Begin typing your search above and press return to search.

దేశంలోనే నంబ‌ర్ 2 అవినీతి రాష్ట్రంగా ఏపీ

By:  Tupaki Desk   |   28 April 2017 1:42 PM GMT
దేశంలోనే నంబ‌ర్ 2 అవినీతి రాష్ట్రంగా ఏపీ
X
అవినీతిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ మ‌రోమారు టాప్‌ లో నిలిచింది. ఏపీలో కిందటేడాది అవినీతి విపరీతంగా పెరిగిపోయి దేశంలో రెండోస్థానంలో నిలిచింది. సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ (సీఎంఎస్) తాజాగా నిర్వహించిన సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. ఏపీ సహా ఐదు రాష్ర్టాల్లో గత ఏడాది కాలంలో వివిధ రంగాల్లో లంచాలు - అవినీతి పెరిగిపోయినట్లు తెలిపింది. గత పుష్కర కాలంలో ఏయే రాష్ర్టాల్లో ఏయే రంగాల్లో అవినీతి - లంచాలు పెరిగిపోయాయో విశ్లేషించేందుకు సీఎంఎస్ ఇరవై రాష్ర్టాల్లో సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో - ప్రభుత్వ - ప్రజా సేవల్లో అవినీతి తగ్గుముఖం పట్టినట్లు ఈ సర్వేలో వెల్లడైంది.

20 రాష్ట్రాల్లో 10 రకాల ప్రభుత్వ సేవల్లో అవినీతిపై జరిపిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. గత ఏడాది కాలంలో ఎక్కవ అవినీతి జరిగిన రాష్ట్రంగా కర్ణాటక (77 శాతం) మొదటి స్థానంలో నిలువగా ఆంధ్రప్రదేశ్‌ 74 శాతంతో రెండవ స్థానంలో ఉంది. అతి తక్కువ అవినీతి జరిగిన రాష్ట్రంగా హిమాచల్‌ ప్రదేశ్‌ (3 శాతం) నిలిచింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ‌రుస స్థానాల్లో తమిళనాడు (68 శాతం) - మహారాష్ట్ర (57 శాతం) - జమ్ము కాశ్మీర్‌ (44 శాతం) - పంజాబ్‌ (42 శాతం) ఉన్నాయి. సీఎంఎస్‌-ఇండియన్‌ కరప్షన్‌ స్టడీ (సిఎంఎస్‌-ఐసిఎస్‌)-2017 సర్వే ప్రకారం మూడింట ఒక వంతు ప్రజలు సంవత్సరం మొత్తంలో ఏదో ఒక సందర్భంలో అవినీతి సమస్యకు గురయ్యారని వెల్లడైంది. 2005లో 53 శాతం మంది ప్రజలు అవినీతి సమస్యను ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. 2017 సర్వేలో గత ఏడాది ప్రభుత్వ సర్వీసుల్లో అవినీతి పెరిగినట్లు 43 శాతం మంది పేర్కొన్నారు.

2005నాటి సర్వేలో 73 శాతం మంది ప్రభుత్వ సేవల్లో అవినీతి పెరిగినట్లు పేర్కొన్నారు. 2005 సంవత్సరంలో 20,500 కోట్ల మేరకు అవినీతి జరిగినట్లు అంచనా వేయగా, 2017లో అది 6,350 కోట్ల రూపాయిలకు తగ్గిపోయింది. లంచం తీసుకునేవారు అతి తక్కువగా 10 రూపాయిల నుంచి అతి ఎక్కువగా 50 వేల వరకూ వసూలు చేసినట్లు వెల్లడైంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/