Begin typing your search above and press return to search.

వైసీపీ మీడియా ఆఫీసులో ఏపీ పోలీసుల సోదాలు

By:  Tupaki Desk   |   22 April 2017 10:14 AM GMT
వైసీపీ మీడియా ఆఫీసులో ఏపీ పోలీసుల సోదాలు
X
ఫిఫ్త్ ఎస్టేట్ గా పేరుగాంచిన సోష‌ల్ మీడియాపై ఆంధ్ర‌ప్రదేశ్ ప్ర‌భుత్వం త‌న వివాదాస్ప‌ద దూకుడును కొన‌సాగిస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. పొలిటిక‌ల్ పంచ్ పేజీ నిర్వాహ‌కుడు ఇంటూరి ర‌వికిర‌ణ్‌ ను అరెస్ట్ చేసిన‌ పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్త‌మైన నేప‌థ్యంలో విడుద‌ల చేసిన ఏపీ పోలీసులు మ‌రో దుందుడుకు నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీపై త‌మ నజ‌ర్ వేశారు. హైద‌రాబాద్‌ లోని వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా విభాగంపై దాడి చేసి ఆఫీసులో సోదాలు చేశారు. ఈ ప‌రిణామం అంతా విస్తుపోయేలా చేసింది.

వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా విభాగం కార్యాల‌యంలో సోదాల విష‌యం తెలుసుకున్న వైఎస్‌ ఆర్‌ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి - ఎమ్మెల్యేలు కొరుముట్ల శ్రీనివాసులు - అనిల్‌ కుమార్‌ యాదవ్‌ - మాజీ ఎమ్మెల్యే కన్నబాబు - జోగి రమేష్‌ తదితరులు హుటాహుటిన కార్యాల‌యానికి చేరుకున్నారు. పోలీసుల త‌నిఖీల‌పై విస్మ‌యం వ్య‌క్తం చేశారు. ఇలాంటి దురుద్దేశ నిర్ణ‌యాలు స‌రికాద‌ని అన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాల‌ని సూచించారు. పోలీసుల స‌మక్షంలోనే ఏపీ అసెంబ్లీ సెక్రటరీకి ఫోన్‌ చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ ఫిర్యాదు మేర‌కు తాము పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చిన‌ట్లు చెప్ప‌డంపై విజ‌య‌సాయిరెడ్డి ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్సీ ఇచ్చిన ఫిర్యాదుకు స్పందించారంటూ ఈ సందర్భంగా అసెంబ్లీ కార్యదర్శిని విజయసాయిరెడ్డి నిలదీశారు.

ఈ సంద‌ర్భంగా విజ‌య‌సాయిరెడ్డి మాట్లాడుతూ ఏపీ ప్ర‌భుత్వం త‌మ‌కో నీతి, ఇత‌రుల‌కు ముఖ్యంగా ప్ర‌తిప‌క్షాల త‌ర‌ఫున గ‌ళం విప్పేవారికి మ‌రో నీతి అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని మండిప‌డ్డారు. ప్ర‌తిప‌క్ష నేత‌ వైఎస్‌ జగన్‌ - ఆయన కుటుంబసభ్యులపై సభ్య సమాజం హర్షించలేని పోస్టింగ్‌లు పెట్టిన విష‌యం పోలీసుల‌కు క‌నిపించ‌డం లేదా అని ప్ర‌శ్నించారు. ఏకంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు - ప్ర‌స్తుత మంత్రి వైఎస్ జగన్‌ ను దూషిస్తూ పెట్టిన ట్వీట్ల సంగ‌తి ఏమిట‌ని ప్ర‌శ్నించారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డే ఉన్న పోలీసులకు వాటిని చూపించారు. చట్టబద్ధంగా వ్యవహరిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఊరుకునేది లేదని వైఎస్‌ ఆర్‌ సీపీ నేతలు స్ప‌ష్టం చేశారు. కాగా, వైసీపీలోని అన్ని విభాగాలకు తానే ఇంచార్జీన‌ని తెలిపిన విజ‌య‌సాయిరెడ్డి నోటీసులు ఇవ్వాల‌నుకుంటే త‌న‌కు ఇవ్వ‌వ‌చ్చున‌ని తెలిపారు. ప్ర‌భుత్వం, పోలీసుల తీరును ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/