Begin typing your search above and press return to search.

తేడా వ‌స్తే మ‌రో స‌ర్జిక‌ల్ స్ట్రైక్ ఖాయ‌మే

By:  Tupaki Desk   |   26 Sep 2017 8:04 AM GMT
తేడా వ‌స్తే మ‌రో స‌ర్జిక‌ల్ స్ట్రైక్ ఖాయ‌మే
X
సామర‌స్య‌పూర్వక చ‌ర్చ‌ల‌కు తేలిక చేస్తూ...ర‌చ్చ‌కు దిగుతూ... పైగా అంత‌ర్జాతీయ వేదిక‌గా భార‌త్‌ ను ప‌లుచ‌న చేసేందుకు చూస్తున్న పాకిస్థాన్‌ కు గ‌ట్టి షాక్ త‌గిలింది. తేడా వ‌స్తే మ‌రోమారు దిమ్మ‌తిరిగే షాక్ ఖాయ‌మ‌ని భార‌త్ గ‌ట్టిగా హెచ్చ‌రించింది. ఈ మేర‌కు భారత సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్ తేల్చిచెప్పారు. ఇండియాస్ మోస్ట్‌ వాంటెడ్ పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా రావత్ మీడియాతో మాట్లాడుతూ పాకిస్థాన్‌ కు పరోక్షంగా తీవ్ర హెచ్చరికలు చేశారు. అవసరమైతే - నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాదుల శిబిరాలపై మరోసారి లక్షిత దాడి జరుపుతామని స్పష్టంచేశారు. త‌ద్వారా మ‌న మంచి త‌నాన్ని చేత‌కానిత‌నంగా చూడ‌వ‌ద్ద‌ని తేల్చిచెప్పారు.

నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదుల శిబిరాలు కొనసాగుతున్నాయని, అవి ఉన్నంతకాలం సీమాంతర చొరబాట్లు తప్పవని భారత సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్ అన్నారు. ``చొరబాటుదారుల్ని ఆహ్వానిస్తున్నాం. వారిని భూమిలో రెండున్నర అడుగుల లోతున ఎలా పాతిపెట్టాలో భారత సైన్యానికి బాగా తెలుసు`` అని ఆయన చెప్పారు. ``ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడం కోసం అవసరమైతే మరోసారి సర్జికల్ స్రైక్ చేపట్టేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉంది``అని రావత్ వెల్లడించారు. ``లక్షిత దాడి అనేది మేం వారికి పంపాలనుకుంటున్న సందేశం. దాని అర్థమేంటో ఈపాటికే వారికి తెలుసు. అవసరమైతే ఆ దిశగా చర్యలకు సిద్ధమే`` అని ఆర్మీచీఫ్ తెలిపారు. ఉగ్రదాడిలో 19మంది సైనికులు ప్రాణాలు కోల్పోయిన ఘటనకు ప్రతీకారంగా గత ఏడాది సెప్టెంబర్ 28-29 మధ్యరాత్రి నియంత్రణ రేఖ వెంబడి పాక్ భూభాగంలో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం లక్షిత దాడులు నిర్వహించి భారీ సంఖ్యలో ఉగ్రవాదుల్ని హతమార్చిన విషయం తెలిసిందే.

కాగా, కొద్దికాలం క్రితం ఇటు చైనాను - అటు పాకిస్థాన్‌ ను సైతం రావ‌త్ ఇదే రీతిలో హెచ్చ‌రించిన సంగ‌తి తెలిసిందే. న్యూఢిల్లీలోని 'భూభాగాల కోసం జరిగే యుద్ధాల అధ్యయన కేంద్రం(సిఎల్‌ డబ్ల్యుఎస్‌)`` నిర్వహించిన ఓ సెమినార్‌ లో రావత్‌ మాట్లాడుతూ ''రెెండు వైపులా ఒకేసారి యుద్ధం చేసేందుకు భారత సైన్యం సిద్ధపడాలి. భారత్‌ చేతిలో పాక్‌ బలగాలకు ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో ఆ దేశానికి అండగా నిలిచేందుకు చైనా సిద్ధంగా లేదు. దీంతో స్వయంగానే దాడులు నిర్వహించేందుకు చైనా ప్రయత్నిస్తోంది`` అని అన్నారు.