Begin typing your search above and press return to search.

జగన్ డేర్.. హోదాపై మోదీనే నిలదీశారు

By:  Tupaki Desk   |   15 Jun 2019 4:50 PM GMT
జగన్ డేర్.. హోదాపై మోదీనే నిలదీశారు
X
నవ్యాంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా డేరింగ్ గానే సాగుతున్నారు. విపక్షంలో ఉన్న సమయం నాటి నుంచి ఏపీకి ప్రత్యేక హోదాపై తనదైన శైలి పోరాటం సాగిస్తున్న జగన్... తాజా ఎన్నికల్లో బంపర్ విక్టరీ సాధించి అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత కూడా అదే పోరాట స్ఫూర్తితో సాగుతున్నారు. అంతేకాదండోయ్... వరుసగా రెండో సారి కూడా స్పష్టమైన మెజారిటీ సాధించి తనకు తిరుగే లేదన్నట్లుగా వ్యవహరిస్తున్న ప్రదాని నరేంద్ర మోదీని ఏకంగా నిలదీసినంత పనిచేశారు. అసలు ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకివ్వరో చెప్పాలంటూ జగన్ చేసిన ప్రసంగం అటు కేంద్రంతో పాటు నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైన వివిధ రాష్ట్రాల సీఎంలను కూడా ఆకట్టుకుందనే చెప్పాలి.

నేటి మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ భేటీకి ఏపీ సీఎం హోదాలో జగన్ హాజరయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా సాగుతున్న జగన్... నీతి ఆయోగ్ లో వ్యవహరించాల్సిన ప్రణాళికను ముందే సిద్ధం చేసుకున్నారు. సమావేశంలో తన వంతు రాగానే గొంతు సవరించుకున్న జగన్... ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని తన వాయిస్ చాలా గట్టిగా వినిపించారు. అసలు ఏపీకి ప్రత్యేక హోదా వద్దన్నదెవరంటూ జగన్ సంధించిన ప్రశ్నతో మోదీ స్థాణువే అయిపోయారన్న వాదన కూడా వినిపిస్తోంది.

అయినా తన ప్రసంగంలో జగన్ ఏఏ అంశాలను ప్రస్తావించారన్న విషయానికి వస్తే.. రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోతున్న ఏపీని ఆదుకునేందుకు కేంద్రం సిద్ధపడిన క్రమంలోనే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అంతా అంగీకరించారన్న విషయాన్ని జగన్ గుర్తు చేశారు. ఈ మేరకు నాడు రాష్ట్ర విభజన సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏతో పాటు నాడు విపక్ష హోదాలో ఉన్న ఎన్డీఏ కూడా ఏపీకి ప్రత్యే్క హోదాకు సానుకూలంగానే ఉన్న విషయాన్ని జగన్ గుర్తు చేశారు. ఆ మేరకు యూపీఏ ప్రభుత్వం తన చివరి కేబినెట్ సమావేశంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి తీర్మానం చేసిందని జగన్ చెప్పారు. ఇక 2014 ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన వైనాన్ని కూడా జగన్ ప్రస్తావించారు. కేంద్ర కేబినెట్ తీర్మానం చేయడం, విపక్షంగా ఉన్న ఎన్డీఏ నాడు దానికి అనుకూలంగా వ్యవహరించడాన్ని ప్రస్తావించిన జగన్... అందరూ ఓకే అన్నా కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి కారణాలేమిటని కూడా ప్రశ్నించారు.

ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని యూపీఏ హయాం నాటి కేబినెట్ తీసుకున్న ప్రతిని, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో కాపీని, ప్రత్యేక హోదాను రద్దు చేయలేదంటూ ప్రణాళికా సంఘం సభ్యుడు అభిజిత్ సేన్ ఇచ్చిన వివరణ ప్రతిని కూడా జగన్ దానికి జత చేశారు. అసలు ఏపీకి ప్రత్యేక హోదా అవసరం ఏ మేరకు ఉందన్న విషయాన్ని కూడా జగన్ ఈ సందర్భంగా చాలా క్లియర్ గా పాయింట్ టూ పాయింట్ గా వివరించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల జరిగే ప్రయోజనాలు, ప్రత్యేక హోదా ఇవ్వకుండా జాప్యం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కూడా జగన్ చాలా వివరంగానే సమావేశంలో ప్రస్తావించారు. మొత్తంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనన్న కోణంలో జగన్ చాలా డేరింగ్ గా ఇచ్చిన ప్రసంగం ఇప్పుడు ఏపీ ప్రజల్లో కొత్త ఆశలను చిగురింపజేసిందన్న వాదన వినిపిస్తోంది.