Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ పొత్తుపై అమిత్ షా ఘాటు వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   30 May 2016 5:15 AM GMT
టీఆర్ ఎస్ పొత్తుపై అమిత్ షా ఘాటు వ్యాఖ్య‌లు
X
ఎన్డీఏ రెండేళ్ల పాలనపై దేశ వ్యాప్తంగా వికాస్ పర్వ్ పేరిట ప్రచారాన్ని చేపట్టిన సందర్భంగా హైదరాబాద్‌ కు వ‌చ్చిన బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ ఎస్‌ పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఎన్డీఏలో టీఆర్ ఎస్ చేర‌బోతుందంటూ వ‌స్తున్న వార్త‌ల‌ను ప్ర‌స్తావిస్తూ వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకునే విషయంలో టీఆర్‌ ఎస్ నుంచి తమకు దరఖాస్తు రాలేదని చెప్పారు. తెలంగాణలో టిడిపితో మిత్రపక్షంగా కొనసాగుతున్నారా? అని ప్రశ్నించగా - ఆంధ్రప్రదేశ్‌ లో టిడిపితో కలిసి ఉన్నామని, ఆ రాష్ట్ర మంత్రివర్గంలోనూ తమ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారంటూ సమాధానాన్ని దాట వేశారు.

ఎన్డీఏ మిత్ర‌ప‌క్ష‌మైన‌ శివసేన విమ‌ర్శ‌ల గురించి ప్రశ్నించగా, ఎన్డీఏలో ప్రజాస్వామ్యం ఉందని, ఆ సంగతి తాము చూసుకుంటామని అమిత్ షా అన్నారు. చంద్రబాబు నాయుడు పట్ల బీజేపీకి చెందిన ప‌లువురు నాయకులు అసంతృప్తిగా ఉన్న విషయం గురించి మీడియా ప్రశ్నించగా, ఆ నాయకులు ఎవరో చెప్పాలని ఆయన ఆ విలేక‌రినుద్దేశించి ఎదురు ప్రశ్నించారు.ఎపికి ప్రత్యేక హోదా గురించి ప్రశ్నించగా, ఇందులో సాంకేతిక అంశంపై 14వ ఆర్థిక సంఘం పరిశీలనలో ఉందని, అయినా ప్రత్యేక హోదాతో సమానంగా అన్ని సమకూరుస్తున్నామని అమిత్ షా సమాధానంగా వివరించారు.

దేశ వ్యాప్తంగా 200 ప్రాంతాల్లో - కేంద్రాల్లో వికాస్ పర్వ్‌ లు చేపట్టాల‌నీ బీజేపీ నిర్ణ‌యింది. అయితే ఇది వికాస్ పర్వ్ కాదు వినాశ్ పర్వ్ అని, నరేంద్ర మోదీ టూరిస్ట్ ప్రధానిగా మారారని కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా, ‘కాంగ్రెస్ విమర్శించకుండా మెచ్చుకుంటుందా?’ అని అమిత్ షా ఎదురు ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పక్షవాతం పాలసీలు చేపట్టిందని ఆయన విమర్శించారు. యుపిఎ హయాంలో 12 లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో ఒక్క అవినీతి ఆరోపణ లేదని ఆయ‌న అన్నారు.