Begin typing your search above and press return to search.

ఆంధ్రోళ్లలో లేనిది.. తెలంగాణ వాళ్లలో ఉన్నది..?

By:  Tupaki Desk   |   5 May 2016 4:36 AM GMT
ఆంధ్రోళ్లలో లేనిది.. తెలంగాణ వాళ్లలో ఉన్నది..?
X
మిగిలిన రోజుల మాదిరే బుధవారం మధ్యాహ్నం వరకూ మామూలుగానే సాగింది. కానీ.. సాయంత్రం వేళ.. పార్లమెంటు సమావేశాల్లో ఒక సన్నివేశం చోటు చేసుకుంది. భారతదేశ భవిష్యత్ రాజకీయాల్ని ప్రభావితం చేసే ఉదంతం ఒకటి చోటు చేసుకుంది. ఏపీకి ప్రత్యేక హోదా అంశం గురించి అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు అడిగిన ఒక ప్రశ్నకు కేంద్రమంత్రి జయంత్ సిన్హా లిఖిత పూర్వక సమాధానం ఇస్తూ.. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. అంతేకాదు.. పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి అవసరమైన మేరకు ప్రత్యేక సాయం చేస్తామని మాత్రమే చెప్పారు.

విభజన చట్టంలో పేర్కొన్న విధంగా 2014-15లో రూ.4,403 కోట్లు.. 2015-16లో రూ.2వేల కోట్లు నిధులు ఇచ్చిన విషయాన్ని పేర్కొన్నారు. ఈ మాటలు విన్న వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్కసారి షాక్ తిన్న పరిస్థితి. విభజన నేపథ్యంలో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి చేయూత ఇచ్చేందుకు ప్రత్యేక హోదా అన్నది అత్యంత కీలకమైనదన్న విషయం తెలిసిందే.

ఈ విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా.. 2014 ఎన్నికల సందర్భంగా.. ఏపీలోని ప్రజలకు బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి హోదాలో మోడీ ఇచ్చిన హామీని సైతం వదిలేసి.. ప్రత్యేక హోదా ఏమీ లేదని తేల్చేయటం తెలిసిందే. ఈ పరిణామం చోటు చేసుకున్న తర్వాత ఆంధ్రోళ్లకు జరుగుతున్న అన్యాయం గురించి టీవీ ఛానళ్లు.. వెబ్ సైట్లు తెగ హడావుడి చేసి.. ఏపీకి అన్యాయం జరిగిందని.. ఏపీకి మోడీ ద్రోహం చేశారనటం.. బాబుకు మోడీ టోపీ పెట్టారంటూ ఎవరికి వారు.. ఏపీ అధికారపక్ష నేతలు తమకు తోచిన తీరులో మోడీ సర్కారు తీరును విమర్శించటం మొదలు పెట్టారు.

ఇదంతా ఓపక్క జరుగుతున్న వేళ.. ఏపీలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందా? అన్న సందేహం కలిగినోళ్లు ఉన్నారు. కానీ.. అలాంటిదేమీ లేకుండా ఏపీలో పరిస్థితి ఎప్పటి మాదిరి ప్రశాంతంగా ఉన్న పరిస్థితి. అసలేం జరగనట్లుగా వారి వైఖరి ఉండటం గమనార్హం. ఇలాంటి సమయంలోనే ఒక పోలిక అనివార్యంగా మనసులో మెదలటం ఖాయం.
ఏపీ భవిష్యత్తుకు.. ఏపీ అభివృద్ధికి ఎంతో కీలకమైన ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం చెప్పిన మాట మాదిరే.. తెలంగాణ రాష్ట్ర సాధన సందర్భంలో నెగిటివ్ మాట వచ్చి ఉంటే తెలంగాణ ఎలా ఉండేది? తెలంగాణ ప్రజలు ఎలా రియాక్ట్ అయ్యేవారు? లాంటి ప్రశ్నలు వేసుకుంటే.. ఏపీకి తెలంగాణకు మధ్యనున్న వ్యత్యాసం ఇట్టే అర్థం కావటం ఖాయం. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం హ్యాండ్ ఇచ్చిన తీరులోనే తెలంగాణకు మోసం చేస్తూ కేంద్రం కానీ ప్రకటన ఇచ్చి ఉంటే.. తెలంగాణ ప్రాంతం మొత్తం అట్టుడికిపోవటమే కాదు.. ప్రజలంతా మిగిలిన విషయాల్ని పక్కన పెట్టి రోడ్డు మీదకు వచ్చేవారు. నిరసనలతో హోరెత్తించే వారు.

తప్పనిసరిగా తెలంగాణ వ్యాప్తంగా బంద్ నిర్వహించేవారు. రాస్తారోకోలు.. ధర్నాలు.. ముట్టడించటాలు ఇలా చాలానే ప్రయత్నాలు చేసే వారు. కేంద్రానికి వణుకు పుట్టించేలా చేసేవారు. తమకిచ్చిన హామీని నెరవేర్చకపోతే.. బిడ్డా.. నీ సంగతి చూస్తా అంటూ గర్జించటం ఖాయంగా ఉండేది. కానీ.. అలాంటిదేమీ లేకుండా.. ఎవరి పనుల్లో వారు ఉన్నట్లుగా ఏపీ ప్రజలు వ్యవహరిస్తున్న తీరును చూసిన తర్వాత ఏపీ ప్రజల్లో లేనిదేంటో.. తెలంగాణ ప్రజల్లో ఉన్నదేంటో ఇట్టే అర్థం కాక మానదు. ఇప్పుడు అర్థమైందా? తెలంగాణ ప్రజానీకంలో ఉన్నది.. ఏపీ ప్రాంతీయుల్లో లేనిదేంటో..?