Begin typing your search above and press return to search.

చంద్రుళ్లకు బీపీ పెంచేలా అమిత్ షా స్కెచ్‌

By:  Tupaki Desk   |   19 Aug 2017 4:30 AM GMT
చంద్రుళ్లకు బీపీ పెంచేలా అమిత్ షా స్కెచ్‌
X
బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా తెలుగు రాష్ర్టాల‌పై ప్ర‌త్యేక న‌జ‌ర్ పెట్టారా? భారీ టార్గెట్‌ ను విధించుకున్న అమిత్ షా ఈ క్ర‌మంలో తెలంగాణ‌పై పెట్టిన స్పెష‌ల్ ఫోక‌స్ తెలంగాణ సీఎం కేసీఆర్‌ కు బీపీ పెంచేస్తోందా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. తెలంగాణాలో ఏడు - ఆంధ్రలో ఐదు సెగ్మెంట్లతోపాటు దేశం మొత్తంమీద 350 లోక్‌ సభ స్థానాలపై బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా దృష్టి సారిస్తున్నారు. 2019లో జరిగే లోక్‌ సభ ఎన్నికల్లో 350 స్థానాలు కైవసం చేసుకోవటం ద్వారా రెండోసారీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చేందుకు షా కార్యచరణ సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో షా ప్రత్యేక దృష్టి సారించనున్న 150 లోక్‌ సభ స్థానాల్లో ఏడు తెలంగాణ - ఐదు ఆంధ్ర స్థానాలు ఉన్నట్టు తెలిసింది.

గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిన బిజెపికి ప్రస్తుతం 282 లోక్‌ సభ సీట్లున్నాయి. ఈ విజయాన్ని 350కి చేర్చేందుకు షా ఇప్పటి నుంచే పెద్ద ఎత్తున ప్రయత్నాలు మొదలెట్టారు. గతవారం 10మంది మంత్రులతో సమావేశమై చర్చించిన అమిత్ షా - అద్భుతమైన కార్యాచరణ సిద్ధం చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కోర్‌ టీంలో ఉన్న పదిమంది మంత్రులు శాఖల బాధ్యతలు చూసుకుంటూనే, షా రూపొందిస్తున్న 2019 కార్యచరణ పథకం అమలునూ పర్యవేక్షిస్తారని అంటున్నారు. ఎంపిక చేసిన 350 లోక్‌ సభ స్థానాల్లో మూడు నెలలకోసారి సర్వే జరిపించి ప్రభుత్వ పథకాల అమలు తీరును పర్యవేక్షిస్తారు. అలాగే, బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తుంటే ఎంపీ పని తీరు ఎలా ఉంది? ప్రధాని మోడీ చేపట్టిన పథకాల ఫలితాలు వారికి ఏమేరకు అందుతున్నాయి? బీజేపీ శ్రేణులు ఏమేరకు ప్రజలకు వివరించగలుగుతున్నారు? వీటిపై ప్రజాభిప్రాయం ఏమిటి? అనేది తెలుసుకుంటారు. బీజేపీ ఎంపీలు - మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌ సభ నియోజకవర్గాల్లో సర్వే మరింత లోతుగా, నిశితంగా జరుగుతుందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. సమర్థంగా పనిచేయని బీజేపీ ఎంపీలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ లభించటం కష్టమని అంటున్నారు. ఎంపిక చేసిన 350 లోక్‌ సభ స్థానాలకు స్థానిక రాజకీయాలు - అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక కార్యచరణ పథకాలు సిద్దం చేస్తున్నారు. ప్రతి లోక్‌ సభ సెగ్మెంట్‌ కు ప్రత్యేక కార్యకర్తలను కేటాయిస్తున్నారు. వీరు తమకు కేటాయించిన లోక్‌ సభ నియోజకవర్గంలో ఉంటూ పనిచేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే బీజేపీ విజయం సాధించేందుకు వీలున్న 150 లోక్‌ సభ నియోజకవర్గాల్లో పార్టీని మరింత పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

తెలంగాణ‌లోని సికింద్రాబాద్‌ తోపాటు కరీంనగర్ - భువనగిరి - నిజామాబాద్ - జహీరాబాద్ - మల్కాజ్‌ గిరి - చేవెళ్ల లోక్‌ సభ నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలోని మొత్తం 17 లోక్‌ సభ నియోజకవర్గాల్లో పోటీ చేసినా ఎంపిక చేసుకున్న వాటిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. ఆంధ్రలో బీజేపీ ప్రస్తుతం విశాఖపట్నం - నర్సాపురం లోక్‌ సభ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తోంది. అయితే 2019 ఎన్నికల్లో రెంటితోపాటు రాజమండ్రి - హిందూపూర్ - అనకాపల్లి లోక్‌ సభ నియోజకవర్గాల్లో విజయం సాధించాలని బీజేపీ అధినాయకత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. లోక్‌ సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో సీట్ల సర్దుబాటు జరిగే పక్షంలో విశాఖపట్నం - నర్సాపురంతోపాటు రాజమండ్రి - హిందూపూర్ - అనకాపల్లి లోక్‌ సభ నియోజవర్గాల కోసం పట్టుపట్టవచ్చని అంటున్నారు. తెలంగాణలో తెరాసతో పొత్తు పెట్టుకునే అంశంపై బిజెపి ఇంతవరకు ఎలాంటి ఆలోచనా చేయలేదని అంటున్నారు. బండారు దత్తాత్రేయ ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్‌ తో పాటు గతంలో తాము గెలిచిన కరీంనగర్ సెగ్మెంట్‌ లో విజయం సాధించేందుకు గట్టిగా కృషి చేయాలని బీజేపీ భావిస్తోంది. ప్రస్తుతం మహారాష్ట్ర, తమిళనాడు గవర్నర్‌ గా పనిచేస్తున్న సీహెచ్ విద్యాసాగర్ రావు గతంలో కరీంనగర్ లోక్‌ సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించటంతోపాటు కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రిగా పని చేయటం తెలిసిందే. ఈ రెండు నియోజకవర్గాలతోపాటు భువనగిరి - నిజామామాద్ - జహీరాబాద్ - మల్కాజ్‌ గిరి - చేవెళ్ల లోక్‌ సభ నియోజకవర్గాల్లో విజయం సాధించేందుకు ప్రత్యేక కార్యచర పథకాలు అమలు చేయాలని అమిత్ షా ఆలోచిస్తున్నారు. వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు అవిభాజిత ఆంధ్రలో ఏడు లోక్‌ సభ నియోజకవర్గాల్లో విజయం సాధించటం తెలిసిందే. బీజేపీ దక్షిణాదిన కర్నాటకలో మాత్రమే బలంగా ఉండటంతోపాటు ఒకసారి అధికారంలోకి కూడా వచ్చింది. అందుకే కర్నాటకలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు గట్టిగా కృషి చేయటంతోపాటు లోక్‌ సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుచుకోవాలన్నది బీజేపీ వ్యూహం. కర్నాటకతోపాటు తెలంగాణ - ఆంధ్ర - తమిళనాడు - కేరళ రాష్ట్రాల్లో బిజెపిని నిలబెట్టాలన్నది అమిత్ షా ఆలోచన.