Begin typing your search above and press return to search.

శ‌శిక‌ళ‌పై మ‌రో ఊహించ‌ని కేసు

By:  Tupaki Desk   |   20 Sep 2017 7:20 AM GMT
శ‌శిక‌ళ‌పై మ‌రో ఊహించ‌ని కేసు
X
రాజ‌కీయ నేత‌లు, వ్యాపారవేత్త‌ల‌కు మ‌ధ్య ఉన్న స‌న్న‌టి గీత కూడా చెరిగిపోయి ద‌శాబ్దాలు దాటిన సంగ‌తి తెలిసిందే. సంపాదించుకోవాల‌నే వ్యాపార‌ ఆతృత‌కు అధికారం అనే అవకాశం తోడ‌యితే ఇక రెండు చేతులా సంపాద‌నే. ఇందుకోసం డొల్ల కంపెనీలు, త‌ప్పుడు సంస్థ‌లు వంటివి ఎలాగూ ఉంటాయి. అలాంటి ఉదంతాల్లో తాజాగా ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన అంశాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. మాజీ సీఎం ఒక‌రు..జ‌స్ట్ మిస్ (!) సీఎం ఒక‌రు ఈ జాబితాలో ఉన్న‌ట్లు తేలింది.

డొల్ల కంపెనీల నిజాలను నిగ్గు తేల్చే పనిలో ఉన్న కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ (సిఎఎం) ఇచ్చిన లెక్క‌ల్లో ఆశ్చ‌ర్య‌పోయే వివ‌రాలు బ‌య‌ట‌కు వచ్చాయి. డొల్ల కంపెనీలకు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్న పలువురు ప్రముఖులతో పాటు 1,06,578 మందిపై అయిదు సంవత్సరాల పాటు అనర్హత వేసింది. అనర్హత వేటు వేసిన డైరెక్టర్ల జాబితాలో కేరళా మాజీ ముఖ్యమంత్రి ఊమన్‌ చాందీ, ఆ రాష్ట్ర అసెంబ్లీ విపక్ష నేత రామేష్‌ చెన్నిత్త ఉన్నారు. వీరితో పాటు తమళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రధాన అనుచరురాలుగా ఉండి ముఖ్య‌మంత్రి ప‌ద‌వి కోసం చివ‌రి వ‌ర‌కు ఎదురుచూసి... ప్రస్తుతం జైలుశిక్ష అనుభవిస్తున్న శశికళ పేరు కూడా ఉంది.

వీరితో పాటు గల్ఫ్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఎం.ఎ. యూసప్‌ అలీ పేర్లు ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఉత్తుత్తి కంపెనీల ద్వారా భారీగా ఆర్థిక అక్రమాలతో పాటు మనీ ల్యాండరింగ్‌ జరుగుతున్నట్టుగా అనుమానిస్తున్న సర్కారు దాదాపు రెండు లక్షల డొల్ల కంపెనీల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసిన సంగతి తెలిసిందే. దీనికి తోడు డొల్ల కంపెనీ అక్రమ లావాదేవీల్లో చురుగ్గా పాల్గొన్న చార్టర్డ్‌ అకౌంటెట్లు, కంపెనీ సెక్రెటరీలను సిఎఎం గుర్తించి వారిపై తగిన చర్యలు చేపట్టాల్సిందిగా ఐసీఏఐ, ఐసిఎస్‌ఐలను కోరింది. వేటు పడిన డైరెక్టర్ల పాత్రతో పాటు డొల్ల కంపెనీల లావాదేవీల్లో నిజాలను నిగ్గు తేల్చేందుకు గాను సిఎఎం సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెష్టిగేషన్‌ ఆఫీస్‌, రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీలు, బ్యాంక్‌ల అసోసియేషన్‌తో కూడా కలిసి పని చేస్తోంది. ఈ జాబితాలో బ‌డా బాబుల పేర్లు కూడా బ‌య‌ట‌కు వ‌స్తుండ‌టం గ‌మ‌నార్హం.