Begin typing your search above and press return to search.

గల్లా పెట్టె బోర్లా పడింది

By:  Tupaki Desk   |   14 Feb 2016 7:33 AM GMT
గల్లా పెట్టె బోర్లా పడింది
X
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నష్టాల ఊబి నుంచి గట్టెక్కలేకపోతోంది. రాష్ట్ర ప్రభుత్వం పన్ను రాబడిపై పెట్టుకున్న అంచనాల లెక్కలు గాడి తప్పుతున్నాయి. 2015-16 ఆర్ధిక సంవత్సరంలో ఆశించిన ఆదాయం కంటే 12 వేల కోట్ల ఆదాయం తగ్గుతోంది. ఈ ఏడాది పన్నుల రూపేణా 44,423 కోట్ల ఆదాయం వస్తుందని రాష్ట్ర ఆర్ధిక శాఖ పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం మార్చి 31తో ముగుస్తుంది. పన్ను వసూలు 40,029 కోట్ల రూపాయలు వస్తుందని తేలింది. అంటే దాదాపు రూ.4394 కోట్లమేర తగ్గుతుందనే సరికి, ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. సామాజిక సంక్షేమ పథకాలు, సబ్సిడీలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందంటున్నారు. పన్ను, పన్నేతర ఆదాయంలో ఐదు వేల కోట్లు, కేంద్రం నుంచే వచ్చే రుణాలు, నాబార్డు అప్పు అంచనా తగ్గింది. దీని ప్రభావం కూడా ఖజానాపై ఉంది.

ఆర్ధిక శాఖ తాజాగా విడుదల చేసిన గణాంక వివరాల ప్రకారం పన్నేతర ఆదాయం అంచనా రూ.5341 నుంచి రూ. 730 కోట్లు తగ్గి, రూ.4611 కోట్లకు చేరింది. కేంద్ర పన్నుల వాటా బాగుంది. ఆశించినట్లుగా రూ.22638 కోట్లు వచ్చింది. కేంద్ర గ్రాంట్లు అంతే. రూ.17722 కోట్లు ఖజనాకు చేరింది. రుణాల వసూలు అంచనా రూ.253 కోట్లు. కాగా రూ.295 కోట్లు వసూలైంది. రూ.42 కోట్లు అదనంగా రావడం శుభపరిణామం. కాగా మార్కెట్ రుణాలు 2291 కోట్లు తగ్గాయి. రూ.18577 కోట్ల నుంచి రూ.16286 కోట్లకు తగ్గాయి. కేంద్రంనుంచి రూ.1260 కోట్లు వస్తాయని ఆశించారు. కాగా రూ.1017 కోట్లు వచ్చాయి. నాబార్డు అప్పులు రూ.890 కోట్లకు రూ.696 కోట్లు విడుదలయ్యాయి. అంటే రూ.194 కోట్లు తగ్గింది. ఇక వేస్ అండ్ మీన్స్ (చేబదుళ్లు) రూ.1748 కోట్లు తీసుకుంటామని అంచనా వేశారు. కాగా రూ. 4086 కోట్లను తీసుకున్నారు. రాష్ట్ర ఆదాయం మొత్తం 1,12,852 కోట్లు ఉంటుందని అంచనా వేయగా, రూ.1.95 కోట్లు మాత్రమే వస్తుందని ఆర్ధిక శాఖ తేల్చింది. దాదాపు 12వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందన్న అంచనా కాస్తా లెక్క తప్పింది. వాణిజ్య పన్నుల శాఖ వృద్ధిరేటు , ఎక్సైజ్ శాఖ ఆదాయం రేటు ఆశించినట్లుగా లేవు. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో పెట్టుకున్న ఆశలు ఫలించాయి. ఈ ఏడాది సొంత ఆదాయం ద్వారా రూ.50 వేల కోట్ల రూపాయలను సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, రూ.44,639 కోట్లు మాత్రమే వస్తుందని ఆర్ధిక శాఖ వర్గాలు తెలిపాయి.

మొత్తానికి చూస్తే ఏపీ పరిస్థితి దారుణంగా ఉందని అర్తమవుతోంది. ఖజానా గల్లా పెట్టె ఖాళీ అయిపోయి బోర్లా పడింది.