Begin typing your search above and press return to search.

అశోకన్నా.కాల్మొక్తం.మీరే కాస్త పూనుకోండి!

By:  Tupaki Desk   |   4 Oct 2015 10:30 PM GMT
అశోకన్నా.కాల్మొక్తం.మీరే కాస్త పూనుకోండి!
X
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించే విషయంలో ఏ పార్టీలు ఎలాంటి ఉద్యమాలు చేస్తూ ఉన్నా సరే.. కేవలం వారి ఉద్యమాల వల్ల ఫలితం వచ్చేస్తుందనే విశ్వాసం ప్రజల్లో తక్కువగానే ఉంది. అధికార పార్టీ కూడా ఎంతో కొంత చొరవచూపిస్తే తప్ప.. ఈ దిశగా ప్రయత్నాలు సఫలం కావనేది ఎక్కువ మందిలో ఉన్న భావన. అయితే... అధికార తెలుగుదేశం పార్టీలో నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క తీరుగా మాట్లాడుతూ ఉన్నారు.

కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే ధైర్యం వారిలో ఏ ఒక్కరికీ లేకపోవడంతో.. వారి మాటలన్నీ డొంకతిరుగుడుగానే ఉంటున్నాయి. చంద్రబాబు - సుజనా - రాష్ట్ర మంత్రులు అందరూ కూడా.. హోదా బెటరా - ప్యాకేజీ బెటరా ఆలోచిస్తున్నాం.. కేంద్రం మనకు చాలా మేలే చేస్తుంది తప్ప కీడు చేయదు.. లాంటి మాయమాటలు చెబుతున్నారు. కాకపోతే.. తెదేపాకు చెందిన కేంద్ర విమానయానశాఖ మంత్రి అశోక్‌ గజపతి రాజు ఒక్కరే కాస్త భిన్నంగా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలూ కలసిపోరాడితే మాత్రమే ప్రత్యేకహోదా వచ్చే ఛాన్సు ఉంటుందని ఆయన చెబుతున్నారు. ఈ విషయాన్ని ఆయన పలు సందర్భాల్లో వెల్లడించారు.

అయితే రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నది ఒక్కటే..

''అశోకన్నా.. మీ కాల్మొక్తం.. కాస్త పెద్దదిక్కు మీరే అనుకుని.. రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించే సంకల్పాన్ని భుజానికెత్తుకోండి.. మిమ్మల్ని తప్పు పట్టగల సత్తా, స్థాయి ఉన్న నాయకులు తెలుగుదేశం ఎవ్వరూ లేరు గనుక.. మీరు పూనిక వహించి... ఓ అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయండి. ప్రత్యేకహోదా కోసం ప్రతి పార్టీ మాట్లాడుతున్నది గానీ.. ఎవరికి వారే యమునాతీరే అన్నట్లుగా ఈ పోరాటాలు సాగుతున్నాయి. వాటిని ఒక్కతాటిపైకి తెస్తే... మీరన్నట్లుగా... అది మహోధృతమైన ఉద్యమం అవుతుంది. సఫలం కావచ్చు కూడా! అయితే పిల్లి మెడలో గంటకట్టే దెవరు అన్నట్లుగా.. అన్ని పార్టీలను ఒక్కటి చేసేదెవరు? అనేది ఇక్కడ సస్పెన్స్‌! అందరికీ క్రెడిట్‌ కావాలే తప్ప.. పనిపూర్తికావడంపై శ్రద్ధ లేదు. తమరు బాధ్యతగా అఖిలపక్షం ఏర్పాటు చేయండి. మనం కలిసి అడిగితే.. కేంద్రం మెడలు వంచవచ్చుననే నమ్మకం మీకు మాత్రమే ఉంది. ఆ నమ్మకమే మనలిన నడిపిస్తుంది. ఒకవేళ మీ సారథ్యంలో జరిగే అఖిలపక్షానికి ఏ పార్టీ అయినా కలసి రాకపోతే.. వారిని తెలుగుజాతికి ద్రోహులుగా ముద్ర వేసేద్దాం. అలా కార్యాచరణ సిద్ధంచేసుకుందాం.. అంతే తప్ప.. ఎవరూ పనికి పూనుకోకుండా... కలిసిపోరాడితే వచ్చేస్తుంది.. అని స్టేట్‌మెంట్లకు మాత్రం పరిమితం అయ్యే వైఖరిని తమరు విడిచిపెట్టండి'' అని ప్రజలు కోరుతున్నారు.

అశోక్‌ గజపతి రాజుగారు ప్రజల ఆవేదనను అర్థం చేసుకుంటే.. రాష్ట్రానికి మంచి జరుగుతుందేమో.