Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్ లో 'ప‌రువు' హ‌త్యాయ‌త్నం!

By:  Tupaki Desk   |   19 Sep 2018 2:46 PM GMT
హైద‌రాబాద్ లో ప‌రువు హ‌త్యాయ‌త్నం!
X
మిర్యాలగూడలో ప్ర‌ణ‌య్ `పరువు` హత్య దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. ఆ ఘ‌ట‌న నెత్తుటి మ‌ర‌క‌లు ఆర‌క ముందే....హైద‌రాబాద్ న‌డిబొడ్డులో మ‌రో `ప‌రువు`హ‌త్యాయ‌త్నం జ‌రిగింది. న‌గ‌రం న‌డిబొడ్డులోని ఎర్రగడ్డలో ఓ ప్రేమజంటపై అమ్మాయి తండ్రి విచ‌క్ష‌ణార‌హితంగా కొడ‌వ‌లితో దాడి చేశాడు. ఆ పాశ‌విక దాడిలో ప్రేమికులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణాన్ని గ‌మ‌నించిన స్థానికులు బాధితుల‌ను వేర్వేరు ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించారు. అయితే, ఆ ఘ‌ట‌న‌తో యువతికి తీవ్ర‌గాయాలు కావ‌డం అధిక ర‌క్త‌స్రావం కావ‌డంతో ఆమె ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. కులాంత‌ర వివాహం కార‌ణంగానే ఆ హ‌త్యాయ‌త్నం జ‌రిగింద‌ని ప్రాథ‌మిక స‌మాచారం.

బీసీ సామాజికవర్గానికి చెందిన భావ‌న‌ - ఎస్సీ సామాజికవర్గానికి చెందిన సందీప్ లు 10వ త‌ర‌గ‌తి నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే, ఈ పెళ్లి మాధవి త‌ల్లిదండ్రుల‌కు ఇష్టం లేదు. మాధ‌విని ఆమె మేనమామకు ఇచ్చి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు భావించారు. కానీ, వారిని ఎదిరించి ప్రేమించిన సందీప్ ను మాధవి వారం క్రితం పెళ్లాడింది. దీంతో, వారిద్ద‌రిపై తండ్రి క‌క్ష పెంచుకున్నాడు. కూతురు తన పరువు తీసేసిందనే కోపంతో పక్కా ప్రణాళిక ప్రకారం హ‌త్య‌కు ప్లాన్ చేశాడు. అందులో భాగంగా ఆ పెళ్లిని తాను ఆమోదించిన‌ట్లు న‌మ్మ‌బ‌లికాడు. కూతురి ఇంటికి వెళ్లి మాట్లాడాడు. ఫోన్ లో కూడా ట‌చ్ లో ఉన్నాడు. తాజాగా ఈ రోజు ఇద్దరికీ కొత్త బట్టలు పెడతాను... రావాలంటూ న‌మ్మ‌బ‌లికి...వారిని గోకుల్ థియేట‌ర్ ద‌గ్గ‌ర‌కు పిలిపించాడు. అక్క‌డ‌కు వ‌చ్చిన మాధ‌వి తండ్రి ....తనతో తెచ్చిన బ్యాగులో నుంచి కొడ‌వ‌లి తీసి దాడి చేశాడు. ఒక్క‌సారిగా ఇద్దరిపై విచక్షణా రహితంగా దాడిచేసి అక్క‌డి నుంచి పారిపోయాడు. గాయ‌ప‌డ్డ ఇద్ద‌రిని స్థానికులు ఆసుప‌త్రికి త‌ర‌లించారు.