Begin typing your search above and press return to search.

ఏపీ మంత్రులు.. మన్నుతిన్న పాములా?

By:  Tupaki Desk   |   1 Aug 2015 6:58 AM GMT
ఏపీ మంత్రులు.. మన్నుతిన్న పాములా?
X
అంతులేని నిర్లక్ష్యం.. ఏం జరిగినా పట్టనట్లు ఉండటం ఏపీ మంత్రులకే సాధ్యమేమో. గోదావరి పుష్కరాల సమయంలో తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు ఎవరికి వారు మాంచి ఉత్సాహంతో దూసుకెళితే.. ఏపీ మంత్రులు పత్తా లేని పరిస్థితి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కరే రెక్కలు ముక్కలు చేసుకొని తిరిగే పరిస్థితి.

ఇక..ఆయనతో ఉండే మంత్రులంతా చంద్రబాబు వెంట ఉండటం.. దిష్టిబొమ్మల మాదిరి కనిపించటమే తప్పించి.. తమకు తాముగా ఉత్సాహంగా పని చేసిన దాఖలాలు అస్సలు కనిపించవు. మంత్రుల్లో కొందరు పుష్కరాల సందర్భంగా నిత్యం బాబును ఫాలో కావటమే పనిగా పెట్టుకుంటే.. మిగిలిన వారు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండటమే తప్పించి.. హుషారుగా పని చేసింది లేదు.

ఇక.. తొక్కిసలాట లాంటి భారీ ఘటన జరిగినా.. దానిపై వారిలో స్పందన కరువే. తాజాగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో తెలంగాణ సర్కారు పాత్ర ఉందని స్పష్టంగా తేలటంతోపాటు.. తమకుతామే కోర్టులో ట్యాపింగ్ చేశామని ఒప్పుకున్నా తమ్ముళ్ల నోటి నుంచి మాటలు రాని పరిస్థితి. ఒక పక్క కోర్టులో ఏపీ నేతల ఫోన్లు ట్యాప్ చేశామన్న మాట పబ్లిక్ గా ఒప్పుకున్నా.. వారిపై విమర్శల దాడి చేసేందుకు సిద్ధం కాని దుస్థితి.

ఇక.. ఏపీ ప్రయోజనాల గురించి ఏపీ విపక్షం అస్సలు పట్టించుకోవటం లేదని.. ప్రత్యేక హోదా మొదలు ఏపీ ఎదుర్కొంటున్న ఏ విషయం మీద కూడా వైఎస్సార్ కాంగ్రెస్ నేతల మాట్లాడటం లేదని.. తెలంగాణ సర్కారుపై విమర్శలు చేయటం లేదన్న మాట రాదు. తాజాగా విజయవాడలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో మాట్లాడిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఫోన్ ట్యాపింగ్ ఉదంతం.. ఏపీ విపక్ష తీరును ఎండగట్టాలని మంత్రులకు ఆయన సూచించారు. ఒక ముఖ్యమంత్రి చెబితే కానీ.. తమ్ముళ్లు స్పందించటం లేదంటే.. ఏపీ మంత్రులు ఎలా ఉన్నారో ఇట్టే అర్థం అవుతుంది. మన్ను తిన్న పాముల్లా ఉంటున్న మంత్రుల్లోని జడత్వాన్ని చంద్రబాబు మాటలతో మారుస్తారా? చేతలు ఏమైనా ప్రయోగిస్తారా? అన్నది చూడాలి.