Begin typing your search above and press return to search.

బాబు అడ్డం తిరిగింది అందుకే..

By:  Tupaki Desk   |   13 March 2018 2:20 PM GMT
బాబు అడ్డం తిరిగింది అందుకే..
X
కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వలేదని, బడ్జెట్లో అన్యాయం చేసిందని ఆరోపిస్తూ మోదీ ప్రభుత్వం నుంచి చంద్రబాబు తన మంత్రులను ఉపసంహరించుకున్నాక రెండు పార్టీల మధ్య వ్యవహారం రోజురోజుకీ చెడుతోంది. టీడీపీ దూకుడు ప్రదర్శిస్తూ బీజేపీపై ఇప్పటికే తీవ్ర స్థాయిలోనే విమర్శలు చేస్తుండగా ఏపీ బీజేపీ నేతలూ ఖండనలతో మొదలు పెట్టి మెల్లమెల్లగా స్వరం పెంచుతున్నారు. అందులో భాగంగా ఎమ్మెల్యేలు ఆకుల సత్యనారాయణ - విష్ణుకుమార్ రాజులు టీడీపీ తీరును తప్పు పట్టారు. చంద్రబాబు హఠాత్తుగా తమకు దూరం ఎందుకయ్యారో ఆకుల సత్యనారాయణ వివరించారు.

తమ పార్టీపై టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడతామని బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు విభజన రాజకీయాలు చేస్తున్నారని - దేశాన్ని ఉత్తరాది - దక్షిణాదిగా విభజించి ఆయన మాట్లాడటం సబబు కాదని - ఈవిధంగా మాట్లాడటం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటే గతంలో అంగీకరించిన చంద్రబాబు - ఇప్పుడు - ప్రత్యేకహోదా కావాలని అంటున్నారని, రాజకీయ లబ్ధి కోసం ఆయన యూ టర్న్ తీసుకున్నారని విమర్శించారు.

మరోవైపు విష్ణుకుమార్ రాజు కూడా టీడీపీ నేతల విమర్శలను తిప్పికొట్టారు. కేంద్ర ప్రభుత్వం నుంచి టీడీపీ వైదొలగిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దగ్గరవుతోందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. జ‌గ‌న్ లాంటి ఆర్థిక నేరగాళ్లకు మోదీ అపాయింట్‌ మెంట్‌ ఎలా ఇస్తారని ఈ రోజు ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ప్రశ్నించిన విషయం తెలిసిందే. టీడీపీ నేతలు చేస్తోన్న ఆరోపణలపై విష్ణు కుమార్ రాజు స్పందిస్తూ... ‘‘మాకు జగన్ తో ఎలాంటి రహస్య ఒప్పందాలు లేవు. ఒకవేళ ఏదైనా ఒప్పందం ఉంటే మేమే చెబుతాం' అన్నారు.