు ఖర్చు చేయాలని జేడీఎస్ పార్టీ నాయకులు మాట్లాడుకున్న ఆడియో ఇప్పుడు కర్ణాటకలో వైరల్ అయ్యింది. గురువారం కన్నడ మీడియాలో ఈ వార్తలు ప్రసారం కావడంతో ఈసీ, ఐటీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.

మాండ్యా లోక్ సభ నియోజకవర్గం నుంచి సీఎం కుమారస్వామి కొడుకు నిఖిల్ - స్వతంత్ర్య అభ్యర్థిగా అంబరీష్ సతీమణి సుమలత పోటీపడుతున్నారు. ఇక్కడ సుమలతపై సానుభూతి ఉంది. దీంతో నిఖిల్ గెలుపు కోసం రూ.150 కోట్లు ఖర్చు చేస్తున్నామని ఆడియో ఒకటి లీక్ అయ్యింది. జేడీఎస్ నాయకులు మాట్లాడుకున్న ఈ ఆడియో దుమారం రేపింది. తాము మాట్లాడుకుంటున్న సమయంలో ఎవరో నాయకులు ఈ ఆడియో రికార్డు చేశారని ఇద్దరు జేడీఎస్ నాయకులు ఈసీ - ఐటీ అధికారుల ముందు తప్పు అంగీకరించారని కన్నడ మీడియాలో వార్తలొచ్చాయి.

మాండ్యాలో గెలుపు కోసం రూ.150 కోట్లు ఖర్చు చేయాలని జేడీఎస్ పార్టీ నేత చేతన్ గౌడ - పి. రమేష్ లు మాట్లాడిన ఆడియో నిజమా కాదా అనే విషయం నిర్ధారించుకోవడానికి ఆ ఆడియో టేపులను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించాలని ఈసీ, ఆదాయపు పన్ను శాఖ నిర్ణయించిందని కన్నడ మీడియా తెలిపింది.

కాగా ఆ ఆడియోలో ఉన్న మాటలు తమ కుమారుడు చేతన్ గౌడది కాదని మాండ్యా సిట్టింగ్ ఎంపీ శివరామే గౌడ తెలిపారు. ఇది సుమలత సృష్టించిన నకిలీ ఆడియో అని మండిపడ్డారు.

ఇక మాండ్యాలో తనను ఓడించడానికి జేడీఎస్ కోట్లు కుమ్మరిస్తోందని సుమలత ఆరోపించారు. మాండ్యా ప్రజలు తనవైపు ఉన్నారని.. ఎన్ని కుట్రలు చేసినా గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాగా ఎన్నికల వేళ జేడీఎస్ నేతల ఆడియో బయటపడడంతో ఆ పార్టీ నాయకులు షాక్ కు గురయ్యారు.