Begin typing your search above and press return to search.

ముందస్తు ఖాయమా...?

By:  Tupaki Desk   |   25 Jun 2018 2:30 PM GMT
ముందస్తు ఖాయమా...?
X
రాష్ట్రంలో ఎన్నికల నగరా ముందుగానే మ్రోగనుందా..? ఆదివారం నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్ష నేతలకు విసిరిన సవాల్ చూస్తే ముంద‌స్తు ఖాయ‌నిపిస్తోంది. అటు కేంద్రంలో ని బిజేపి కూడా ముందస్తు ఎన్నికల దిశగా అడుగులు వేస్తోంది. 2019 లో జరగవలసిన ఎన్నికలను ముందస్తుగా జరపడానికి సన్నహాలు జరుగుతున్నయి. దీని మర్మం ఏమిటి? ప్రస్తుతం రాష్ట్రం లో తమ కారు జోరుగా పరిగెడుతోందని ఇటీవల కొన్ని సర్వేలు వెల్లడించాయి, దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందామని అనుకుంటున్నారు.ఆదివారం నాటి సమావేశంలో ఆయన మట్లాడుతూ పార్టికి 100 కు పైగా సీట్లు వస్తాయని, ముందుగా ఎన్నికలకు తమ పార్టి సిద్దంగా ఉందని, మరి విపక్షాలు అందుకు సిద్దమా..? అంటూ సవాలు విసిరారు. ముందస్తు ఎన్నికలు వచ్చినప్పటికీ తమ గెలుపుపై కేసిఆర్ ధీమాగా ఉన్నారు. తమ పార్టి చేసిన మంచి పనులు ప్రజలు గుర్తించారని, వచ్చే ఎన్నికలలో టిఆర్ ఎస్ ను తప్పక గెలిపిస్తారని ఆయన న‌మ్మ‌కం. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా దక్కదని ఆయన తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కూడా ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మేన‌ని ప్ర‌క‌టించింది. ముంద‌స్తుపై కేసిఆర్ తన మాట మీద నిలబడతారా అని మాజీ ఎంపి పొన్నం ప్ర‌భాక‌ర్ ప్రశ్నించారు కూడా. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కు గెలుపు మీద నమ్మకం లేక ఇలా ముందస్తు ఎన్నికలంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. టీపిసీసీ చీఫ్ ఉత్తమకుమార్ రెడ్డి కూడా మరో 9 నెలలు మాత్రమే టిఆర్ ఎస్ పాలన కొనసాగుతుందని, ఆ తర్వత కాంగ్రస్ అధికారంలోకి వస్తుందని అంటున్నారు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్నికల వేడి మొదలైయిందనే చెప్పాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ముందస్తు ఎన్నికలకు ప్రణాళిక సిద్దం చేస్తున్నట్టు సమాచారం. చంద్రబాబు పరిస్దితి ఇటు మింగలేక అటు కక్కలేక అన్న చందాన ఉంది. నవ్యంధ్రకు ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఓటుకు నోటు కేసులో ఘోరంగా దొరికిపోయి అప్పుడూ, బిజేపితో ఇష్టం లేక పోయినా విభేదించి ఇప్పుడూ ఆయన ఇరుకున్నారు. అటు కేంద్రాన్ని నిలదీసి ప్రత్యక హోద తేలేక - విపక్షాలు హోదపై చేస్తున్న రాద్దాంతాన్ని తట్టుకోలేక ఆయన సతమతమోతున్నారు. ఇటువంటి సమయంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జగన్‌కు పెరుగుతున్న మద్దత్తు కూడా చంద్ర‌బాబు నాయుడికి ముంద‌స్తు ఆలోచ‌న‌ను ముందుకు తీసుకువెళ్తోంది.

అటు కేంద్రంలో బిజేపి కూడా ముంద‌స్తు ఎన్నికల దిశగా పావులు కదుపుతోంది. ఇందుకోసం పార్టి బలోపేతం చేయడానికి అవసరమైన కార్యచరణ ప్రారంభించింది. కేంద్రంలో కూడా ఎన్నికలకు వచ్చే సంవత్సరం మే వరకు సమయం ఉన్నప్పటికి ఈ ఏడాది డిసెంబరు నాటికి వాతావ‌ర‌ణం తమకు అనుకూలంగా వస్తే ఎన్నికలు వెళ్లాల‌ని అనుకుంటున్నట్లు సమాచారం. మోదీ తీసుకున్న కొన్ని నిర్ణయాల వలన ప్రజలు కాషయంపై కొంత గుర్రుగా ఉన్నారు. ఇదే సమయంలో రాహుల్ గాంధి - కొన్ని ప్రాంతీయ పార్టీల‌తో చేతులు క‌లుపుతూండ‌డం కూడా బిజేపీకి ఇబ్బందిగా మారింది. ‍ఈ ప‌రిస్థితుల‌లో ముందుగా ఎన్నిక‌ల‌కు వెళ్తే మేలు జ‌యుగుతుంద‌ని పార్టీ పెద్ద‌లు భావిస్తున్నారు.

రాజ‌కీయ పార్టీల మాటేలా ఉన్నా దేశ ప్ర‌జ‌ల‌కు మాత్రం వాంచ‌నీయం కాదు. ఐదేళ్లు అధికారంలో ఉండ‌మ‌ని ప‌ట్టం క‌డితే దాన్ని కాద‌ని ముందుగా ఎన్నిక‌లు జ‌ర‌ప‌డం ప్ర‌జాస్వామ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు.