Begin typing your search above and press return to search.

కమ్మ వాళ్ల మధ్య ప్రాంతీయ పోరు?

By:  Tupaki Desk   |   14 Feb 2016 5:15 AM GMT
కమ్మ వాళ్ల మధ్య ప్రాంతీయ పోరు?
X
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జరిగిన విభజన సందర్భంగా తెలంగాణలో చాలానే మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే.. చాలా విషయాలు తెర మీదకు రాకుండానే సైడ్ అయిపోతున్న పరిస్థితి. రెండు ప్రాంతాల మధ్య జరిగిన విభజన రేఖ.. తెలంగాణ సమాజంలోని చాలా అంశాల్లో చాలా స్పష్టంగా కనిపించటం గమనార్హం. చివరకు ప్రాంతీయవాదానికి భిన్నంగా.. కలిసి ఉండేలా చేసే కులాల్లోనూ ప్రాంతీయ కుమ్మలాటలు షురూ కావటం ఈ మధ్యన ఎక్కువైంది. సున్నితంగా ఉండే ఈ విషయాన్ని మీడియా సంస్థలు పెద్దగా ఆసక్తి ప్రదర్శించకపోవటంతో చాలానే బయటకు రాని దుస్థితి. తాజాగా అలాంటి అంశమే ఒకటి చోటు చేసుకుంది.

ఐకమత్యానికి ప్రతీకగా కమ్మ కులస్తుల్ని చెబుతుంటారు. వారు ఎక్కడున్నా సరే.. ఒకే మాట.. ఒకటే బాటగా ఉంటారని.. ప్రాంతాలకు అతీతంగా ఉంటూ.. తామంతా ఒకటేనన్న భావన వారిలో అధికమని కులాల లెక్కలు చెప్పే పలువురు కమ్మ కులస్తుల్ని పొగిడేస్తూ చెబుతుంటారు. అలాంటి కమ్మల మధ్యన ప్రాంతీయ లొల్లి షురూ అయ్యిందని తెలుస్తోంది. దీనికి నిదర్శనంగా జాతీయ కమ్మ సంఘ సమావేశంలో చోటు చేసుకున్న ఉదంతాల్ని చెప్పొచ్చు.

ప్రస్తుతం జాతీయ కమ్మ సంఘం అధ్యక్షుడిగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే.. టీడీపీకి చెందిన గాంధీ వ్యవహరిస్తున్నారు. తాజాగా జరిగిన సమావేశంలో కొందరు కమ్మలు.. ఎంతకాలం ఆంధ్రోళ్ల పెత్తనం అంటూ ప్రశ్నించటమే కాదు.. తెలంగాణకు ప్రత్యేకంగా కమిటీ వేయాలని డిమాండ్ చేయటం గమనార్హం. అంతేకాదు.. ఒక పార్టీ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న గాంధీ.. ఒక కులసంఘానికి నాయకత్వం వహించటం సరికాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అదే సమయంలో తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును అధ్యక్షుడిగా ఎన్నుకుంటామని మరికొందరు అసంతృప్త నేతలు ప్రకటించటం విశేషం.

ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న గాంధీ కుల సంఘాన్ని లీడ్ చేయకూడదు కానీ.. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఉన్న తుమ్మల ఎలా చేయొచ్చన్నది కొందరు ప్రశ్నిస్తున్నారు. కుల సంక్షేమం కోసం పాటుపడే వాళ్లు ప్రాంతాలకు అతీతంగా ఉండాలన్న స్పృహ కోల్పోయి.. కులంలోకి ప్రాంతీయ భావనలు తీసుకురావటంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల ఫలితాలు వెల్లడి తర్వాత జరిగిందని చెబుతున్న ఈ సమావేశంలో చోటు చేసుకున్న పరిణామాలు కమ్మ కులస్తుల్లో ఆసక్తికర టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ ఉదంతం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.