Begin typing your search above and press return to search.

చిన్న‌మ్మ‌పైకి ఇక సీబీఐ కూడా రంగంలోకి!

By:  Tupaki Desk   |   21 Nov 2017 9:57 AM GMT
చిన్న‌మ్మ‌పైకి ఇక సీబీఐ కూడా రంగంలోకి!
X
వ‌రుస ఐటీ దాడులతో ఉక్కిరిబిక్కిర‌వుతున్న అన్నాడీఎంకే మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శశికళ - ఆమె వ‌దిన‌ ఇళవరసిల చుట్టూ మ‌రో ఉచ్చు బిగుసుకుంటోంది. వారిద్ద‌రిపై పది బోగస్‌ సంస్థల ద్వారా భారీ మోసానికి పాల్పడిన అభియోగంపై సీబీఐ త్వరలో కేసు బనాయించనుంది. దీంతో ఇప్ప‌టికే పీక‌ల్లోతు క‌ష్టాల్లో ఉన్న శ‌శి అండ్ కో ఇక కోలుకోవ‌డం క‌ష్ట‌మేన‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇన్నాళ్లూ రాష్ట్రంలో చ‌క్రం తిప్పిన మ‌న్నార్ గుడి మాఫియాకు ఇది క్లైమాక్స్ అని ఇక వారంతా జైలు పాల‌వుతార‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

ఇటీవ‌ల ఐటీ దాడుల సమయంలో శశికళ, ఇళవరసి డైరెక్టర్లుగా - వారి బినామీ పేర్లతో పలు బోగస్‌ సంస్థలు ఉన్న విషయం గుర్తించిన‌ట్లు స‌మాచారం. గత ఏడాది నవంబరులో రూ.1000 - రూ.500ల పెద్ద నోట్లు రద్దయిన తరువాత దేశంలో అనేక బోగస్‌ సంస్థలు మూతపడ్డాయి. మూతపడ్డ వాటిల్లో శశికళ - ఇళవరసి వారి బంధువులకు చెందిన పది బోగస్‌ సంస్థలున్నట్లు తెలుస్తోంది. వీటి ద్వారా శశికళ - ఆమె వదిన ఇళవరసి కోట్ల రూపాయల మోసాలకు పాల్పడినట్లు సీబీఐ గుర్తించింద‌ని.. త్వరలోనే వారిద్దరిపై అధికారులు మరో కేసు నమోదు చేయనున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది.

ఈ సంస్థల ద్వారా కొన్ని కోట్లరూపాయల గోల్‌ మాల్‌ సాగినట్లుగా సమాచారం ఉన్నందున విచారణ చేపట్టాల‌ని ఐటీ శాఖను కేంద్రం ఆదేశించింది. ఈ ఆదేశాలతో చెన్నై ఐటీశాఖ ప్రధాన సంచాలకులు మురళీకుమార్ - ఫస్ట్‌ క్లాస్‌ ప్రధాన సంచాలకులు తిరుమలకుమార్‌ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏర్పాటైంది. ఈ ప్రత్యేక బృందం తీవ్రస్థాయిలో రహస్య విచారణ చేపట్టింది. ఈ కంపెనీల్లో రూ.1,012 కోట్ల అవకతవకలు జ‌రిగినట్లు చెన్నై ఐటీ అధికారులు గుర్తించార‌ని చెబుతున్నారు. బోగస్‌ సంస్థలకు ఇళవరసి కుమారుడు వివేక్ - కుమార్తెలు కృష్ణప్రియ - షకీల - మిత్రులు బినామీలుగా ఉన్నార‌ని తేలిన‌ట్లు స‌మాచారం. ఈ సమాచారం మేరకే ఇటీవల శశికళ బంధుమిత్రుల ఇళ్లపై ఐటీదాడులు చేపట్టగా - రూ.1500 కోట్ల విలువైన ఆస్తిపత్రాలు రూ.7 కోట్ల నగదు - రూ.5 కోట్ల విలువైన బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే జయ నివాసం పోయెస్ గార్డెన్‌ లో జరిగిన సోదాల్లో అనేక కొరియర్‌ రశీదులు దొరికాయి. దీంతో విలువైన ఆస్తిపత్రాలను విదేశాలకు చేరవేసి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తూ రశీదులను విశ్లేషిస్తున్నారు.

మొత్తం ఈ వ్యవహారంపై ఒకటి రెండు రోజుల్లో నివేదికను తయారు చేసి సీబీఐకి అప్పగించాలని ఐటీ అధికారులు నిర్ణయించారు. నివేదిక అందగానే శశికళ అండ్‌ కో పై కేసులు నమోదకు సీబీఐ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అంతేగాక సీబీఐ అధికారులు ఇప్పటికే రహస్య విచారణ ప్రారంభించారని తెలుస్తోంది. మరోవైపు, విదేశాల నుంచి వస్తువుల దిగుమతి పేరుతో ఆరు బోగస్‌ సంస్థల ద్వారా రూ.174 కోట్లు విదేశాలకు పంపినట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది. సీబీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ, తమ దృష్టికి వచ్చిన కొన్ని బోగస్‌ సంస్థలకు శశికళ - ఇళవరసి డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఐటీ నుంచి నివేదిక అందగానే దాన్ని ఫిర్యాదుగా పరిగణించి కేసులు పెడతామని తెలిపారు. అవసరమైతే వారిద్దరినీ అరెస్ట్‌ చేస్తామని చెప్పారు. అదే జ‌రిగితే ఇక శ‌శిక‌ళ ప్రాభ‌వం క‌నుమ‌రుగ‌వుతుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.