Begin typing your search above and press return to search.

రాహుల్ వ‌ల్ల అమిత్‌ షా సైతం ఇరుకున‌ప‌డ్డారు!!

By:  Tupaki Desk   |   20 Oct 2018 1:39 PM GMT
రాహుల్ వ‌ల్ల అమిత్‌ షా సైతం ఇరుకున‌ప‌డ్డారు!!
X
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హైద‌రాబాద్ టూర్‌ పై ఏఐఎంఐఎం నాయ‌కుడు - హైద‌రాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మండిప‌డ్డారు. ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాహుల్ స‌భ‌లు పెట్టుకొని భైంసా - కామారెడ్డిల‌తో పాటుగా పాత‌బ‌స్తీలో ప‌ర్య‌టించేందుకు సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. రాహుల్‌ ఉదయం 11.30 గంటలకు ఢిల్లీ నుంచి నేరుగా మహారాష్ట్రలోని నాందేడ్‌ కు చేరుకొని అక్కడి నుంచి మధ్యాహ్నం 12.20 గంటలకు భైంసా చేరుకున్నారు. అనంత‌రం 12.30 నుంచి 1.30 గంటల వరకు భైంసా సభలో పాల్గొని అనంతరం కామారెడ్డి చేరుకుని మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 3.30 గంటలకు బహిరంగసభలో ప్రసంగించారు. అక్కడ నుంచి హైదరాబాద్‌ కు వస్తారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య చార్మినార్‌ వద్ద రాజీవ్‌ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఢిల్లీకి తిరిగి పయనమవుతారు..

ఇలా ఓవైపు రాహుల్ బిజీబిజీ షెడ్యూల్‌ లో తిరుగుతుంటే...మ‌రోవైపు ఆయ‌న‌పై అస‌ద్ విరుచుకుప‌డ్డారు. ఆయ‌న‌తో పాటుగా బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌ షాను సైతం క‌లిపి విమ‌ర్శ‌లు చేశారు. చార్మినార్ అంటే అమితమైన ప్రేమ చూపిస్తున్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా - కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ లోక్‌ సభ నియోజకవర్గం నుంచి పోటీచేయాలని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సవాల్ చేశారు. ఎవరు సరైన వారో ఇక్కడి ప్రజలు తేలుస్తారని చెప్పారు. హైద‌రాబాద్ ఎవ‌రినైనా స్వాగ‌తిస్తోంది. భిన్న జాతుల సంస్కృతి అంటే ఏమిటో ఇక్కడి ప్రజలు మీకు చూపిస్తారని అన్నారు. తెలంగాణలో అమిత్ షా - రాహుల్ గాంధీ పర్యటనల నేపథ్యంలో ఓవైసీ ట్విటర్ వేదికగా ఈ వ్యాఖ్యలు చేయ‌డం గ‌మ‌నార్హం.

కాగా, ఈ టూర్లో రాహుల్ టీఆర్ ఎస్ పాల‌న‌పై మండిప‌డ్డారు. కేసీఆర్ ప్రభుత్వం ఖమ్మం - వరంగల్ జిల్లాలో రైతులకు బేడీలు వేయించిందని ఆరోపించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కుటుంబపాలన ఏర్పార్చారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పు రూ.2లక్షల కోట్లని తెలిపారు. రూ. 35వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును రీడిజైన్ పేరుతో లక్ష కోట్లకు పెంచారని ఆరోపించారు. ప్రభుత్వం చేసిన అప్పు ప్రతి కుటుంబం మీద రూ. 2లక్షల 60వేలు ఉందన్నారు. ప్రగతి భవన్ నిర్మాణానికి రూ.300 కోట్లు ఉంటాయి కానీ నిజాం షుగర్స్ తెరిపించేందుకు మాత్రం ఆయన దగ్గర డబ్బులు ఉండవని విమర్శించారు. ఇక్కడ కేసీఆర్ - ఢిల్లీలో మోడీ అవినీతి పాల్పడుతున్నరని అన్నారు. దేశ రక్షణ కోసం యూపీఏ ప్రభుత్వం హాల్ కు కాంట్రాక్ట్ ఇచ్చింది. ప్రభుత్వంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం రీడిజైనింగ్ చేసి ప్రభుత్వ రంగ సంస్థ ను కాదని ఆయన మిత్రుడైన అంబానీకి సమర్పించారని ఆరోపించారు.