Begin typing your search above and press return to search.

అమిత్ షా దూసుకొస్తున్నాడు కేసీఆర్ సాబ్‌

By:  Tupaki Desk   |   19 April 2017 9:06 AM GMT
అమిత్ షా దూసుకొస్తున్నాడు కేసీఆర్ సాబ్‌
X
2019 ఎన్నిక‌ల్లో తెలంగాణలో బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షంగా ఎద‌గ‌డం - అవ‌కాశం దొరికితే అధికారం చేజిక్కించుకోవ‌డం....ఇదే భార‌తీయ జ‌న‌తాపార్టీ జాతీయ నాయ‌క‌త్వం ల‌క్ష్యం. చూస్తుంటే ఎంత సింపుల్ గా ఉందో...ఆచ‌ర‌ణ అంత క‌ఠినం. ఈ విష‌యం గ‌మ‌నించింది కాబ‌ట్టే బీజేపీ అగ్ర‌నాయ‌క‌త్వం త‌ర‌ఫున ప్ర‌ధాని మోడీ న‌మ్మిన‌బంటు - పార్టీ టాప్ వ్యూహ‌క‌ర్త అమిత్ షా ఎంట్రీ ఇస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో మనం బలమైన శక్తిగా ఎదగాలని పార్టీ నేత‌ల‌కు ఆదేశం ఇచ్చిన షా..దానికి త‌గిన‌ట్లు స్కెచ్ సైతం పార్టీ నేత‌ల‌కు ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. దీన్ని మ‌రింత విపులంగా పార్టీ నేత‌ల‌కు చేర‌వేసేందుకు వ‌చ్చే నెల‌లో ఏకంగా మూడు రోజుల పాటు తెలంగాణ‌లో ఆయ‌న మ‌కాం వేయ‌నున్నారు. ఇలా `అమిత‌`వేగంగా దూసుకువ‌స్తున్న `షా` వ్యూహాన్ని కేసీఆర్ ఎలా ఎదుర్కుంటారనే ఆస‌క్తి అన్ని వ‌ర్గాల్లో నెల‌కొంది.

వచ్చే ఎన్నికల నాటికి మెజారిటీ లోక్‌సభ స్థానాల్లో గెలవాలనే ల‌క్ష్యం సాధించ‌డంలో భాగంగా బూత్‌ స్థాయి మొదలు రాష్ట్ర స్థాయి వరకు కుల స‌మీక‌ర‌ణాల ఆధారంగా క‌మిటీలు ఏర్పాటు చేయాల‌ని అమిత్ షా నిర్దేశించిన‌ట్లు స‌మాచారం. ఎక్కడికక్కడ కుల సంఘాలు ఏర్పాటు కావాలని, వాటన్నింటినీ ఏకం చేసిన‌ప్పుడే వచ్చే ఎన్నికల్లో విజయాన్ని సాధించగలమ‌ని అమిత్ షా పార్టీ నేత‌ల‌కు సూచించిన‌ట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని పైకి తేగానే ఈ కమిటీలను చైతన్యపరిచే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగా తాజాగా కురుమ - యాదవ కులాల సదస్సును నిర్వహించారు. ఇదే తరహాలో రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఆయా కులాలను ఏకం చేస్తూ 'కుల సదస్సులు' నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ముస్లిం రిజర్వేషన్ల వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుందనే ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ, ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమవైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ తరహా రాజకీయాలు ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితంకాగా, బీజేపీ దాన్ని దక్షిణాదికి కూడా విస్తరించే ప్రయత్నం చేస్తోంది. ఎస్సీ కులాల వర్గీకరణకు మద్దతు తెలపడం కూడా దీనిలో భాగమేననే ప్రచారం జరుగుతోంది. వర్గీకరణను ఆయుధంగా చేసుకొని తెలుగు రాష్ట్రాల్లో ఆయా కులాలపై పట్టు సాధించడం, 2019లో వర్గీకరణ చేస్తామనే హామీని ఇవ్వడం ద్వారా వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందాలనే రాజకీయ ఎత్తుగడను ప్రదర్శించే యోచనలో ఉన్నట్టు స‌మాచారం.

ఇప్ప‌టివ‌ర‌కు పార్టీ ముఖ్య‌నేత‌ల‌కు దిశానిర్దేశం చేసిన అమిత్ షా ఇప్పుడు ద్వితీయ‌, తృతీయ శ్రేణి నాయ‌కుల‌కు త‌న స్కెచ్ వివ‌రించ‌నున్నట్లు తెలుస్తోంది. అందుకే అమిత్‌షా తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజులు మకాం వేయనున్నారు. వచ్చే మే నెల 23-24-,25 తేదీల్లో ఈ ప‌ర్య‌ట‌న ఉండ‌నుంది. కుల‌-మ‌త‌ సమీకరణాల విశ్లేషణ, భవిష్యత్‌ కార్యాచరణ, రాష్ట్ర ప్రభుత్వంతో వ్యవహరించాల్సిన తీరుపై ఆయన స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ ఇస్తారని రాష్ట్ర బీజేపీ నేతలు భావిస్తున్నారు. బీజేపీ దూకుడును కేసీఆర్ ఎలా అడ్డుకుంటారో చూడాలి మ‌రి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/