Begin typing your search above and press return to search.

పవన్ మోసం చేశాడు.. టికెట్లు దక్కని వారి ఫైర్

By:  Tupaki Desk   |   21 March 2019 7:20 AM GMT
పవన్ మోసం చేశాడు.. టికెట్లు దక్కని వారి ఫైర్
X
జనసేనలో సీట్లు దక్కని వారి అసంతృప్తి పెల్లుబుకుతోంది. జనసేనానిని డైరెక్ట్ గా టార్గెట్ చేసి సదురు నేతలు గొంతెత్తుతున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ కుటుంబాన్ని మోసం చేశాడని.. మాజీ ఎమ్మెల్యే అల్లు భానుమతి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశాంతంగా రాజకీయాలకు దూరంగా ఉన్న తమను ఇంటి నుంచి వీధికీడ్చి దగా చేశాడని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

బుధవారం విశాఖలో మీడియాతో అల్లు భానుమతి మాట్లాడారు. విదేశాల్లో మంచిగా చదువుకుంటున్న తన మనవడు రఘురాజుకు జనసేన మాడుగుల సీటు ఇస్తానని పవన్ ఆహ్వానించాడని.. దీంతో జనసేనలో చేరి ప్రచారం కూడా చేశామన్నారు.కానీ ఇప్పుడు తన మనవడిని కాదని గవిరెడ్డి సన్యాసినాయుడికి టికెట్ కేటాయించడం ఎంతవరకు సమంజసమని భానుమతి ప్రశ్నించారు. టీడీపీలో గవిరెడ్డి రామానాయుడు - జనసేనలో గవిరెడ్డి సన్యాసినాయుడు సీట్లు సంపాదించుకోవడం వెనుక కుట్ర దాగి ఉందని అల్లు భానుమతి ఆరోపించారు.

ఇక ప్రముఖ న్యాయవాది ఎర్రా సన్యాసినాయుడు మాట్లాడుతూ.. తనకు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన కల్పించి పవన్ సీటు కేటాయిస్తానని చెప్పి తాజాగా మోసం చేశాడని ఆయన ఆరోపించారు. గవిరెడ్డి సన్యాసనాయుడికి టికెట్ కేటాయించడం వెనుక టీడీపీ నాయకుల హస్తం ఉందని ఆరోపించారు. దీనిపై పవన్ ను ప్రశ్నిస్తానంటే కలవనీయడం లేదని మండిపడ్డారు.