Begin typing your search above and press return to search.

‘యాపిల్’కు రూ.97వేల కోట్ల షాక్

By:  Tupaki Desk   |   31 Aug 2016 5:18 AM GMT
‘యాపిల్’కు రూ.97వేల కోట్ల షాక్
X
గుట్టు రట్టు అయ్యింది. టెక్ దిగ్గజానికి భారీ షాక్ తగిలింది. యూరోపియన్ యూనియన్ చరిత్రలోనే భారీ పన్ను ఎగవేత ఇష్యూలో యాపిల్ బుక్ అయ్యింది. గుట్టుగా చేసుకున్న ఒప్పందం కారణంగా ఎగ్గొట్టిన పన్నును చెల్లించాలంటూ యూరోపియన్ యూనియన్ యాంటీట్రస్ట్ రెగ్యులేటరీ ఆదేశాలు జారీ చేసింది. యూరోప్ లో వ్యాపారాన్ని నిర్వహించిన యాపిల్.. ఐర్లాండ్ లో అతి తక్కువ పన్ను చెల్లించినట్లుగా వచ్చిన ఆరోపణల్ని సమర్థిస్తూ రెగ్యులేటరీ భారీ జరిమానాను విధించటం వాణిజ్య వర్గాల్లో హాట్ న్యూస్ గా మారింది. ఈ ఫైన్ ఏకంగా రూ.97వేల కోట్లు ఉండటం గమనార్హం.

స్వీట్ హార్ట్ గా పిలుస్తున్న ఈ డీల్ వివరాల్లోకి వెళితే.. టెక్ దిగ్గజం యాపిల్.. ఐరీష్ ప్రభుత్వంతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నట్లుగా ఆరోపిస్తున్నారు. ఈ డీల్ తో యూరోప్ లో మొత్తంగా పన్ను ఎగ్గొట్టారన్నది అధికారుల ఆరోపణ. అమెరికాకు చెందిన అనేక మల్టీనేషనల్ కంపెనీల్ని ఆకర్షించిన ఐరీష్ ప్రభుత్వం.. అతి తక్కువ పన్నుఆశ చూపించి ఒప్పందాలు కుదుర్చుకున్నట్లుగా చెబుతున్నారు. 1980 నుంచి ఐర్లాండ్ లో యాపిల్ కంపెనీ 5వేల మంది ఉద్యోగులున్న ఒక యూనిట్ ను తెరిచారు. అక్కడి నుంచి అంతర్జాతీయ స్థాయిలో అమ్మకాలు నిర్వహించారు. గతంలో ఇదే రీతిలో అమెరికాకు చెందిన పలు కంపెనీలపై రెగ్యులేటరీ జరిమానా కొరడాను ఝుళిపించటాన్ని గుర్తు చేస్తున్నారు.

అసలు గొడవంతా ఎక్కడ మొదలైందంటే.. ఒక శాతం పన్ను చెల్లించాల్సిన చోట కేవలం 0.005 శాతం మాత్రమే పన్ను చెల్లించేలా చేసుకున్న ఒప్పందం యాపిల్ కొంప ముంచిందన్న మాట వినిపిస్తోంది. అయితే.. యూరోపియన్ యూనియన్ యాంటీ ట్రస్ట్ రెగ్యులేటరీ తాజాగా ఇచ్చిన ఆదేశాల్ని ఐరీష్ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ఈ నిర్ణయాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమంటూ యాపిల్ కు బాసటగా నిలుస్తోంది. ఇదిలా ఉంటే ఒక సంస్థకు రెగ్యులేటరీ ఏకంగా రూ.97వేల కోట్ల జరిమానాను విధించటం యూరోపియన్ యూనియన్ చరిత్రలో ఇదే తొలిసారిగా అభివర్ణిస్తున్నారు.