Begin typing your search above and press return to search.

నట్టికుమార్ -నయీం..అచ్చెన్నాయుడి స్పందన!

By:  Tupaki Desk   |   23 Aug 2016 12:06 PM GMT
నట్టికుమార్ -నయీం..అచ్చెన్నాయుడి స్పందన!
X
గ్యాంగ్‌ స్టర్ నయీమ్ ఎన్‌ కౌంటర్ అయిన నాటి నుంచి అతని నేర సామ్రాజ్యానికి సంబంధించిన అనేక విషయాలు రకరకాల సంచలనాలు సృష్టిస్తున్నాయి. నయీం కి సహాయం చేసినవారిలో పోలీసులు ఉన్నారని, తర్వాతి కాలంలో సినిమా జనాలతో కూడా నయీం కి మంచి సంబందాలే ఉండేవని రకరకాల వార్తలు వెలులోకి వచ్చాయి. కేవలం గాసిప్స్ గానే భావించే కొన్ని విషయాలు నయీం ఎన్ కౌంటర్ అనంతరం వెలుగులోకి రావడంతో ఏది నిజమో, ఎవరిని నమ్మాలో నమ్మకూడదో తెలియని పరిస్థితుల్లో జనాలు ఉన్నారనే అభిప్రాయలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

అయితే నిర్మాత నట్టి కుమార్ చేసిన ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి కె. అచ్చెన్నాయుడు స్పందించారు. విజయవాడలో మాట్లాడిన ఆయన.. అసలు నట్టి కుమార్ ఎవరో తనకు తెలియదని - తన జీవితంలో అలాంటి వ్యక్తిని కలిసినట్లుగా గుర్తే లేదని చెప్పారు. అనంతరం తనపై ఆరోపణలు చేస్తున్న నట్టి కుమార్ లేదా ఇంకెవరైనా ఎలాంటి విచారణ అయినా జరిపించుకోవచ్చని సవాలు కూడా చేశారు. అదేవిదంగా ఏవైతే నట్టి కుమార్ చెప్పారని చెబుతున్నారో ఆ విషయాలేవీ తన దృష్టికి రాలేదని అచ్చెన్నాయుడు చెబుతున్నారు!

కాగా సోమవారం హైదరాబాద్‌ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత నట్టికుమార్ మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో గ్యాంగ్‌ స్టర్ నయీమ్‌ ను పెంచి పోషించింది తెలుగుదేశం ప్రభుత్వమేననీ - అతడి దుర్మార్గాలకు పలువురు టీడీపీ నాయకులు అండగా నిలిచారని ఆరోపించారు. నర్సన్నపేటలోని తన థియేటర్ వెంకటేశ్వరా మహల్‌ ను నయీమ్ అనుచరులైన అంజిరెడ్డి - అజీజ్ లు అక్రమంగా లాక్కున్నారని.. ఓ రోజు విమానంలో కలిసిన మంత్రి అచ్చెన్నాయుడితో ఈ విషయాలన్నీ చెప్పినా ప్రయోజనం లేకుండా పోయిందని, పైగా నయీం తోనే సెటిల్ చేసుకోవమని ఆయన చెప్పారని చెప్పిన సంగతి తెలిసిందే.