Begin typing your search above and press return to search.

నిజాం అస్త్రంతో కేసీఆర్‌ పై అమిత్ షా గురి!

By:  Tupaki Desk   |   24 May 2017 3:41 PM GMT
నిజాం అస్త్రంతో కేసీఆర్‌ పై అమిత్ షా గురి!
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా కొత్త స్కెచ్ రూపొందించార‌ని రాజ‌కీయవ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఒకే స్కెచ్‌ తో రెండు ర‌కాల ప్ర‌యోజ‌నాలు గురిపెట్టిన అమిత్ షా... త‌మ పార్టీ మత ఎజెండాతో పాటుగా కేసీఆర్ ప‌దేప‌దే జ‌పించే నిజాం పేరుతోనే ఆయ‌న్ను ఇర‌కాటంలో ప‌డేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఇందులో భాగంగా న‌ల్గొండ జిల్లాలో వరుసగా మూడో రోజు పర్యటిస్తున్న అమిత్ షా రజాకార్ల బాధిత కుటుంబాలతో ఈ రోజు భేటీ అయ్యారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి వాసులు సాహసోపేతంగా నిజాం దాష్టికాలను, రజాకార్ల దౌర్జన్యాలను ఎదిరించి పోరాడిన వారికి ఆయన ఈ సందర్భంగా నివాళులర్పించారు.

రజాకార్ల దాడులకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను అమిత్ షా తిలకించారు. గుండ్రాంపల్లిలో రజాకార్ల బాధిత కుటుంబాలతో సమావేశమయ్యారు. ఈ ప్ర‌త్యేక స‌మావేశం ద్వారా నిజాం జ‌పం జ‌పించే కేసీఆర్‌కు వ్య‌తిరేక శ‌క్తుల‌న్నింటినీ ఏకం చేసేందుకు స‌న్న‌ద్ధం చేసిన‌ట్లు అవుతుంద‌ని అంటున్నారు. అదే స‌మ‌యంలో నిజాం వ్య‌తిరేక పోరాట ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకున్న గుండ్రాంప‌ల్లిలో ఇంటింటికీ తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో స్థానికులతో కలిసి ఆయన సహపంక్తి భోజనం చేశారు. భువనగిరిలో పార్టీ నేతలు, కార్యకర్తలతో పార్టీ పటిష్టతపై మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో బీజేపీ బలోపేతమే లక్ష్యంగా ఈ పర్యటన చేపట్టినట్లు చెప్పారు. దీనికంత‌టికీ నిజాం వ్య‌తిరేక శ‌క్తుల‌ను త‌మ ద‌రికి చేర్చుకోవ‌డ‌మ‌నే ఏకైక అజెండా ఉంద‌ని విశ్లేష‌ణలు చేస్తున్నారు.

కాగా పార్టీ నేత‌ల‌తో అమిత్ షా స‌మావేశం అయ్యారు. బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యమని అమిత్ షా అన్నారు. పోలింగ్ బూత్ నుంచి జాతీయ స్థాయి వరకూ నాయకులంతా ఇక్కడ ఉన్నారనీ, అలాగే క్షేత్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకూ విస్తరిస్తుందన్నారు. ఈ మూడేళ్ల కాలంలోనే తెలంగాణకు రూ. లక్ష కోట్లకు పైగా నిధులు ఇచ్చామని ఆయన స్పష్టం చేశారు. అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు చేరకుండా కుట్రలు చేస్తున్నదని పునరుద్ఘాటించారు. 2019 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే పూర్తి విశ్వాసం తనకు ఉందని, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి లక్ష్మణ్‌పై కూడా నమ్మకం ఉందని అమిత్ షా అన్నారు. ఎన్నీ సీట్లు గెలుస్తామనేది కాదని, అధికారంలోకి మాత్రం బీజేపీ వస్తుందని అమిత్‌ షా అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోని అంశాలను అమలుపై స్పందిస్తూ ఇప్పటికే రాష్ట్రానికి వైద్య, విద్య రంగాలకు సంబంధించి ఆరు విశ్వ విద్యాలయాలు ఇచ్చామని తెలిపారు. నిజాం ప్రభుత్వ హయాంలో రాజకార్లు తెలంగాణలో దమకాండను నిర్వహించి వేలాది మందిని హత్యలు చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ అమర వీరులను తమ పార్టీ ఎప్పటికి గుర్తుంచుకుంటుందన్నారు. తెలంగాణ ప్రజలకు కూడా తమ పార్టీని సంపూర్ణంగా విశ్వసిస్తారనే నమ్మకం ఉందని, రాష్ట్రంలో చేపట్టిన రెండు రోజుల పర్యటన వల్ల స్పష్టమైందన్నారు.