Begin typing your search above and press return to search.

మోదీ-షా ఎత్తులను చిత్తు చేసింది ఆయనా!!

By:  Tupaki Desk   |   21 May 2018 2:33 PM GMT
మోదీ-షా ఎత్తులను చిత్తు చేసింది ఆయనా!!
X
కర్ణాటకలో సీఎం సీటు వరకు వచ్చి నిలబెట్టుకోలేని బీజేపీ వైఫల్యం ఇప్పుడు దేశమంతా హాట్ టాపిగ్గా మారింది. ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఏమాత్రం లేని పరిస్థితుల్లో కూడా ఇతర రాష్ట్రాల్లో అధికారం అందుకునేలా రాజకీయాలను తమవైపు తిప్పగలిగిన మోదీ-షా రాజకీయం కర్ణాటకలో ఏమాత్రం ఫలించలేదు. కాంగ్రెస్-జేడీఎస్ కూటమిని ఏమీ చేయలేక చతికిలపడ్డారు. అంతేకాదు.. కాంగ్రెస్-జేడీఎస్‌ల కాల్ రికార్డింగుల దెబ్బకు పరువు కూడా పోయింది. ఎమ్మెల్యేలను చేజారిపోకుండా కాపాడడంలో కన్నడ కాంగ్రెస్ నేత శివకుమార కీలకంగా వ్యవహరించారన్న సంగతి తెలిసిందే. అయితే.. కాంగ్రెస్ పెద్దల్లో ఓ నేత కూడా కర్ణాటకలో పోలింగ్‌కు ముందు నుంచి అక్కడి వ్యవహారాలను పరిశీలిస్తూ సూచనలు చేస్తూ.. రాబోయే ఫలితం ఎలా ఉంటే ఏం చేయాలి.. ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి.. ఎలాగైనా సరే మోదీ-షా ద్వయం ఎత్తులను తిప్పికొట్టాలంటే ఎంత అలర్టుగా ఉండాలి.. వారు ఏం చేస్తే తామేం చేయాలి వంటివన్నీ పక్కాగా ముందే ప్లాన్లు సిద్ధం చేసుకుని.. అనుకున్నది అనుకున్నట్లుగా అమలు చేసిన నేత ఒకరున్నారు. ఆయనే.. అశోక్ గెహ్లాట్. రాజస్థాన్ మాజీ సీఎం. గత రాజస్థాన్ ఎన్నికల్లో బీజేపీ చేతిలో దారుణ పరాభవం ఎదుర్కొని అధికారం కోల్పోయిన నేత. అయితే.. ఆ తరువాత కాంగ్రెస్ ఆయన్ను జనరల్ సెక్రటరీని చేసింది.

అంతేకాదు.. ప్రతిష్ఠాత్మక గుజరాత్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చేసింది. అక్కడ ఆయన కాంగ్రెస్‌కు విజయం అందించలేకపోయినా మోదీకి మాత్రం చెమటలు పట్టించారు. కంచుకోట గుజరాత్‌లో బీజేపీ మెజార్టీ బాగా తగ్గించేలా కాలికి బలపం కట్టుకని తిరిగారు. అనుక్షణం బీజేపీకి, మోదీకి ఓటమి భయం కలిగేలా చేశారు.

ఆ తరువాత కర్ణాటక... ఇక్కడా ఎలాంటి హడావుడి లేకుండా పనిచేసుకుపోయారు. ఎన్నికల ఇంచార్జి తాను కానప్పటికీ కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా హంగ్ తప్పదని ముందు నుంచి అంతా ఊహించడంతో ఫలితాల వేళ బెంగళూరులోనే తిష్ఠ వేసి ప్రధానంగా తొలుత జేడీఎస్ కాంగ్రెస్ చేతికి అందేలా చేశారు. ఆ తరువాతా జారకుండా కాపాడుకున్నారు. అక్కడి నుంచి దిల్లీతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటూ రెండు టీంలుగా పనిచేశారు. కర్ణాటక గవర్నరు బీజేపీకి పూర్తిగా అనుకూలంగా ఉంటారని తెలిసి.. ఆయన ఏం చేస్తే న్యాయపరంగా ఎలాంటి స్టెప్ వేయాలి.. మీడియాలో బీజేపీ దారుణాలను ఎలా ఎండగట్టాలన్నది ముందే అనుకుని ఎప్పటికప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అమలు చేశారు. గోవాలో మాదిరిగా ఆలస్యం లేకుండా ఫలితాలు వెలువడుతున్నప్పటి నుంచే యాక్షన్ ప్లాన్ అమలు చేశారు.

చిట్టచివరగా బీజేపీ లోబరుచుకునేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలకు అంతకుమించిన ఆఫర్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి రాజస్థాన్‌లో బీజేపీ చేతిలో దెబ్బతిన్న ఆయన ఇప్పుడు తన పదునైన వ్యూహాలతో బీజేపీకి చుక్కలు చూపిస్తున్నారు. అంతేకాదు.. ఈ తాజా డెవలప్‌మెంట్స్ కారణంగా రాహుల్ ఇమేజ్, ఆత్మవిశ్వాసం రెండూ పెరగడానికి కారణమయ్యారు. ఇంత చేసినా ఇప్పటికీ బయటపడకుండా కామ్‌గా ఉన్నారు.. ఏమో 2019 కోసం ఇంకేం ప్రణాళికలు వేస్తున్నారో ఏమో.