Begin typing your search above and press return to search.

అమిత్ షా మాట!... నా కొడుకును ఏమీ అనొద్దు!

By:  Tupaki Desk   |   13 Oct 2017 11:50 AM GMT
అమిత్ షా మాట!... నా కొడుకును ఏమీ అనొద్దు!
X
త‌ప్పు చేసిన వాడు ఒప్పుకుంటే.. ఇక విచార‌ణ ఎందుకు? పోలీసుల ప‌రిశోధ‌న ఎందుకు? అన్నట్టుగానే ఉంది బీజేపీ అధ్య‌క్షుడు అమిత్ షా వ్య‌వ‌హారం కూడా. ఆయ‌న కుమారుడు జే షా కంపెనీలో అవినీతిపై ఇటీవ‌ల ది వైర్ అనే వెబ్ సైట్ తీవ్ర క‌థ‌నాల‌ను ప్ర‌సారం చేసింది. ఇవి దేశ‌వ్యాప్తంగా కూడా సంచ‌ల‌నం సృష్టించాయి. ఇక‌, ఈ కేసుల‌ను వాదించేందుకు ప్ర‌భుత్వమే న్యాయ‌వాదుల‌ను స‌మ‌కూర్చింద‌న్న‌ది మ‌రో ప్ర‌ధాన అభియోగం. వీటి విష‌యంలో పార‌ద‌ర్శ‌క‌త పాటిస్తార‌ని ఊహించిన అమిత్ షా.. ఫ‌క్తు.. కొడుకు ప‌క్ష‌పాతిగా మారిపోయారు. కొడుకు చేసిన త‌ప్పులను క‌ప్పి పుచ్చుకునే ప్ర‌య‌త్నం చేశారు.

తన కుమారుడు జే షా కంపెనీలో అవినీతి చోటుచేసుకోలేదని చెప్పారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జే షా కంపెనీ సంపద పెరిగిందన్న ఓ వెబ్‌సైట్‌ కథనాన్ని ఆయన తోసిపుచ్చారు. ఈ అంశం ఆధారంగా కాంగ్రెస్‌ పార్టీ తనను, ప్రధాని నరేంద్ర మోదీపై దాడికి దిగుతోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ పలుమార్లు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నా ఎప్పుడూ క్రిమినల్‌ దావా వేయలేదని, రూ 100 కోట్ల పరువు నష్టం దావా వేయలేదని ఎద్దేవా చేశారు. తన కుమారుడు జే షా పరువు నష్టం దావా వేశారని, న్యాయస్ధానాన్ని ఆశ్రయిస్తూ విచారణ చేపట్టాలని కోరారని చెప్పారు.

తమపై బురద చల్లే వారు ఇప్పుడు ఆధారాలతో కోర్టును సంప్రదించవచ్చని అన్నారు. అమిత్‌ షా కుమారుడు జే షాకు చెందిన టెంపుల్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ కంపెనీ స్వల్పకాలంలోనే రూ 50,000 టర్నోవర్‌ నుంచి రూ 80 కోట్ల టర్నోవర్‌కు చేరుకుందని బీజేపీ అధికారంలోకి వచ్చిన అనంతరం కంపెనీ టర్నోవర్‌ 16,000 రెట్లు పెరిగిందని దివైర్‌ వెబ్‌ సైట్‌ కథనం ప్రచురించింది. అయితే దీన్ని సవాల్‌ చేస్తూ ఈనెల 9న జే షా అహ్మదాబాద్‌ మెట్రపాలిటన్‌ కోర్టులో ఆ వెబ్‌సైట్‌పై రూ 100 కోట్లకు పరువునష్టం దావా వేశారు. ఇక‌, ఇది సొంత పార్టీ బీజేపీలోనూ ప్ర‌కంప‌న‌లు పుట్టించింది. దీనిపై మాట్టాడిన బీజేపీ సీనియ‌ర్ నేత‌ - మాజీ మంత్రి య‌శ్వంత్ సిన్హా ప్ర‌స్తుత మోదీ ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు. దీంతో ఈ ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది.