Begin typing your search above and press return to search.

ప్ర‌త్యేకహోదా కోరుతూ బావిలోకి దూకి ఆత్మ‌హ‌త్య‌

By:  Tupaki Desk   |   4 Sep 2015 4:22 AM GMT
ఏపీకి ప్ర‌త్యేక హోదా కోరుతూ మ‌రో వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. తిరుప‌తిలో కాంగ్రెస్ కార్య‌క‌ర్త మునికోటితో ప్రారంభ‌మైన ఈ ఆత్మ‌హ‌త్య‌లు ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన సెక్యూరిటీ గార్డు ర‌మ‌ణ‌య్య వ్య‌వ‌సాయ బావిలోకి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. కొద్ది రోజుల క్రితం నెల్లూరు ప‌ట్ట‌ణానికి చెందిన విక‌లాంగుడు ల‌క్ష్మ‌య్య కూడా ప్ర‌త్యేక హోదా కోసం ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

గూడూరు మండలం చెన్నూరు గ్రామానికి చెందిన రమణయ్య (40) గూడురులోని ఓ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌లో సెక్యూరిటీ గార్డుగా ప‌ని చేస్తున్నాడు. ఇత‌డు ఆత్మ‌హ‌త్య‌కు ముందు నెల్లూరు జిల్లా క‌లెక్ట‌ర్ పేరిట మూడు లేఖ‌లు రాశాడు. ఏపీకి ప్ర‌త్యేక హోదా రాక‌పోతే రాష్ర్టం అభివృద్ధి చెంద‌ద‌ని...అలాగే త‌మ గ్రామం కూడా వెన‌క‌బ‌డి పోతుంద‌ని...పిల్ల‌ల‌కు ఉద్యోగాలు రావ‌డం లేద‌ని ఆ లేఖ‌ల్లో త‌న ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

ప్ర‌త్యేక హోదా కోసం ర‌మ‌ణ‌య్య ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌న్న విష‌యం తెలుసుకున్న ప‌లువురు పెద్ద సంఖ్య‌లో ఆ బావి వ‌ద్ద‌కు చేరుకున్నారు. పోలీసులు అక్క‌డ‌కు చేరుకుని బావిలోనుంచి మృతదేహాన్ని వెలికితీసేందుకు సన్నాహాలు ఆరంభించారు. సెక్యూరిటీ గార్డుగా ప‌ని చేస్తున్న వ్య‌క్తి కూడా ప్ర‌త్యేక హోదా రాక‌పోతే రాష్ర్టం ఎలా న‌ష్ట‌పోతుందో విపులంగా లేఖ రాసి మ‌రీ చ‌నిపోవ‌డం ప్ర‌తి ఒక్క‌రిని ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. ఇప్ప‌టికైనా మ‌న నాయ‌కులు కళ్లు తెర‌చి. క‌ల్లిబొల్లి క‌బుర్లు క‌ట్టిపెట్టి ప్ర‌త్యేక హోదా విష‌యంపై నిజాయితీతో పోరాటం చేయ‌క‌పోతే ఈ సెంటిమెంట్ మ‌రింత మందిని బ‌లికొనే ప్ర‌మాదం ఉంది.