Begin typing your search above and press return to search.

మోడీ మ‌న‌సు గెలిచిన బాబు

By:  Tupaki Desk   |   5 Oct 2015 5:54 AM GMT
మోడీ మ‌న‌సు గెలిచిన బాబు
X
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ మాన‌స‌పుత్రిక అయిన దేశ‌వ్యాప్త ఎల్ ఈడీ బ‌ల్బుల వినియోగంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంది. ఎల్‌ఈడీ బల్బుల పంపిణీలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. గత ఏడాది అక్టోబర్‌ 2న దేశవ్యాప్తంగా చేపట్టిన ఈ పథకం కింద ఇప్పటి వ‌ర‌కు ఆయా రాష్ర్టాల్లో పంపిణీ చేసిన వివ‌రాలు ఆరాతీయ‌గా ఏపీ టాప్‌ లో నిలిచింది. తాజా లెక్క‌ల ప్ర‌కారం రాష్ట్రంలో 56,61,091 బల్బులను పంపిణీ చేసి ప్ర‌థ‌మ స్థానంలో నిలిచారు. మిగిలిన రాష్ట్రాల్లో ఈ స్థాయిలో పంపిణీ నమోదు కాలేదు.

రాష్ట్రంలో 56,61,091 బల్బులను సరఫరా చేయగా...దేశ రాజ‌ధాని ఢిల్లీలొ 29,87,749 - ఉత్తరప్రదేశ్ లో 24,68,248 - రాజస్థాన్ లో 22,98,096 - మహారాష్ట్రలో 17,15,096 బల్బులు అందజేశారు. ఇదిలాఉండ‌గా... వీధి దీపాలకు ఎల్‌ ఈడీ బల్బులను అమర్చడంలోనూ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. ఇప్పటిదాకా 1,92,575 ఎల్‌ ఈడీ బల్బులను వీధి దీపాలకు అమర్చారు. ఈ సంఖ్య రాజస్థాన్‌-72,249 - ఢిల్లీ-28,200 - ఉత్తరప్రదేశ్‌-11,465లుగా ఉంది. వచ్చే ఏడాది మార్చి నాటికి రాష్ట్రంలో అన్ని గృహావసర విద్యుత్‌ వినియోగదారులకు మొత్తం రెండు కోట్ల బల్బులను పంపిణీ చేయాలని డిస్కమ్‌లు నిర్ణయించిన విషయం తెలిసిందే.

గ‌త ఏడాది అక్టోబ‌రులో తొలిదశలో గుంటూరు - అనంతపురం - శ్రీకాకుళం - పశ్చిమ గోదావరి జిల్లాల్లో 56 లక్షల బల్బులను డిస్కమ్‌ లు పంపిణీ చేశాయి. మలి దశలో చిత్తూరు - ప్రకాశం - కృష్ణా - విజయనగరం - విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కో ఇంటికీ రెండు చొప్పున ఎల్‌ ఈడీ బల్బులను అందజేస్తున్నారు. ఆయా జిల్లాల్లో బల్బుల పంపిణీ ఇంకా కొనసాగుతోంది. మూడోదశలో కడప - కర్నూలు - తూర్పు గోదావరి - నెల్లూరు జిల్లాలకు బల్బులను పంపిణీ చేయనున్నారు. ఇప్పటిదాకా ఏడు వాట్ల సామర్థ్యం గల బల్బులను పంపిణీ చేసిన డిస్కమ్‌ లో మలి విడతలో తొమ్మిది వాట్ల బల్బులను అందజేయనున్నాయి. దీనికోసం మొత్తం 1.45 కోట్ల బల్బులను సేకరించడానికి టెండర్లను నిర్వహిస్తోంది.