Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యేల‌పై వేటుతో...కొత్త ట్విస్ట్‌

By:  Tupaki Desk   |   21 Jan 2018 4:32 PM GMT
ఎమ్మెల్యేల‌పై వేటుతో...కొత్త ట్విస్ట్‌
X
ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత‌ - ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలిన సంగ‌తి తెలిసిందే. ఆ పార్టీకి చెందిన 20మంది శాసనసభ్యులను అనర్హులుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దానికి రాష్ట్రప‌తి ఆమోద ముద్ర వేశారు. త‌ద్వారా చారిత్ర‌క నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే ఇప్పుడేం జ‌ర‌గ‌బోతోంద‌నే ఆస‌క్తి స‌ర్వత్రా నెల‌కొంది. ఉప ఎన్నిక‌లు త‌ప్ప‌ని నేప‌థ్యంలో అంద‌రి చూపు మ‌ళ్లీ దేశ‌రాజ‌ధానిపై ప‌డింది.

అస‌లు వివాదం ఏంటంటే...నిబంధనల ప్రకారం కేజ్రీవాల్ ప్రభుత్వంలో ఏడుగురు మంత్రులు మాత్రమే ఉండాలి. కానీ కేజ్రీవాల్ 2015 మార్చి13న 21మంది ఎమ్మెల్యేలను పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమిస్తూ - క్యాబినెట్ హోదాకు సమానమైన సౌకర్యాలను ఇచ్చారు. 1997లో తీసుకువచ్చిన చట్టం ప్రకారం ఓ ప్రజాప్రతినిధి ఆర్థిక ప్రయోజనాలు కలిగిన జోడు పదవుల్లో కొనసాగరాదు. దీనిపై 2015 జూన్19న న్యాయవాది ప్రశాంత్ పటేల్ అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రభుత్వం లాభదాయక పదవుల నుంచి పార్లమెంటరీ కార్యదర్శులను మినహాయిస్తూ ఢిల్లీ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ (రిమూవల్ ఆఫ్ డిస్‌ క్వాలిఫికేషన్)-1997 చట్టానికి సవరణలు చేయగా - అసెంబ్లీ ఆమోదించింది. అయితే ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదించలేదు. లాభదాయకమైన జోడు పదవులు అనుభవిస్తున్న కారణంగా ఈ 21మందిని అనర్హులుగా ప్రకటించాలా? వద్దా? అన్నది తేల్చాలని ఈసీని రాష్ట్రపతి ఆదేశించారు. దీనిపై 21మంది ఆప్ ఎమ్మెల్యేల వివరణను కూడా ఈసీ తీసుకున్నది. వివాదం తీవ్రమవుతుండటంతో 2016 సెప్టెంబర్ 8న ఢిల్లీ ప్రభుత్వం పార్లమెంటరీ కార్యదర్శుల్ని తొలిగించింది. అనంతరం పంజాబ్‌లో పోటీకి సిద్ధమైన రాజౌరీగార్డెన్ ఎమ్మెల్యే జర్నైల్‌సింగ్ తన ఢిల్లీ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మిగిలిన 20మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఈసీ శుక్రవారం రాష్ట్రపతికి నివేదించింది. దానికి ఆమోదం వేశారు.

ఇదిలాఉండ‌గా...20మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం వల్ల ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వానికి వచ్చే ముప్పేమీ లేకపోయినా, ఆ పార్టీకి మాత్రం ఇది కోలుకోలేని దెబ్బ. 70 సీట్లు కలిగిన ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ బలం ప్రస్తుతమున్న 67 నుంచి 47కు పడిపోతుంది. ప్రభుత్వ మనుగడకు 36మంది ఎమ్మెల్యేల మద్దతు సరిపోతుంది కాబట్టి ఆప్ ప్రభుత్వం కొనసాగుతుంది. ఈ తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ ముందు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఒకటి ఉపఎన్నికలకు వెళ్లడం కాగా - రెండోది ఈసీ నిర్ణయంపై స్టే కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం. ఇప్పటికే పలు వివాదాలతో రాజకీయ ప్రాబల్యం క్రమంగా సన్నగిల్లుతున్న నేపథ్యంలో ఉపఎన్నికలకు ఆప్ సిద్ధంగా లేదు. ప్రభుత్వ పనితీరుపై కూడా ప్రజల్లో అసంతృప్తి నెలకొన్నది. గత ఏడాది మార్చిలో జరిగిన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆగస్టులో జరిగిన ఉపఎన్నికల్లో బవానా అసెంబ్లీ స్థానాన్ని తిరిగి గెలుచుకోవడం ద్వారా ఆ పార్టీ తన బలాన్ని కొంత పెంచు కోగలిగింది. ఈ నేపథ్యంలో ఉపఎన్నికలకు వెళ్ల డం కన్నా, ఈసీ నిర్ణయంపై న్యాయపోరాటానికి దిగేందుకే కేజ్రీవాల్ మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.

మ‌రోవైపు నూతన చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ గా ఓం ప్రకాశ్ రావత్ నియమితులయ్యారు. ఈ నెల 23న సీఈసీగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే.. ఎలక్షన్ కమిషన్ కొత్త కమిషనర్‌ గా ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి అశోక్ లావాసా నియమితులయ్యారు. ఈసీ కమిషనర్‌ గా అశోక్ లావాసా కూడా ఈనెల 23నే బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం చీఫ్ ఎలక్షన్ కమిషన ర్‌గా అచల్ కుమార్ ఉన్నారు. ఆయన ఈనెల 23న రిటైర్ కానున్నారు. దీంతో ఆయన స్థానంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ గా 23న ఓపీ రావత్ బాధ్యతలు చేపట్టనున్నారు.