Begin typing your search above and press return to search.

జగన్ ఆదరణకు జడుసుకుంటున్న బాబు సర్కార్!

By:  Tupaki Desk   |   18 Feb 2018 6:30 AM GMT
జగన్ ఆదరణకు జడుసుకుంటున్న బాబు సర్కార్!
X
ప్రజాసంకల్ప యాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లభిస్తున్న ఆదరణ చూసి.. తెలుగుదేశం ప్రభుత్వంలో జడుపు ప్రారంభం అయిందా? జగన్ ప్రకటిస్తున్న హామీలు చూసి ప్రజల్లో ప్రధానంగా యువతరంలో ఆయన పట్ల వెల్లువెత్తుతున్న ప్రజాదరణ ధాటికి తట్టుకోవాలంటే.. ఆయన హామీలను తాము ముందే కొంత మేరకైనా అమలు చేస్తే తప్ప మనుగడ సాధ్యం కాదని తెదేపా భయపడుతోందా? తాజాగా ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన ప్రకటన చూస్తోంటే అలాగే అనిపిస్తోంది.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రను ప్రారంభించకముందే.. నవరత్నాల రూపంలో రాష్ట్రం కోసం తాను ఎలాంటి మంచి పనులు చేయదలచుకుంటున్నాడో.. ప్రకటించేశారు. ఆ పిమ్మట... యాత్ర ప్రారంభించారు. అయితే పాదయాత్ర ద్వారా క్షేత్ర స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలను వారిద్వారానే తెలుసుకుని.. తన రాబోయే ఎన్నికల ఎజెండాను రూపొందించుకోవాలనే ఆయన ఆలోచన అద్భుతంగా పలించింది. సాధారణంగా ఊహకు అందని అనేక రకాల క్షేత్ర స్థాయి ఇబ్బందులను ప్రజలు ఆయన దృష్టికి తెస్తున్నారు. వాటిలో తెదేపా సర్కారు విద్యార్థులకు ఇస్తున్న చాలీచాలని మెస్ చార్జీల వ్యవహారం కూడా ఒకటి. విద్యార్థుల మెస్ చార్జీలను తన ప్రభుత్వంలో భారీగా పెంచుతానంటూ జగన్ స్పష్టమైన హామీ ఇచ్చారు. దీనికి స్పందించిన యువతరం - విద్యార్థిలోకం ఆయన పాదయాత్రలో నీరాజనాలు పలుకుతున్నారు.

ఇది చూసి చంద్రబాబు సర్కార్ ఖంగుతిన్నట్లుంది. త్వరలోనే విద్యార్థుల మెస్ చార్జీలు పెంచబోతున్నట్లుగా ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించారు. జగన్ ప్రశ్నించాకే నిరుద్యోగభృతి విషయంలో ప్రభుత్వంలో కదలిక వచ్చిన సంగతి తెలిసిందే. ఆ రకంగా జగన్ సీఎం కాకముందే.. తనహామీలను ఈ ప్రభుత్వం ద్వారా కార్యరూపంలోకి తెస్తున్నట్లుగా ఉన్నదని ప్రజలు సంతోషిస్తున్నారు.