Begin typing your search above and press return to search.

లోకేష్ వీక్ పాయింట్ పై ఆళ్ల పంచ్!

By:  Tupaki Desk   |   24 March 2019 5:58 PM GMT
లోకేష్ వీక్ పాయింట్ పై ఆళ్ల పంచ్!
X
ప్రత్యక్ష ఎన్నికల్లో అమీతుమీ తేల్చుకోవడానికి అంటూ.. కొంతమంది తెలుగుదేశం నేతలు రాజీనామా అస్త్రాలను సంధించారు. ఎమ్మెల్సీలుగా ఉన్న వాళ్లు ప్రత్యక్ష రాజకీయాల్లో సత్తా చూపించడానికి ఆ నామినేటెడ్ పదవులకు రాజీనామా చేశారు. వారిలో రాజకీయంగా ఇప్పటికే చాలా కెరీర్ ను పూర్తి చేసిన రామసుబ్బారెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారు.

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అయితే.. తను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉండటంతో, ఎమ్మెల్సీ గా కొనసాగితే సీరియస్ నెస్ తగ్గుతుందనే భావనతో రాజీనామా చేసినట్టుగా చెప్పుకొచ్చారు. నామినేటెడ్ పదవికి రాజీనామా చేసి.. ఎమ్మెల్యేగా నెగ్గడం విషయంలో ఆయన సవాల్ కూడా విసిరారు. ఎమ్మెల్సీ పదవికి సోమిరెడ్డి రాజీనామా చేయడం, ఆ తర్వాతే ఆయన పేరును సర్వేపల్లికి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది.

అసలే సోమిరెడ్డి వరసగా ఓడిపోయిన నేపథ్యం ఉన్న వ్యక్తి. అయినా కూడా ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయంలో అమీతుమీ తేల్చుకుంటున్నారు.

అయితే నారా లోకేష్ బాబు మాత్రం అందుకు ముందుకు రాలేదు. రావడం లేదు. ప్రత్యక్ష రాజకీయంలో కెరీర్ ను ఎమ్మెల్సీగా మొదలుపెట్టారు లోకేష్. మంత్రి పదవి కోసం ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి నెగ్గకుండా.. ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు. తండ్రి అధికారంలో ఉన్నారు కాబట్టి అవన్నీ సాధ్యం అయ్యాయి. అయితే ఆ నామినేటెడ్ పద్ధతిలో మంత్రి కావడం కూడా పెద్ద సక్సెస్ స్టోరీ అని లోకేష్ చెప్పుకొంటూ ఉంటారు.

ఆ సంగతలా ఉంటే..లోకేష్ బాబు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయకుండా, ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉండటం విషయంలో ఆయన ప్రత్యర్థి ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్సీ పదవికి లోకేష్ ఎందుకు రాజీనామా చేయలేదు? అని, ఎమ్మెల్యేగా నెగ్గలేకపోతే కనీసం ఎమ్మెల్సీగా మిగిలిపోవచ్చనే సేఫ్ సైడ్ గానే లోకేష్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయలేదా? అని ఆళ్ల ప్రశ్నించారు.

మామూలుగా అయితే ఇది పెద్ద విషయం కాదు కానీ, లోకేష్ చంద్రబాబు నాయుడు తనయుడు కావడం, సోమిరెడ్డి వంటి వ్యక్తే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి సత్తా చూపించేందుకు ఉబలాట పడుతూ ఉండటం, లోకేష్ మాత్రం సేఫ్ జోన్లో ఉండటానికే ప్రాధాన్యతను ఇస్తూ ఉండటం ప్రత్యర్థులకు అవకాశంగా మారింది!