Begin typing your search above and press return to search.

ఆనం దెబ్బ‌!... టీడీపీ విల‌విల్లాడుతోందే!

By:  Tupaki Desk   |   17 April 2018 1:00 PM GMT
ఆనం దెబ్బ‌!... టీడీపీ విల‌విల్లాడుతోందే!
X
ఆనం వివేకానంద‌రెడ్డి - ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డిలు నెల్లూరు జిల్లా రాజ‌కీయాల్లో త‌మ‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకున్న నేత‌లుగా మ‌న‌కు తెలుసు. రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన కొత్త‌ల్లో టీడీపీలో ఉన్నా... ఆ త‌ర్వాత ప్రస్తుత టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు వైఖ‌రి కార‌ణంగా ఆనం ఫ్యామిలీ కాంగ్రెస్ గూటికి చేరింది. ఆ తర్వాత దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి ముఖ్య అనుచ‌ర వ‌ర్గంలో కీల‌క వ్య‌క్తులుగా మారిపోయిన ఆనం బ్ర‌ద‌ర్స్ ఇక వేరే పార్టీ ముఖం చూడాల్సిన అవ‌స‌రం రాలేదు. అయితే రాష్ట్ర విభ‌జ‌న ద‌రిమిలా... కాంగ్రెస్ ప్రాభ‌వం నానాటికీ కొడిగ‌డుతున్న నేప‌థ్యంలో ఆనం బ్ర‌ద‌ర్స్ కూడా త‌మ భ‌విష్య‌త్తును దృష్టిలో పెట్టుకుని ప్ర‌త్యామ్నాయాల వైపు చూడ‌క త‌ప్ప‌లేదు. కొన్ని అనివార్య కార‌ణాల‌తో ఇటీవ‌లే వారు కాంగ్రెస్‌ కు గుడ్ బై చెప్పేసి టీడీపీలో చేరారు. అయితే పార్టీలో చేరేదాకా ఆనం బ్ర‌దర్స్ కోరిన దానికంతా ఓకే అన్న బాబు బ్యాచ్‌... ఆ త‌ర్వాత త‌మ‌దైన పాత వైఖ‌రితో ముందుకు సాగుతూ ఆనం బ్ర‌ద‌ర్స్‌కు ఇచ్చిన హామీల‌ను తుంగ‌లో తొక్కేసింది.

ఆనం వివేకాకు ఇస్తామ‌న్న ఎమ్మెల్సీ టికెట్‌ ను ఇవ్వ‌క‌పోగా... చూద్దాం... చేద్దాం అంటూ సాగ‌దీస్తోందట‌. అంతేకాకుండా ఆత్మ‌కూరు టీడీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జీగా ఉన్న అనం రామ‌నారాయ‌ణ రెడ్డికి పార్టీ కార్యాక‌ర్త‌లు స‌హ‌క‌రించుకుండా తెర వెనుక రాజ‌కీయాల‌కు కూడా పాల్ప‌డిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆనం బ్ర‌ద‌ర్స్ మ‌రోమారు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్త‌లు టీడీపీ వెన్నులో వ‌ణుకు పుట్టిస్తున్నాయి. ఎందుకంటే... నెల్లూరు జిల్లాలో ఆనం బ్ర‌ద‌ర్స్‌ కు మంచి ప‌ట్టు ఉంది. దీంతో బాబు సూచ‌న‌ల‌తో రంగంలోకి దిగిన టీడీపీ సీనియ‌ర్లు... ఆనం బ్ర‌ద‌ర్స్‌ తో చ‌ర్చ‌లు జ‌రిపేందుకు విశ్వ ప్ర‌య‌త్నాలు చేశార‌ట‌. అయితే త‌మ‌కు ఇప్ప‌టికే తీవ్ర అవ‌మానం జ‌రిగింద‌ని చెప్పేసిన ఆనం బ్ర‌ద‌ర్స్ పార్టీ మారేందుకే నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా స‌మాచారం.

ఈ క్ర‌మంలోనే నిన్న‌టిదాకా ఆనం బ్ర‌ద‌ర్స్ వైపు క‌న్నెత్తి చూసేందుకు కూడా సిద్ధ‌ప‌డ‌ని చంద్ర‌బాబు... అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరిన ఆనం వివేకాను ప‌రామ‌ర్శించేందుకు బ‌య‌లుదేరిన‌ట్లుగా తెలుస్తోంది. అయితే చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రించిన తీరుతో తీవ్ర మ‌నస్తాపం చెందిన ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి... చంద్ర‌బాబు ఆసుప‌త్రికి వ‌చ్చే ముందుగా అక్క‌డి నుంచి వెళ్లిపోయిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఆనం వివేకాకు ప‌రామర్శ పేరిట బాబు నెర‌పిన మంత్రాంగం బెడిసికొట్టింద‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. అయినా ఇప్పుడు ఆనం బ్ర‌ద‌ర్స్ ఏ పార్టీలోకి వెళ‌తార‌న్న విష‌యానికి వ‌స్తే... త‌మ‌కు అత్యంత స‌న్నిహితులైన వైఎస్ ఫ్యామిలీ ఆధ్వ‌ర్యంలోని వైసీపీలోకేన‌న్న వాద‌న వినిపిస్తోంది. ఈ దిశ‌గా ఇప్ప‌టికే ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి వైసీపీ నేత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని... నేడో, రేపో ఆయ‌న‌ వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో భేటీ అయ్యే అవ‌కాశాలున్న‌ట్లుగా స‌మాచారం. జిల్లాలోని ఆత్మ‌కూరు, వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏదో ఒక‌టి త‌మ‌కివ్వాల‌ని ఆనం కోరుతుండ‌గా... అందుకు వైసీపీ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లుగా ప్ర‌చారం సాగుతోంది.

ఇదంతా బాగానే ఉన్నా... ఆనం బ్ర‌ద‌ర్స్‌కు పార్టీలో జ‌రుగుతున్న అవ‌మానాల‌ను ద‌గ్గ‌ర నుంచి చూస్తున్న టీడీపీ సీనియ‌ర్‌ - మంత్రి సోమిరెడ్ది చంద్ర‌మోహ‌న్ రెడ్డి నిన్న‌టిదాకా ఈ విష‌యంపై అస‌లు నోరు మెదిపిన దాఖ‌లా లేదు. అయితే ఆనం బ్ర‌ద‌ర్స్ పార్టీ మారుతున్నార‌న్న వార్త‌లు బ‌య‌ట‌కు రాగానే... మీడియా ముందుకు వ‌చ్చిన సోమిరెడ్డి త‌న‌దైన కొత్త వాద‌న‌ను వినిపించారు. ఆనం బ్ర‌ద‌ర్స్ పార్టీ వీడటం లేద‌ని, అవ‌న్నీ పుకార్లేన‌ని సోమిరెడ్డి చెప్పుకొచ్చారు. మ‌రి ఆనం వివేకాను ప‌రామర్శించేందుకు చంద్ర‌బాబు వ‌చ్చిన స‌మ‌యంలో ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి ఎందుకు ముఖం చాటేశార‌న్న విష‌యంపై మాత్రం సోమిరెడ్డి క్లారిటీ ఇవ్వ‌లేక‌పోయారు. మొత్తంగా ఆనం వైసీపీలోకి చేరుతున్నార‌న్న వార్త‌లు టీడీపీలో పెద్ద గుబులునే రేపాయ‌న్న కోణంలో విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.