Begin typing your search above and press return to search.

ఆనం బ్రదర్స్ రాక ఇక అధికారికం

By:  Tupaki Desk   |   26 Nov 2015 10:55 AM GMT
ఆనం బ్రదర్స్ రాక ఇక అధికారికం
X
ఊహాగానాలకు ఆనం బ్రదర్స్ తెరదించారు. తాము కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశామని, అతి త్వరలోనే టీడీపీలో చేరనున్నామని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని నెల్లూరులో జరిగిన సమావేశం తర్వాత గురువారం అధికారికంగా ప్రకటించారు.

పార్టీలు అధికారాన్ని కోల్పోవడం మళ్లీ అధికారంలోకి రావడం సహజం. ఇప్పుడు కాకపోతే మరో ఐదేళ్లో పదేళ్లో తర్వాత కాంగ్రెస్ కూడా అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ దిశగా ఆ పార్టీ సర్వశక్తులూ ఒడ్డుతుంది కూడా. అంత మాత్రానికే కాంగ్రెస్ ను విడిచిపెట్టి ప్రతి ఒక్కరూ టీడీపీ సైకిల్ ఎక్కేయాలా అంటే.. వారికి కూడా తప్పడం లేదనే చెప్పాలి.

అధికారం లేకపోతే ప్రతిపక్ష నేతగా అయినా ఎంతో కొంత గుర్తింపు ఉంటుంది. మళ్లీ ఐదేళ్ల తర్వాత అధికారంలోకి వస్తారేమోనని అధికారులు కూడా ప్రతిపక్ష నేతలకు పనులు చేసి పెడుతూ ఉంటారు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి అది కాదు. నవ్యాంధ్రలో ఆ పార్టీ ప్రతిపక్షంగా కూడా లేదు. సమీప భవిష్యత్తులో అధికారంలోకి వస్తుందన్న ఆశ లేదు. దాంతో అధికారులు కూడా పనులు చేయడం లేదు. అసలు కాంగ్రెస్ నాయకులను పట్టించుకోవడం లేదు. ఒకప్పుడు అద్భుతమైన అధికారం చెలాయించిన వాళ్లకు ఇప్పుడు ఎంపీడీవో కూడా పట్టించుకోవడం లేదు.

శ్రీకాకుళంలో బొత్స సత్యనారాయణ అయినా నెల్లూరులో ఆనం బ్రదర్స్ అయినా ఇదే పరిస్థితి. తెలుగుదేశం అధికారంలో ఉంటే ఆ పార్టీ కార్యకర్తలకే పనులు దక్కుతాయి. రాబోయే పదేళ్లపాటు ఇదే పరిస్థితి ఉంటే కేడర్ ను పట్టి నిలిపి ఉంచడం కష్టం. ఇప్పుడు కాకపోతే 2024లో అయినా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న ఆశ ఆ పార్టీ నేతలకు లేదు. కేంద్రంలో నరేంద్ర మోదీని చూసినా ఇప్పట్లో కుర్చీ వదిలి పెడతాడనే పరిస్థితులు కనిపించడం లేదు. రాష్ట్రంలో చంద్రబాబును చూసినా రాజధానిని తాత్కాలికంగా పూర్తి చేసినా టీడీపీకి తిరుగుండదు. రాష్ట్రంలో జగన్ మైనస్ గానే ఉన్నాడు కేంద్రంలో రాహుల్ మైనస్ కు బాబులా ఉన్నాడు. అంటే ఇక్కడ వైసీపీ, అక్కడ కాంగ్రెస్ పుంజుకునే పరిస్థితులు కనుచూపు మేరలో కనిపించడం లేదు. అవే పుంజుకునే పరిస్థితులు లేవంటే ఇక కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరమే. అందుకే ఆనం బ్రదర్స్ మళ్లీ సైకిలెక్కారు.