Begin typing your search above and press return to search.

ఆంధ్రప్రదేశ్‌ లో అసద్‌ కు ఆహ్వానం

By:  Tupaki Desk   |   16 Dec 2018 7:12 AM GMT
ఆంధ్రప్రదేశ్‌ లో అసద్‌ కు ఆహ్వానం
X
అసదుద్దీన్ ఒవైసీ. తెలంగాణ రాజధానిలో చాలా పవర్ ఫుల్ నాయకుడు. దశాబ్దాలుగా పాతబస్తీని ఏలుతున్న కుటుంబం నుంచి వచ్చిన వాడు. రాజధానిలో కాకుండా తెలంగాణలోని పలు జిల్లాల్లో తనకంటూ ఎంతో ప్రాముఖ్యత ఉన్న నాయకుడు. పశ్చిమ బెంగాల్ - అస్సాంతో పాటు దక్షిణాదిలోని కర్నాటక - తమిళనాడులో కూడా తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్న నాయకుడు. ఒక విధంగా చెప్పాలంటే దక్షిణాది రాష్ట్రాల్లో ముస్లీం మైనార్టీలకు ఎంతో దగ్గరైన నాయకుడు. తెలంగాణలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున ప్రచారం చేసారాయన. ఈ ఎన్నికల్లో ప్రజా కూటమిగా ఏర్పడిన కాంగ్రెస్ - తెలుగుదేశం - సిపిఐ - తెలంగాణ జన సమితికి వ్యతిరేకంగా బహిరంగంగానే మద్దతు పలికిన నాయకుడు. అసదుద్దీన్ ఒవైసీ మజ్లిస్ తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. పోటీ చేసిన అన్ని స్ధానాల్లోనూ విజయం సాధించి తమ ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణలో ప్రచారం చేయడం పట్ల అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడికి ఇక్కడేం పని అని మండిపడ్డారు.

తనకు సంబంధం లేని చోట తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రచారం చేసారు కాబట్టి తాను కూడా ఆంధ‌ప్రదేశ్ లో ప్రచారం చేస్తానని ప్రకటించారు. అది కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తానని ప్రకటించారు. దీంతో చంద్రబాబు నాయుడు అండ్ పార్టీకి గుండెల్లో రైళ్లు పరిగెట్టడం ప్రారంభించాయి. ఆంధ్రప్రదేశ్ లో ముస్లీములకు ఇన్నాళ్లు ఓ ప్రత్యేకమైన పార్టీకాని - నాయకులు కాని లేరు. వారు అన్ని పార్టీలను తమవే అనుకున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడి మాయమాటలకు ఆంధ్రప్రదేశ్ లో మైనార్టీలు మురిపోయారు. అయితే ముందు ముందు ఆంధ్రప్రదేశ్ లో మైనార్టీలు అసదుద్దీన్ ఒవైసీని తమ నాయకుడిగా అంగీకరిస్తారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అంతేకాదు... ఆంధ్రప్రదేశ్ లో అసదుద్దీన్ ఒవైసీకి ఘన స్వాగతం కూడా పలుకుతారని అంటున్నారు. అసదుద్దీన్ ఒవైసీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తరఫున ప్రచారం చేస్తే ఆయన విజయం నల్లేరు మీద నడకే అని రాజకీయ పరిశీలకు అభిప్రాయపడుతున్నారు.